జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన సరైంది కాదు

ఐజేయూ, టీయూడబ్ల్యూజే
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం ప్రెస్‌ ‌మీట్‌లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ సమర్ధనీయం కాదని ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజేయూ) అధ్యక్ష, కార్యదర్శులు కే. శ్రీనివాస్‌ ‌రెడ్డి, వై.నరేందర్‌ ‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్‌, ‌కే విరాహత్‌ అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మీడియాలో అవాస్తవ కథనాలు వొస్తే వివరణ ఇవ్వడం, ఖండించడం, ఇంకా కాదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కానీ, ఆ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వ సౌకర్యాలను ఇవ్వబోమని చెప్పడం సబబు కాదని వారు సూచించారు. మీడియా సంస్థల ఎడిటోరియల్‌ ‌పాలసీకి జర్నలిస్టులను జవాబుదారీ చేయడం అసంబద్ధమని వారు పేర్కొన్నారు. శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నందుకు గాను ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్యెల్యేల జీత భత్యాలను, సౌకర్యాలను, నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపి వేస్తున్నారా అని వారు ప్రశ్నించారు. లోపాలను ఎత్తి చూపే మీడియా సంస్థల పట్ల ఇలాంటి వైఖరిని అనుసరించడం సమంజసమని కాదనీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరిని సమదృష్టితో చూసినప్పుడే గౌరవంగా, హుందాగా ఉంటుందనీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *