ఇక్కడి అన్నదాతలకు చేసిందేవి• లేదు…. పంజాబ్ రైతులకు చెక్కులా
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంఎల్ఏ శ్రీధర్ బాబు
కరీంనగర్, ప్రజాతంత్ర, మే 28 : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వొచ్చిన కేసీఆర్ ప్రజలను నిండాముంచి ఫాంహౌజ్కే పరిమితమయ్యారన్నారు. సచివాలయానికి రాకుండా పాలన చేస్తున్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వొచ్చినా మార్పు రాలేదన్నారు. ధాన్యం కొనుగోళు సక్రమంగగా జరగడం లేదని, రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం టిఆర్ఎస్కే చెల్లిందన్నారు. ప్రగతి భవన్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని కెసిఆర్ చెప్పగలరా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొండగట్టు బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోయి 50 మందికి పైగా క్షతగాత్రులైతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదన్నారు. కానీ పంజాబ్ వెళ్లి రైతులు చెక్కులు ఇచ్చారని అన్నారు. అలాగే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు.
కేసీఆర్కు వోట్లే తప్ప పేదల ప్రాణాల పట్టింపులేదని అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరుతో దోపిడీ చేస్తున్న తెరాస ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. దళితులు, ముస్లింలు, గిరిజనులు, విద్యార్థులు అందరినీ మోసం చేసి రాజకీయ అవినీతికి తెరలేపాడన్నారు. దళితులకు భూమి, రెండు పడకల గదుల ఇళ్లు, సింగరేణిలో కారుణ్య నియామకం ఏదీ జరగలేదన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఇంకా ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు. సింగరేణి భూగర్భ బొగ్గుగనులు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి ఉపరితల గనులను తవ్విస్తూ బొందల గడ్డలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. రామగుండం ప్రాంతానికి మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయిస్తామని ప్రకటించి ఎందుకు అమలు చేయించలేక పోయారని ప్రశ్నించారు.