గిరి గీసిన ముక్కోణపు పోరులో గెలుపెవరిది?

ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు తిరుగులేదని, కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని అనుకుంటోంది. ఎఐఎం కూడా రాష్ట్ర పాలనలో తన భాగస్వామ్యం ఉండేలా చూడాలంటే గెలుపు ప్రధానమని భావిస్తోంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఈ గెలుపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉపకరిస్తుందని చెబుతోంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో చక్రం తిప్పాలని అనుకుంటోంది. ఇలా అన్నీ పార్టీలు తమదే గెలుపు అన్నట్లుగా బరిలోకి దిగాయి. చివరకు వోటరు అంతిమంగా ఎవరిది గెలుపు అని నిర్ణయిస్తారో చూడాలంటే వేచి ఉండాల్సిందే.

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై అంచనాలు ఉత్కంఠ భరితంగా తయారయ్యాయి.  వివిధ మాధ్యమాలు ఇతర సామాజిక, రాజకీయ అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల ఫలితాలు తలకో విధంగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలను ప్రకటించినప్పుడు అధికార బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, మళ్ళీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని  ప్రచారంలో ఉండేది.. కాంగ్రెస్‌ కు ప్రజాదరణ నిగూఢంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య విభేదాలు, భారాస ను ధీటుగా  ఎదుర్కొనే సమర్థ నాయకత్వం లేదని భావించారు. పల్లెల్లో పట్టు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పోటీ చేసే సత్తా లేదన్న అభిప్రాయంతో బీఆర్‌ఎస్‌ గెలుపు సులువని భావించారు.

ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు తిరుగులేదని, కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని అనుకుంటోంది. ఎఐఎం కూడా రాష్ట్ర పాలనలో తన భాగస్వామ్యం ఉండేలా చూడాలంటే గెలుపు ప్రధానమని భావిస్తోంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఈ గెలుపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉపకరిస్తుందని చెబుతోంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో చక్రం తిప్పాలని అనుకుంటోంది.  దాదాపు అభ్యర్థుల పేర్లన్నీ ఖరారై నామినేషన్ల దాఖలు కూడా ప్రారంభమై అన్ని పార్టీలు తమదే గెలుపు అన్నట్లుగా బరిలోకి దిగాయి. పోటీలో బీఎస్పీ,పొత్తులో టిజెఎస్‌, సిపిఐ భాగస్వాములయ్యాయి. ఇక ఇండిపెండెంట్ల విషయం చేప్పేదేముంటుంది. చివరకు వోటరు అంతిమంగా ఎవరిది గెలుపు అని నిర్ణయిస్తారో చూడాలంటే వేచి ఉండాల్సిందే.
అధికార పరిరక్షణ భారాస ధ్యేయం..

ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పుడు అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న కేసీఆర్‌ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తున్నారు. తమ విజయం నల్లేరు మీద నడకే అని అనుకున్న కేసీఆర్‌ కూటమి ఏర్పాటు, తెలుగుదేశం పరోక్ష మద్దతు చూసి ప్రత్యర్థులను ఎదుర్కోవడం సులువుకాదని అర్థం చేసుకుని ధోరణి మార్చుకున్నారు. ప్రజలను ఆకట్టుకునే ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశారు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట మంత్రులను, సీనియర్లను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. వంద సీట్లు గెలిచి అధికారంలోకి రావాలన్న లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో అడ్డంకులు ఎదురవు తున్నాయని గ్రహించారు.  కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రకటించిన అభ్యర్థులను పట్టించుకోకుండా నిరసనలు వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నష్ట నివారణ చర్యలపై దృష్టి కేంద్రీకరించి సర్వం తాను, కె టి ఆర్‌, హరీష్‌ రావు, కవితలై సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినా పరిస్థితిలో మార్పులు రాకపోవడంతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించి, ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతున్న నియోజకవర్గాలపై శ్రద్ధ పెంచారు.  బీఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా నియమించారు. కుటుంబ సభ్యులు తారక రామారావు, హరీశ్‌రావు తదితరులకు ఆ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించారు. మిగిలిన ఇన్‌చార్జిలు అందరూ ఎన్నికలు ముగిసే వరకు ఆయా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి ఎన్నికల బాధ్యతలు నిర్వహించేలా కేసీఆర్‌ ఆదేశించారు.

