ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్ ద్వారా ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం. మీరు ప్రశాంత్ కిషోర్ లు అయితే తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరాలన్న సంగతి యాది మరువొద్దు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనే మహత్తరమైన ఫలితం తన వనరుల మీద తన అధికారానికి సంబంధించినది. తెలంగాణ సమాజం తన వనరులు తనకు దక్కనీయకుండా ఇతరుల వశం కావడానికి వీళ్ళేదని ఉద్యమకాలంలో ప్రస్పుటంగానే వెలిబుచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష స్వయం పాలన,ఆత్మ గౌరవం. అందుకోసమే తెలంగాణ తండ్లాట ప్రారంభం ఐనది. ఈ సందర్భంలో తెలంగాణ తన ధిక్కార స్వరాన్ని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తి ని ప్రపంచ పటంలో నిలిపింది. తెలంగాణ ప్రజలు ఏనాడు ఆధిపత్యాలను పీడనలను మౌనంగా సహించలేదు.అదే తెలంగాణ ప్రజా చైతన్యం.ఈ ప్రజలకు కావలసిన చైతన్యాన్ని ఇచ్చింది బుద్ధి జీవులే.
ప్రజలను సంఘటిత పోరాటాలకు కూడా సిద్ధం చేసినారు.ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు అనుకుని ఆశపడే పరిస్థితి ఉద్యమ కాలంలో బాగా బలపడింది.అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో ఒక పాక్షిక విజయాన్ని అందించింది.ఇవాళ తెలంగాణ తానంతట తానే ఒక రాష్ట్రంగా మారింది. ఈ ప్రత్యేక పరిస్థితి వలన పాలక పక్షం మిగిలిన రాజకీయ పక్షాల కన్నా భిన్న మైనదని…
ప్రజానుకూలమైనదని. ప్రగతి శీలమైనదని..ప్రజాస్వామ్యమైనది అని అనుకునే అవకాశం వచ్చింది.. ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా పరిష్కరిం చగలిగే సమస్యలను ‘‘ప్రజలు డిమాండ్ల రూపంలో’’ప్రభుత్వం ముందుంచారు.ఆ డిమాండ్లను పరిష్కరించే ఆలోచనలు చేయకపోగా వలసవాద అభివృద్ధి నమూనాను వ్యూహాత్మకంగా అమలు చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం.
కుటిల ఆలోచనలతో అధికారం వస్తదా ..!
ఇవాళ తెలంగాణ లో అవినీతిమయమైన ,దాష్టీకపు పాలన నడుస్తుంది. తెలంగాణ ప్రజల హక్కులు కాలరా యబడుతున్నాయి. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ‘‘తెలంగాణ రాష్ట్రంలో’’ ఆ కుటుంబాలు పరాయివాళ్ళుగా బతుకులీడుస్తున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు, వాటి మీద పోరాటాలు నిత్యం పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పాలనా విధానాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పౌర సమాజం నిత్య జాగరుకతతో వ్యవహారిస్తూ ప్రభుత్వం ప్రజా ఆకాంక్ష లను అణచివేస్తున్న ప్రతి సందర్భంలో నిలదీస్తూ వస్తుంది.
ప్రధానంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం పాటుపడిన వారు ప్రభుత్వం నుంచి నిర్బంధాలు ఎదుర్కొన్నవారు, ఎదుర్కొంటున్న వారు పాలక వర్గాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు.అనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ పోరాటాల గడ్డ.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి 610 జి.ఓ.14 (ఎఫ్)సంసద్ యాత్ర, సమరభేరి,రాష్ట్ర సాధన వరకు పోరాటాలను అధ్యయనం చేస్తే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల చైతన్యం వెలకట్టలేనిదని చరిత్రే వెలిబుచ్చుతుంది.
ఈ చైతన్యాన్ని,ఈ ప్రశ్నించే గొంతుకలను,ధిక్కార స్వరాలను అణిచివేయడాని కై కుటిల విధానాలను రుపొందించుకోవడానికే ప్రశాంత్ కిషోర్ ను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించినదనేది వాస్తవం కాదా.! .తన క్రత్రిమ మేధస్సును ఉపయోగించి తెరాస ను మరో దఫా అధికారంలో కి తేవడానికి తన ఆలోచనలకు పదును పెడుతున్నారనేది యదార్థమే కదా.!
