సభలు, సమావేశాలకు వర్సిటీ వేదిక కాదన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
విద్యార్థులతో రాహుల్ సభ నిర్వహిస్తాం : కాంగ్రెస్
మాణికం టాగూర్తో ఎంపి కోమటిరెడ్డి భేటీ…సాగర్ సమావేశానికి గైర్హాజరుపై వివరణ
హైదరాబాద్,ప్రజాతంత్ర : • ఉస్మానియూ వర్సిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశానికి ఓయు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి నిరాకరించింది. యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈనెల 7 ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ గాంధీతో ముఖాముఖి సమావేశం జరుపుతారనీ, ఇందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఓయూ విసి రవీందర్కు దరఖాస్తు చేసింది. దీనిపై శనివారం సమావేశం నిర్వహించిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాహుల్ సభకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. అంతేకాకుండా వర్సిటీ క్యాపస్లోకి కెమెరాలను నిషేధిస్తూన్నట్లు కీలక ప్రకటన చేసింది. కాగా, కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఈనెల 6న రాహుల్ గాంధీతో వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ తరువాతి రోజు ఉస్మానియా వర్సిటీలోని ఆర్టస్ కళాశాల వద్ద విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించాలని నిర్ణయిచింది. మరోవైపు, ఓయూలో సమావేశానికి అనుమతి ఇవ్వనప్పటికీ విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదనీ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రం అవతరణ తరువాత విద్యార్థుల పరిస్థితి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల భర్తీ వంటి విషయాలపై మాత్రమే రాహుల్ గాంధీ ఓయు విద్యార్థులతో అడిగి తెలుసుకుంటారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
మాణికం టాగూర్తో ఎంపి కోమటిరెడ్డి భేటీ…సాగర్ సమావేశానికి గైర్హాజరుపై వివరణ
హైదరాబాద్,ప్రజాతంత్ర: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం టాగూర్తో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం భేటీ అయ్యారు. వరంగల్లో జరుగనున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సభకు జన సమీకరణపై శుక్రవారం నాగార్జునసారగ్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి కోమటిరెడ్డి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈమేరకు శనివారం కోమటిరెడ్డి ఆదర్శనరగ్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాణికం టాగూర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో అధికారిక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న కారణంగానే తాను నాగార్జునసాగర్ సమావేశానికి హాజరు కాలేకపోయినట్లు వివరణ ఇచ్చినట్లు తెలిపింది.అనంరతం మాణికం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి పార్టీ స్టార్ క్యాంపెయినర్ అనీ, పార్టీ వ్యవహారలపై చర్చించడానికి మాత్రమే తనను కలసినట్లు వెల్లడించారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదనీ, ఇటీవల కోమటిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఠాగూర్ నిరాకరించారు. అనంతరం బోయిన్పల్లిలో ఉన్న పార్టీ స్థలాన్ని ఏఐసిసి కార్యదర్శి బోసురాజుతో కలసి టాగూర్ పరిశీలించారు. అక్కడ పార్టీ నేతలతో రాహుల్ గాంధీతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.