- ప్రశ్నా పత్రాల లీకేజీ వరకు కేటీఆర్ దే బాధ్యత …!
- నీ పరువుకే రూ.100 కోట్లయితే….30 లక్షల మంది భవిష్యత్కు ఎంత మూల్యం చెల్లిస్తావ్?
- నోటీసులపై లీగల్గానే ఎదుర్కుంటాం…
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే… నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందే
- కేటీఆర్ లీగల్ నోటీస్పై బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : ‘‘నేను మళ్లీ చెబుతున్నా…..జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుండి నేటి ప్రశ్నాపత్రాలు లీకేజ్ వరకు ఐటి శాఖ మంత్రే బాధ్యత వహించాలి..నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుండి కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలి.. అని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడి పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని తనకు లీగల్ నోటీస్ జారీ చేసినట్లు వొచ్చిన వార్తలను పత్రికల్లో చూశానని..అయితే ఉడుత బెదిరింపులకి బెదిరిపోయేది లేదని, లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతామని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, తాను ఈ సందర్భంగా కేసీఆర్ కొడుకును ఒకటే అడగదల్చుకున్నానని….
తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుండి నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే….. తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు..అని దుయ్యబట్టారు. కేసీఆర్ కొడుకు ఒక స్వయం ప్రకటిత మేధావి.. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడు.. ప్రశ్నిస్తే తట్టుకోలేని..పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని మూర్ఖుడు..మీ పాలనలో భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గుడు..
అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రధానమంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనం. .ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారు..సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్కి ఎలా లీక్ అవుతున్నాయి..మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేసీఆర్ కొడుకు పదుల సంఖ్యలో నిందితుల అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? ఇద్దరు మాత్రమే దోషులంటూ సర్టిఫికెట్ ఇస్తూ కేసును నీరుగార్చేందుకు యత్నించిన కేసీఆర్ కొడుకుపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ప్రశ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నందుకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదో జవాబివ్వకుండా తప్పిదాలను ప్రశ్నిస్తున్న మాపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా? సిట్ బెదిరింపులకు బెదిరేది లేదు..అని బండి సంజయ్ స్పష్టం చేసారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందని, కేసీఆర్ కొడుకును మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.