ప్రజా వ్యతిరేకతను పక్కతోవ పట్టించడమే పీకే విధానమా..!
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు..ఎన్నికలు అంటే ప్రజల ఆకాంక్షలు..కానీ ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలలో ..! ప్రజలకు ఎంత మేరకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు…! ఎన్నికలు అంటే కేవలం వోట్లు, సీట్లు అనే నిర్వాహణ స్థితి కి ఎందుకు తీసుకువచ్చారు..? సైద్ధాంతిక పునాదులు, భావ సారూప్యత లేకుండా విచ్చలవిడిగా విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలను పాలనలో భాగస్వామ్యానికి దూరంగా ఉంచడం, ప్రజల సంఘటిత పోరాటాలు రాజ్యాంగ బద్దంగా నిర్వహించుకునే అవకాశాలను ఈ పాలకులు నిర్వీర్యం చేయడం..ఆ తరహాలోనే ప్రశాంత్ కిషోర్ అలోచనల పదునులో కుయుక్తులు పన్నుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుండే ఎక్కువగా రాజ్యాంగబద్ద సంస్థల కంటే నిఘా విభాగం మీద గత పాలకుల కంటే రెట్టింపు స్థాయిలో ఆధారపడుతూ వస్తుంది. కారణం ఏమై ఉండవచ్చు.? తమ విధానాల మీద తమరి కి విశ్వాసం లేకపోవడం కావొచ్చు..
లేదా గతంలో ఈ ప్రాంతాన్ని ఏలిన నైజాం ప్యూడల్ ఆలోచనల ను అమలు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి లో వచ్చి ఉండవచ్చు. ఆ తరుణంలో నే ప్రశ్నించే గొంతుకలను పౌర సమాజాన్ని ప్రతి పక్షాలను అణగ దొక్కుకుంటూ వచ్చారు.ఎంత అణచివేసినా తెలంగాణ సమాజం కొంత సమయం వరకే భరిస్తూందన్న విషయం చరిత్ర నే చెబుతుంది కాబట్టి ఇక ప్రజా వ్యతిరేకతను,ప్రజా చైతన్యాన్ని రాబోయే కాలంలో నిఘా విభాగం అందిపుచ్చుకోలేదేమో..అనే ఆలోచన పరంపరల నుండే పీకేని ని రంగంలో కి దించారనేది యదార్థం.! వాస్తవం గా ఈ ప్రభుత్వ పెద్దలకు ఉద్యోగ బృందం మీద నమ్మకం లేదు.. ప్రజల పైన నమ్మకం లేదు..కారణం ఏమిటంటే ప్రభుత్వం రూపొందించిన విధ్వంసకర అభివృద్ధి నమునా పై సకల వర్గాల వ్యతిరేకత పెరిగిందని నిఘా విభాగం నివేదికలు ఇస్తేనే పీకేను రంగంలోకి దించారు.
పాలక పక్షం పై ఉన్న వ్యతిరేక వైఖరిని కప్పి పుచ్చుకోవడానికి, తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా కాకుండా ఉండడానికి, అభద్రతా భావం నుండి గట్టెక్కడానికి.. ప్రతిపక్షాలను,ప్రజా సంఘాల ను తన చట్రంలో బిగించడానికే ..వడ్ల కొనుగోలు, కొత్త రాజ్యాంగం, ప్రచార ఆర్భాటాలు,కేంద్రం పై పోరాటం,చేయని అభివృద్ధి పై దృష్టి మరల్చడం,ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి మొదలైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పీకే స్టంట్ లు ఉన్నాయి. అవే ఎన్నికల నిర్వాహణ గా చిత్రీకరిస్తున్నారు.
ఎన్నికలంటే అధికార దాహమా.!
