ఒక్కరోజులోనే పక్రియ మొత్తం ఎలా పూర్తి చేస్తారు?
విఆర్ఎస్ తీసుకున్న వ్యక్తికి పదవి కట్టబెట్టడంలో ఆంతర్యం
ఇసి నియామక పక్రియలో కేంద్రం తీరుపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం
ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీమ్ కోర్టు ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం పక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీమ్ కోర్టు నిలదీసింది. నియామకాలపై గురువారం సుప్రీమ్ కోర్టులో విచారణ జరిగింది. ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను.. సుప్రీమ్ కోర్టుకు అటార్నీ జనరల్ సమర్పించారు. మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ.. అటార్నీ జనరల్ను సుప్రీమ్ కోర్టు ధర్మాసనం నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘సీఈసీ నియామకానికి నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే.. అరుణ్ గోయల్ను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? జూనియర్ స్థాయి వ్యక్తిని సీఈసీగా ఎలా ఎంపిక చేశారు? గత సీఈసీ పదవీ విరమణ వరకూ కూడా ఆగకుండా.. అరుణ్ గోయల్ను ఎలా ఎంపిక చేశారు? గోయల్ ఎంపికలో ఎందుకంత ఉత్సాహం చూపారు? మొత్తం పక్రియను అర్థం చేసుకోవడానికే ప్రశ్నిస్తున్నాం’ అని సుప్రీమ్ కోర్టు పేర్కొంది. ఇలా కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ను ఆకస్మికంగా నియమించడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్క రోజులోనే ఆ పక్రియ ఎలా పూర్తి చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. అరుణ్ గోయల్ ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్రాన్ని సుప్రీం ఘాటుగా ప్రశ్నించింది. గోయల్ నియామక ఫైళ్లను మెరుపువేగంతో ఆమోదించడంపై సుప్రీమ్ కోర్టు పెదవి విరిచింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక పక్రియ ఎలా పూర్తి చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ను ఇటీవల నియమించినందుకు సంబంధించిన ఫైళ్లను చూడాలని సుప్రీమ్ కోర్టు బుధవారం తెలిపింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుగుతున్నప్పుడు నియామకం చేయకుంటే మరింత సముచితంగా ఉండేదని కోర్టు పేర్కొంది. ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీమ్ కోర్టు విచారణ జరుపుతుంది. గోయల్ నవంబర్ 19న ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. రెండు రోజుల తర్వాత నవంబర్ 21న ఆయన సిఈసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు వారాల క్రితమే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నందున ఆయన నియామకంపై పిటిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. గోయల్కు స్వచ్ఛంద పదవీ విరమణ ఇస్తూ తాజా నియామకం జరిగిందని తెలిపారు. ఎన్నికల కమిషనర్గగా నియమితులైన ప్రతి ఒక్కరూ పదవీ విరమణ చేసిన వారేనని అన్నారు. ‘గోయెల్ ప్రభుత్వంలో సిట్టింగ్ సెక్రటరీ. గురువారం ఈ కోర్టు ఈ విషయాన్ని విచారించింది. శుక్రవారం అతనికి స్వచ్ఛంద పదవీ విరమణ లభించింది.
అతని అపాయింట్మెంట్ ఆర్డర్ శనివారం లేదా ఆదివారం జారీ చేయబడింది. సోమవారం అతను పని చేయడం ప్రారంభించాడు’ అని భూషణ్ సుప్రీమ్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను గురువారం తీసుకురావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని సుప్రీమ్ కోర్టు కోరింది. ‘మేము ఈ కేసును విచారించడం ప్రారంభించిన తర్వాత ఈ నియామకం జరిగింది కాబట్టి…’ అని న్యాయస్థానం లీగల్ సైట్ లైవ్ లా పేర్కొంది. యాంత్రిక విధానాన్ని అర్థం చేసుకోవాలని.. ప్రతిదీ చూడాలని కోర్టు పేర్కొంది. అయితే వెంకటరమణ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీల నియామకానికి సంబంధించిన పెద్ద సమస్యపై కోర్టు వ్యవహరిస్తుందని వ్యక్తిగత కేసును చూడలేమని చెప్పారు. దీనిపై గత గురువారం విచారణ ప్రారంభించామని నవంబర్ 19న గోయెల్ అపాయింట్మెంట్ జరిగిందని సుప్రీమ్ కోర్టు పేర్కొంది.కాబట్టి తాజా నియామకానికి కారణమేమిటో చూడాలని కోర్టు పేర్కొంది.