జగిత్యాల కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ఎంఎల్సి జీవన్ రెడ్డి ధర్నా
ప్రజాతంత్ర, జగిత్యాల, మార్చి 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంఘాల ఐక్యతను అభినందించారు. గతంలో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ చేస్తే.. ప్రస్తుతం మోడీ సర్కారు వాటిని మళ్లీ ప్రైవేటుపరం చేస్తుందని మండిపడ్డారు.
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానన్న మోడీ ఇప్పుటి వరకు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పేద ప్రజల భూముల్ని ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం..ఇప్పుడు కేవలం మూడు లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలు ఆగిపోయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.