- వరంగల్ ఎనుమాములలో బంగారంతో పోటీపడుతున్న మిర్చి ధర
- ఆనందంలో మిర్చి రైతులు
ప్రజాతంత్ర, వరంగల్, మార్చి 30 : మిర్చి ధర పసిడితో పోటీపడుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. దేశీయ మిర్చికి క్వింటాల్కు ధర రూ. 52 వేలు పలుకుతున్నది. కొద్ది రోజుల క్రితం ఈ మార్కెట్లో దేశీ రకం మిర్చి క్వింటాల్ ధర రూ. 48 వేలు పలికింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది. ములుగు మండలం ఎస్ నగర్ గ్రామానికి చెందిన రైతు బల్గూరి రాజేశ్వరరావు 7 బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్కు తీసుకొచ్చారు. దీనికి మార్కెట్లోని లాల్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారులు ధర రూ. 52 వేలు నిర్ణయించారు.
ఇప్పటివరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, మిర్చికి భారీ ధర పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో మిర్చికి మంచి ధర పలకడంతో ఇదే సమయంలో విక్రయించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ధర అధికంగా ఉన్న చోటికి తమ పంటలను తరలిస్తున్నారు. మార్కెట్లో మంచి ధర పలకడంతో రాయలసీమ రైతులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దేశంలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. గోల్డ్ రేట్ను క్రాస్ చేసింది. తులం బంగారం 50వేలు ఉంటే.. క్వింటా దేశీ మిర్చి 52వేలకు చేరుకుంది. ఇది దేశంలో రికార్డు ధర. గతంలో ఎన్నడూ లేని ఈ ధరను చూసి రైతులే షాక్ తింటున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ రికార్డు ధరలు నమోదవు తున్నాయి. మొన్నటి వరకు క్వింటా 50 వేలు ఉన్న ధర ఒక్కసారిగా 52 వేలకు చేరుకుంది. ఇది దేశీయ మార్కెట్ చరిత్రలోనే ఆల్టైమ్ రికార్డ్ అని రైతులు అంటున్నారు.
పంటను మార్కెట్కు తీసుకొస్తున్న రైతులు ధరలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పొలాల్లో ఉత్పత్తి తక్కువగా వొచ్చినా..ఈ రికార్డు ధరలను చూస్తున్న అన్నదాత కళ్లలో ఆనందం కనిపిస్తోంది. అటు..పత్తికి సైతం రికార్డు రేట్లు పలుకుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో తెల్ల బంగారానికి ఆల్ టైమ్ రికార్డు ధర పలుకుతుంది. క్వింటా పత్తి ధర 11వేలు దాటింది. బుధవారం క్వింటా పత్తి ధర ఏకంగా 11వేల 2 వందలకు చేరింది. పక్కన ఉన్న మహారాష్ట్రలోని ధర్మబాద్ మార్కెట్లో 12 వేలు పలుకుతుంది.