ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డి కాలేజీలకు నోటీసులు

  • ఫిర్యాదులపై ఆధారాల సేకరణ
  • పరిశీలించి..నిర్దారించుకుంటున్న హైడ్రా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆ‌క్రమణలపై వొస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, నిర్దారించుకుంటున్న హైడ్రా నోటీసులు ఇస్తోంది. నేరుగా కూల్చివేతలకు దిగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డికి హైడ్రా షాక్‌ ఇచ్చింది. మర్రి రాజశేఖర్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది. వీటిని చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ జోన్‌ ‌పరిధిలో కట్టారంటూ ఫిర్యాదులు వొచ్చిన నేపథ్యంలో అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకో వాలని లేనిపక్షంలో తగిన చర్యలు తప్పవంటూ రాజశేఖర్‌ ‌రెడ్డిని హైడ్రా హెచ్చరించింది. దామెర చెరువులో నిర్మించిన మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డి కాలేజీలను ఇటీవల హైడ్రా బృందం పరిశీలించింది. వాటిని అక్రమంగా నిర్మించారంటూ అధికారులు నిర్దారణకు వొచ్చారు. అయితే గతంలో చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో నిర్మించిన కొన్ని భవనాలను మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే కూల్చివేశారు.

 

ఇటీవల మరో బీఆర్‌ఎస్‌ ‌నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. మేడ్చల్‌ ‌జిల్లా నాడెం చెరువు బఫర్‌జోన్‌లో రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్‌ ‌విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్‌ ‌ట్రస్టు అక్రమ నిర్మించారంటూ నీటిపారుదల శాఖ ఫిర్యాదు మేరకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీనిపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఘట్‌కేసర్‌ ‌మండలం వెంకటాపూర్‌ ‌పంచాయతీ కొర్రెముల రెవెన్యూ పరిధిలోని 813 సర్వే నంబర్‌లో ఈ నిర్మాణాలు ఉన్నాయి. అయితే నాడెం చెరువుకు 30టర్ల బఫర్‌జోన్‌ ‌వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా సదరు విద్యాసంస్థల యాజమాన్యం నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వొచ్చాయి. అయితే పల్లా మాత్రం అక్రమంగా కేసులు పెట్టారని, న్యాయపరంగా ముందుకు వెళ్తానని హైకోర్టును ఆక్రయించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు నిబంధనల ప్రకారం హైడ్రా ముందుకు వెళ్లాలని సూచించింది. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డి కాలేజీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

 

పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. వారం రోజుల వరకు కాలేజీలపై చర్యలు తీసుకోవొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో తహసీల్దార్‌ ‌నోటీసులకు వివరణ ఇవ్వాలని విద్యాసంస్థలను ఆదేశించింది. కాలేజీల వివరణ కూడా విని చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్‌కు  న్యాయస్థానం సూచించింది. చిన్నదామెర చెరువునకు చెందిన 8 ఎకరాల 24 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. సర్వే నెంబర్లు 489, 485, 458, 484, 492, 489 భూముల్లో భవనాలు, షెడ్స్, ‌వాహనాల పార్కింగ్‌ ‌నిర్మాణాలు చేపట్టారని.. రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు .

7 రోజుల్లో కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీలకు ఇచ్చిన నోటీసులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ ‌లో భాగంగా హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌మల్కాజిగిరిలోని 13 చెరువుల ఆక్రమణలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతోనే రెవెన్యూ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page