శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు
15 వేల మందికి నియామక పత్రాలు అందచేత
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 : దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజక వర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీష్ రావు నియామక పత్రాలు అందేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో అత్యధికంగా వేతనం తీసుకు ంటున్న ఆశావర్కర్లు తెలంగాణలోనే ఉన్నారన్నారు. ఆశావర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు ఏ రోగం వొచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్ళవలసి వొచ్చేదని..స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలను తగ్గించామని చెప్పారు.
పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ…ఆశావర్కర్ల సేవలు మరవలేనివని నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానలవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల సేవలు విశేషమైనవని తెలిపారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.9,750 వేతనం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య రంగం అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నారు అని, కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దటం జరిగినది అని, మెరుగైన వైద్యం కోసం అన్ని హంగులతో సకల సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని తెలియచేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 26 బస్తీ దవాఖానలు ఏర్పాటుచేసి, బస్తీ దవాఖానల ద్వారా పేద , మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంత్రి మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్లు తదితరులు పాల్గొన్నారు.




