రంగారెడ్డి, మార్చి 31 : నగర శివారు నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పుప్పాలగూడ లో నివాసం ఉంటున్న వినోద్ కుమార్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్ తన గదిలో.. గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్ ఉద్యోగం విషయంలో.. తను పనిచేస్తున్న సంస్థ తరచూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వినోద్ స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు. హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాప్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు వినోద్. కంపెనీలో తీవ్ర ఒత్తిడి ఉంది. దీంతో కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు.
తన ఉద్యోగం పోవటం ఖాయమనే అభిప్రాయానికి వచ్చాడు. దీనికితోడు ఇప్పటికే పలు సాప్ట్ వేర్ కంపెనీలు లేఆఫ్ లు ప్రకటిస్తుండే సరికి, వినోద్కు కూడా తన జాబ్ పై నమ్మకం పోయింది. ఆందోళన ఎక్కువైంది. కొంతకాలంగా డిప్రెషన్లో ఉంటున్న వినోద్ తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు.వినోద్ మరణ వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఐదేళ్ల క్రితమే వినోద్ కు పెళ్లయ్యింది. ఇప్పటివరకు తన వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వినోద్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.