ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కెటిఆర్ పర్యటన
పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన పలుపనులను ప్రారంభించిన మంత్రి
ఎల్లారెడ్డిపేట, మే 04(ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బందు పథకం గొప్ప చారిత్రత్మాకమైనదని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గడిచిన ఎనిమిది సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో పలు గ్రామాలలో మంత్రి కెటిఆర్ బుధవారం పర్యటించారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్వాగత తోరణాలను ప్రారంభించారు. పాతబస్టాండ్లో గ్రామసర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి తన స్వొంత నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన చాయి కేతిరి విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. కొత్తబస్టాండ్ సమీపంలో కరీంనగర్, కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన పాపాతల్లి బొమ్మలను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అక్కపల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డులో దళిత బందు పథకం ధ్వారా పదిర గ్రామానికి చెందిన లబ్దిదారునికి మంజూరైన నిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన రైస్మిల్ భవన నిర్మాణ పనులకు మంత్రి కేటిఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శిలాపలకాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…2023లో జరిగే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 3వ సారి అధికారంలోనికి రావడం ఖాయమన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రికి తాటిముంజలను అందించారు. ఆ తర్వాత మంత్రి కెటిఆర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శివసాయి మణికంఠ గార్డెన్లో రాజన్న పేట గ్రామ సర్పంచ్ సోదరుని వివాహానికి హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత వెంకటాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ సిద్దోగానికి హజరై దేవాలయంలో మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత సిరిసిల్లా జిల్లా కేంద్రానికి వెళ్లారు. కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ వెంట రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా జడ్పి చైర్పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.