ఎంఐఎం పోటీ చేసే ఏడు స్థానాలను మినహాయించి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి, ఇబ్రహీంపట్నం   ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10 స్థానాలు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు స్థానాల బాధ్యత హరీశ్‌కు ఇచ్చారు. సిద్ధిపేట పొరుగున ఉండే జనగామ, హుస్నాబాద్‌ సెగ్మెంట్ల బాధ్యతలు కూడా హరీశే పర్యవేక్షించనున్నారు. ఇవిగాక ప్రతిష్టాత్మకంగా భావించిన స్థానాల  బాధ్యతలను ఎమ్మెల్సీ కవితకు అప్పగించారు. అభ్యర్థుల ప్రచారం విషయంలో అసంతృప్తితో ఉన్న స్థానాల బాధ్యతను నమ్మకస్తులకు  అప్పగించి.. సర్వం తానై వ్యవహరి స్తున్నారు. వంద సీట్ల లక్ష్య సాధనలో ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రత్యేకంగా మొత్తం 70 రోజుకు మూడు, నాలుగు నియోజక వర్గాలలో తానే పర్యటిస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

పాతబస్తీ పైనే ఎంఐఎం దృష్టి
ఈఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని మారిన పరిస్థితుల్లో సాధ్యమైనంతవరకు అన్నీచోట్లా గెలవాలని ఎంఐఎం  భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా 9 అసెంబ్లీ సెగ్మెంట్లపై విశ్వాసంతో బరిలో దిగింది.  తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అఖిల భారత మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎఐఎంఐఎం) పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఏడుగురు సిట్టింగ్‌లతో పాటు, అదనంగా మరో రెండు స్థానాలనుంచి పోటీ చేయనుంది.  ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న అహ్మద్‌ పాషా ఖాద్రి, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌లు అభ్యర్థులుగా పోటీలో ఉండరని, వారిద్దరి సేవలు పార్టీకి ఉపయోగించుకుంటామన్నారు. ముగ్గురి పేర్లు ఖరారు చేయకుండా పెండిరగ్‌లో ఉంచింది. ప్రస్తుతం ఏడు స్థానాల్లో ఎంఐఎ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండగా, కొత్తగా 2 స్థానాలైన రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ నుంచి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. ఇక బహదూర్‌పుర, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ నియోజ కవర్గాల అభ్యర్థుల్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడిరచారు. గత దశాబ్దంగా భారాస కు మిత్రపక్షమైన ఎంఐఎం అదే ధోరణి ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌, భాజపా కు వ్యతిరేకంగా గళమెత్తుతోంది.
కాంగ్రెస్‌లో కదన కుతూహలం తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని, ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధి, సోనియా కూడా పట్టుదలతో ఉన్నారు.

ఆ లక్ష్యంతో వారు ప్రత్యేకంగా రాష్ట్రంపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు విడతల తెలంగాణలో పర్యటించి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన రాహుల్‌, ప్రియాంక, తర జాతీయ స్థాయి కాంగ్రెస్‌ నేతలు  అభ్యర్థుల ఎంపికలో కూడా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. పిసిసి అధ్యక్షుడు, యువనేత, భారాస కు నిద్రపట్టనీయని రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం సర్వాధికారాలూ అప్పంగించి పై  నుంచి పర్యవేక్షిస్తోంది. అసంతృప్తి, అసమ్మతికి ఆస్కారం ఇవ్వకుండా గెలుపు ధ్యేయంతో అభ్యర్థులను ఎంపిక చేసి వారి పరిథులు నిర్ణయించి నిర్దుష్టమైన విధులు, బాధ్యతలు కేటాయించింది. చేరువలోని కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రులు, ఇతర నేతలను తెలంగాణలో ప్రచారానికి దింపి ఆరు వాగ్దానాల మానిఫెస్టోతో పరుగులెత్తుతున్నది. తమకు ప్రజల మద్దతు నమ్మకంపై, అసమ్మతిని ఎక్కడికక్కడ అణచివేయడానికి వెనకాడకుండా, కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస పై నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా వాడుకునే ప్రయత్నంలో మునకలై ఉంది. తెలంగాణ ఇచ్చినప్పటికీ గత ఎన్నికల్లో ప్రజలకు చేరువ కాలేకపోయిన కాంగ్రెస్‌ను ఈసారి ప్రజలే ఆదరించేలా వ్యూహ రచన చేస్తున్నారు. రాహుల్‌, ప్రియాంక ప్రత్యేక దృష్టి రాష్ట్ర పార్టీ నాయకుల్లో కూడా ఉత్సాహం పెంచింది.. ఇందుకు తోడు ఇతర పార్టీలు కూడా సహకారం ప్రకటించడంతో విజయం తథ్యమన్న భావనలో కాంగ్రెస్‌ శ్రేణులు ఉన్నాయి.
కాంగ్రెస్‌, సిపిఐ, టీజెఎస్‌, పరోక్షంగా  తెలుగు దేశం పార్టీ కలిసి ఉమ్మడి కూటమిగా ఎన్నికల్లో  శక్తి యుక్తులు ధారపోస్తున్నాయి.  బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు అవగాహనతో ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. సిపిఐ తో ఒప్పందం కుదిరింది. వై ఎస్‌ ఆర్‌ టి పి నాయకురాలు షర్మిల నేరుగా రంగంలో లేకుండా తప్పించి ఆమె పార్టీ మద్దతు ప్రకటించేలా సఫలం  అయ్యారు. నెలరోజులుగా పరిణామాల వలన వోటర్లలో కూడా మార్పు కనిపించింది. అకస్మాత్తుగా తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల లోపాలు బయటపడి భారాస పట్ల, నాయకత్వం పట్ల వ్యతిరేకతను పెంచడం మొదలైంది. అది కాంగ్రెస్‌ మిత్ర పక్షాలకు  కలసివచ్చిన అదృష్తమైంది. నీటి పథకాల లోపాలను కప్పిపుచ్చుకోవడం భారాసకు తలకు  మించిన భారమైంది.  అంతవరకు టీఆర్‌ఎస్‌వైపే ఉన్న అంచనాలు క్రమక్రమంగా జారిపోతూండగ, మరోవైపు కాంగ్రెస్‌ మిత్రుల బలం పుంజుకున్నట్లయింది.

