2022-23 సంవత్సరానికి రూ.2,222 కోట్లు
ప్రకటించిన సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీధర్
గతఏడాదితోపోలిస్తే 81 శాతం, తెలంగాణ రాక పూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్తో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధికోత్పత్తికి కృషి చేసి అత్యధిక టర్నోవర్, లాభాలు సాధించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు, యూనియన్ నాయకులకు తన అభినందనలు తెలియజేశారు. ఇక సింగరేణి సంస్థ ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే…సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2022-23లో బొగ్గు అమ్మకాలు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించింది. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఇతర ట్యాక్స్ల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికరలాభాలను ఆర్జించింది.
సింగరేణి చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22లో సింగరేణి సాధించిన నికరలాభాలు రూ.1,227 తోపోలిస్తే గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు 81 శాతం అధికం. అలాగే టర్నోవర్ కూడా 2021-22 సంవత్సరంలో సాధించిన రూ.26,585 కోట్లపై గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో సాధించిన రూ.33,065 టర్నోవర్ 24 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం(2022-23) సింగరేణి సాధించిన టర్నోవర్లో బొగ్గు అమ్మకం ద్వారా రూ28, 650 కోట్లు, విద్యుత్ అమ్మకం ద్వారా రూ4,415 కోట్లను గడిచింది. తెలంగాణ రాక పూర్వంతో పోలిస్తే సింగరేణి అద్బుత వృద్ధి గత 9 ఏళ్లలో లాభాల్లో 430 శాతం వృద్ధి..అమ్మకాల్లో 175 శాతం వృద్ధిని సాధించింది. 2013-14లో సింగరేణి రూ.419 కోట్ల నికరలాభాలు సాధించగా.. గత ఆర్థిక సంవత్సరం రూ.2,222 కోట్ల సాధించి అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ మహారత్న కంపెనీలు సాధించిన లాభాల వృద్ధి కన్నా కూడా సింగరేణి సాధించిన వృద్ధి చాలా ఎక్కువగా ఉంది. సింగరేణి సంస్థ 430 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉండగా..241 శాతం వృద్ధితో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండవ స్థానంలో, 114 శాతం వృద్ధితో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడో స్థానంలో, 86 శాతం వృద్ధితో కోల్ ఇండియా నాలుగవ స్థానంలో ఉంది.
గత ఏడాది సాధించిన లాభాలపై 81శాతం వృద్ధి..
సింగరేణి సంస్థ అంతకు ముందు ఏడాది(2021-22 )లో రూ.1,227 కోట్ల రూపాయల లాభాలు సాధించగా గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించి 81శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరంపై గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల వృద్ధిలో మహారత్న కంపెనీలకన్నా సింగరేణి సంస్థ అగ్రస్థానంలో ఉంది. 62 శాతం లాభాల వృద్ధితో కోల్ ఇండియా రెండవ స్థానంలో నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుత అభివృద్ధి : సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్
సింగరేణి సంస్థ తన 134 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే అత్యద్భుత ప్రగతి సాధించిందని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం వృద్ధి, బొగ్గురవాణాలో 39 శాతం, అమ్మకాలలో 177 శాతం లాభాలలో 430 శాతం వృద్ధిని సాధించిందని, ఇవి సింగరేణి చరిత్రలోనే అత్యధిక రికార్డులని అన్నారు. రాష్ర ్టముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సహకారంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి మరియు థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యులు కావాలన్న ఉద్దేశంతో సింగరేణి అధికారులు, కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి కంపెనీని దేశంలో అగ్రస్థానంలో నిలిపారని ఆయన తన అభినందనలు తెలియజేశారు. ఈ లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్తప్రాజెక్టులను చేపడుతుందని,అలాగే కార్మికులకు లాభాల్లో వాటాగా అత్యధిక బోనస్, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. సింగరేణీయులందరూ సమష్టిగా కృషిచేసి లక్ష్యాలు సాధించాలని ఈ సందర్భంగా ఎండి శ్రీధర్ పిలుపునిచ్చారు.




