- ఉనికిని కోల్పోతున్న పత్రికా రంగం
- ఎపి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ఆందోళన
అనంతపురం, ఫిబ్రవరి 25 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు ‘‘నాడు- నేడు’’ ఏవిధంగా అమలు జరుగుతున్నయో, అదే విధంగా జర్నలిజంలో కూడా నాడు నేడు అని విడదీసి చర్చించు కోవలసిన తరుణం ఆసన్నమైందని దేవులపల్లి అమర్ అన్నారు. సీనియర్ జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురము లలిత కళా పరిషత్లో నిర్వహించిన సభలో ‘‘జర్నలిజం నాడు – నేడు’’ అంశంపై రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేసిన తిమ్మారెడ్డి తనకు మంచి మిత్రుడని, పత్రికా రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖ పాత్రికేయులతో వారు కలిసి పనిచేశారని వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని, జర్నలిస్టుల సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని, వారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువస్తే, జర్నలిజంలో ఆణిముత్యాలు వెలుగులోకి తీసుకు వచ్చినట్లు అవుతుందని అమర్ సూచించారు.
పత్రికా స్వేచ్ఛ, ప్రజా స్వేచ్ఛ తప్ప యాజమాన్యాలకు చెందినది కాదు అని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులు అందరూ ఒకప్పుడు పత్రికలు నడిపిన వారేనని, స్వాతంత్య్రం తరువాత పాత్రికేయం ఒక వృత్తిగా మారిందని అన్నారు. వ్యాపార ధోరణితో పాత్రికేయరంగంలో ప్రవేశించిన వ్యాపారవేత్తలు నేడు ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలను ఉపయోగించు కుంటున్నారని, వారి ఆదేశాల మేరకు ప్రభుత్వాలు నడవాలని శాసించే స్థాయికి చేరుకున్నారని, అభిప్రాయపడ్డారు. నాడు సత్యాన్వేషణ లక్ష్యంగా ప్రారంభం అయిన పత్రికా రంగం నేడు తన ఉనికిని కోల్పోయింది, అని, సరైన వేతనాలు లేకపోయినా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు పనిచేస్తున్న విలేఖరులు మాత్రం కనీస వేతనం అమలుకు నోచుకోక పోయినా తమ విధులను నిర్వర్తించడం అభినందనీయమని, సంఘంలో వారికి గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం వేసిన ఒక కమిటీలో జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి ఆమోదం తరువాత ప్రతిపాదనలు అమలవుతాయని అమర్ తెలిపారు. అనంతపురము జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు. ఉరవకొండ మాజీ శాసన సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.