తెలంగాణలో కొద్దిరోజులుగా నోటిఫికేషన్ల విడుదల పర్వం కొనసాగుతోంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామంతో పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. జాబ్ కొట్టడమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
కోచింగ్ సెంటర్లు కళకళ
ఉద్యోగ ప్రకటనలతో రాష్ట్రంలో పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ.. ఇలా.. ఎన్నో డిపార్ట్మెంట్లలో ఖాళీలు ప్రకటించడంతో యువతలో కొత ఆశలు నిండాయి. దీంతో ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న లైబ్రరీలు, స్టడీ హాల్స్ ఇప్పుడు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. రెండేళ్లుగా తెరుచుకోని కోచింగ్ సెంటర్లు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న వారితో కళకళలాడుతున్నాయి.
పోటీ పరీక్షల పుస్తకాలతో బుక్స్టాల్స్ నిండుగా దర్శనమిస్తున్నాయి.పోటీపడి పరీక్షలు రాసి, కొలువు సాధించేందుకు నిరుద్యోగులు రెడీగా ఉన్నారు.
ఉన్నత ఉద్యోగం కోసం లాంగ్ లీవ్
రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిని కూడా పొడిగించడంతో… ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని మంచి అవకాశంగా భావిస్తున్నారు. 503 గ్రూప్-1 ఉద్యోగాలు, 582 గ్రూపు-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఉండడంతో… మంచి పోస్టు కొట్టాలనే తపనతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రిపేరవుతున్నారు. గతంలో కోచింగ్ తీసుకున్నవారు నోట్సులను తిరగేస్తున్నారు. మరికొందరు కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారు.
గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.
వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలన్నింటిని అందుబాటులో ఉంచాలి.రీడింగ్ రూమ్ లను సిద్ధం చేయాలి.మౌలిక వసతులను లైబ్రరీలలో కల్పించాలి. చదువుకొనుటకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి.
పేద, మధ్య తరగతి కుటుంబాలు కోచింగ్ తీసుకోవడం ఆర్థిక భారం అవుతోంది. అందుకే చాలా మంది తమ అకడమిక్ స్టడీస్ తో పాటు గ్రూప్స్, ఇతర ఉద్యోగాల కోసం లైబ్రరీల్లో చదువుతున్నారు. లైబ్రరీలలో నిరుద్యోగులు మెటీరియల్, పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు.
అనేక లైబ్రరీల్లో సరైన సౌకర్యాలు లేవు. అప్ డేట్ తో కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉండట్లేదు. ఆన్ లైన్ లో మెటీరియల్ చూసుకోడానికి ఇంటర్నెట్, వైఫై లాంటి సౌకర్యాలు కల్పించాలి.వేలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకునే పరిస్థితి లేక లైబ్రరీలపై ఆధారపడుతున్నారు.
పట్టణాలకు పరుగు
నిరుద్యోగులు ప్రైవేట్ హాస్టల్స్ తో ఉంటూ కొందరు… అద్దెకు గదులు తీసుకొని మరికొందరు సిటీలలో చదువుకుం టున్నారు.గదుల అద్దె వారికి మోయలేని భారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వము ఉచితహాస్టల్ సదుపాయం కల్పించాలి.
పోటి పరీక్షల మెటీరియల్ ఉచితంగా ఇవ్వాలి.
వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో సరియైన మెటీరియల్ దొరకక,వేలాది రూపాయలు వెచ్చించలేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.తెలుగు అకాడమీ ద్వారా మెటీరియల్ ముద్రించి నిరుద్యోగులకు ప్రభుత్వమే ఉచితంగా అందజేయాలి.
సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు ఫలించి వారి కళ్ళలో ఉద్యోగ కాంతులు ప్రసరించాలని ఆశిద్దాం.
– పిన్నింటి బాలాజీ రావు
హనుమకొండ.