- మండిపడ్డ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
- సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్
- తక్షణం క్షమాపణలు చెప్పాలని మహిళా నేతల డిమాండ్
- బండి సంజయ్ వ్యాఖ్యలపై పలు పోలీస్ స్టేషన్లలో నేతల ఫిర్యాదు
హైదరాబాద్/న్యూ దిల్లీ, మార్చి11 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్ పై సీరియస్ అయ్యింది. బండి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంటున్నట్లు మహిళా కమిషన్ తెలిపింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించాలని డీజీపీని ఆదేశించింది. బండి చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించ నున్నట్లు తెలుస్తుంది. బండి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునితా లక్ష్మా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు సైతం ఆగ్రహం వెళ్లగక్కారు. బండి వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.. బండి సంజయ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈడీ-మోదీలకు తెలంగాణ సమాజం భయపడే పరిస్థితిలో లేదన్నారు. విపక్షాలపై ఈడీనీ వేటకుక్కల్లా ఉసిగొల్పుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కవితను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా అంటూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మాటలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు దిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు.
బండి తీరుపై ఎంపీ మాలోతు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను వెంటనే హాస్పిటల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. కవితకు క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలును ఉపసంహరించు కోవాలని మహబూబాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బండి సంజయ్కి అక్కా చెల్లెలు లేరా అని నిలదీశారు. మరోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలన్నారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై పలు పోలీస్ స్టేషన్లలో నేతల ఫిర్యాదు
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా బండి సంజయ్ ఉన్నాయంటూ పలు పీఎస్ లల్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కవితపై వ్యాక్యలు చేసినందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఇలాంటి కుసంస్కార వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో తిరగనియ్యబోమని అన్నారు. ఖబర్దార్ బండి సంజయ్ అంటూ హెచ్చరించారు.