దేశం లో ప్రారంభంలో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్నికలు, భూపంపిణీ,సామాజిక అంశాల ప్రాతిపదికన జరిగాయి.అప్పుడు ప్రజా ఆకాంక్షలు బహిర్గతం అయి పాలకుల మీద ఒత్తిడి పెరిగి సమస్యల పరిష్కార ఆలోచన దిశగా నడిచినవి.1960 నుండి దేశంలో వచ్చిన అనేక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు మరియు నక్సల్బరి ఉద్యమాలు పాలకుల రాజకీయాల వెలుగులో ప్రజల ఆకాంక్షలు భయటపడినవి. ఈ ప్రాంతంలో ఉద్యమాలు చాలా బలమైన పాత్ర పోషించాయి.ప్రగతిశీల ఉద్యమాలు ద్వారా ప్రజల బలమైన ఆకాంక్ష ల వ్యక్తీకరణ సాధ్యం ఐనది.
అవి ఆనాటి ఎన్నికల్లో కూడ భయటపడ్డాయి.1980 నాటికి వచ్చిన సామాజిక ఉద్యమాలు ఉన్న ప్రభుత్వాలను ఓడించి కొత్త ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం వచ్చింది.సారా వ్యతిరేక ఉద్యమం వలన ఏర్పడిన పరిణామాలు సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రభుత్వ ఎజెండా లో భాగంగా వచ్చింది.ఈ సందర్భంలో ప్రజలు ఎప్పుడు సామూహిక శక్తి ని కోల్పోలేదు.1990 ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా న్యాయబద్ధమైన అనేక అస్థిత్వ ఉద్యమాలు సమాజం లో తమకు దక్కాల్సిన గౌరవం ఎన్నికల ఎజెండా లో ప్రధాన భాగం అయ్యాయి.రాజకీయ పాలనలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నం ఎన్నికల ద్వారా వ్యక్తికరించబడ్డాయి.
ఈ నేపథ్యంలో పాలకులను ఓడించి ప్రజలు తమ ఆసక్తులను గెలిపించుకోవడాని కి ప్రజాసంక్షేమమే పాలకులకు ప్రధాన కర్తవ్యాలుగా ఉండాలని ఎన్నికల ను ఒక సామూహిక ఆయుధం గా ఉపయోగించుకొని ప్రజలు తమ ఆకాంక్ష లను వ్యక్తీకరించుకోవడానికి ఒక అవకాశం కలిగింది.ఆ వ్యక్తీకరణ ఎన్నికల లో పార్టీ లను, ప్రజాస్వామికరించుకోవడానికి దోహదపడ్డాయి.
పీకేలాంటి నకిలీ విత్తనాలు తెలంగాణ లో పండుతాయా.!
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఐన తర్వాత అన్ని గుణాత్మకమైన అంశాలు అభివృద్ధి తో సంబంధం లేకుండా ఉధ్యమ స్ఫూర్తిని నిలబెట్టింది.ఇదే కేసీఆర్ ను ఎన్నికల లో గెలిచేలా చేసింది.అనంతరం ఈ పాలనలో అమలుకాని ఎన్నికల హామీలు ,చోటు దక్కని ఆకాంక్ష లు చాలా ఉన్నాయి.దీనితో ఈ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ మాత్రం సమాచారం పీకే లాంటి వ్యక్తులు చెబితే కానీ పాలకులకు సొయి రాలేదనేది ఆయన రంగంలో కి దిగడంతో స్పష్ఠమవుతుంది.
ఎన్నికల ఇంజనీరింగ్ పీకే లాంటి మార్కెట్ ఆలోచన కలిగిన వారి సలహాలు ప్రభుత్వం , ప్రజలకు ఉచితంగా దక్కుతుందనే మాయా ప్రపంచాన్ని సృష్టించి ప్రజలను ఎన్నికలు తెలియని వోటర్లుగా మార్చడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం జరుగుతోంది.ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు సమ్మతిని పొంది ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తారు.అప్పుడు ప్రభుత్వాలు ప్రజా విశ్వాసం కోల్పోతారు.కాబట్టి ఈ ఎన్నికల ఇంజనీరింగ్ ప్రజాస్వామ్య అవశేషాలు పై జరిగే పెద్ద దాడిగా చూడాల్సి ఉంటుంది.ఈ పాలకులు స్వరాష్ట్రం లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం పీకే లాంటి క్రత్రిమ/కుటిల ఆలోచనల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే తపనను తెలంగాణ ప్రజలు పసిగట్ట లేరా..!
ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్ ద్వారా ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం. మీరు ప్రశాంత్ కిషోర్ లు అయితే తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరాలన్న సంగతి యాది మరువొద్దు.
– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192