బిజెపిలో ఉత్సాహం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఏ పార్టీతోనూ ప్రత్యక్షంగా పొత్తు లెకున్నా  అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్‌ అసెంబ్లీ పోటీ నుంచి తప్పుకుని పార్టీ గెలుపు ధ్యేయంగా ప్రచార బాధ్యతలకే పరిమితమయ్యారు.. ఇప్పటికే మూడు విడతల్లో 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన భాజపా మిగిలిన స్థానాల్లో ఎంపికకు కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపేందుకు భారాసలో, కాంగ్రెస్‌లో సీట్లు దక్కనివారిని తమ పార్టీలోకి ఆకర్షిస్తూ స్థానిక బలం పెంచుకునే కృషిలో ఉంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో భాజపా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యనేతలు,  హాజరవు తున్నారు. ప్రధాని నరేంద్ర మోది, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా.. ఇప్పటికే తెలంగాణలో పలు సభల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీతో మూడు, నాలుగుచోట్ల బహిరంగ సభలకు పార్టీ ఏర్పాట్లుచేస్తోంది. కేంద్ర మంత్రులు, ఇతర భాజపా పాలిత  రాష్ట్రాల ముఖ్య మంత్రులు, పార్టీ కీలక నేతలను రంగంలోకి దించింది. ప్రధాన శత్రువు  కెసిఆర్‌ పై విమర్శల తుపాను సృష్టిస్తోంది. కాంగ్రెస్‌ నూ లెక్క జేయకుండా ప్రధాని, హోం మంత్రులపై ఆధార పడిరది. ఇటీవలి వరకూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ భారాస కు మింగుడు పదని ముద్దలా తయారై విమర్శ, ఆరోపణాస్త్రాలు కెసిఆర్‌ కుటుంబంపై సంధిస్తున్నారు. కుంగి పోతూ, కూలిపోతాయన్న భయం కలిగిస్తున్న నీటి ప్రాజెక్టులను, అవినీతిని,  కుటుంబ పాలనను తూర్పార పడుతున్నారు. మరో ఎంపి, ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌ భారాస కు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. నూతన అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డి ఎన్నికల రంగంలో లేకుండా ప్రచార బాధ్యతలు భుజాని కేసుకున్నారు.

ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు తిరుగులేదని, కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని అనుకుంటోంది. ఎఐఎం కూడా రాష్ట్ర పాలనలో తన భాగస్వామ్యం ఉండేలా చూడాలంటే గెలుపు ప్రధానమని భావిస్తోంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఈ గెలుపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉపకరిస్తుందని చెబుతోంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో చక్రం తిప్పాలని అనుకుంటోంది. ఇలా అన్నీ పార్టీలు తమదే గెలుపు అన్నట్లుగా బరిలోకి దిగాయి. చివరకు వోటరు అంతిమంగా ఎవరిది గెలుపు అని నిర్ణయిస్తారో చూడాలంటే వేచి ఉండాల్సిందే.
 – నందిరాజు రాధాకృష్ణ,
     98481 28215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *