- పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు
- జెపిసి వేసి విచారణ జరపాలని డిమాండ్
న్యూ దిల్లీ, మార్చి 13 : అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. జేపీసీ విచారణ కోసం పట్టుబడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉత్తరాఖండ్, చండీగఢ్లలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు ఎగురవేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చండీఘడ్లో రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు. విడతల వారిగా పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు హర్యానా కాంగ్రెస్ కార్యకర్తలు అదానీ వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. జేపీసీ వేయడానికి కేంద్రం ఎందుకు భయపడుతుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. బారికేడ్లను తొలగించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్కెనాన్లను ప్రయోగించారు. మరోవైపులో జమ్ములో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు.
కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కూడా కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టింది. బారికేడ్లను తొలగించి రాజ్భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆదానీ-హిండెన్బర్గ్ వివాదంపై కేంద్రానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని పార్టీ కార్యకర్తలు కూడా వీధుల్లోకి వచ్చారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలోని రాజ్భవన్లో నిరసనలు చేసింది. అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని పార్లమెంటులో ఉంచి జేపీసీని డిమాండ్ చేశారని అన్నారు. జేపీసీని డిమాండ్ చేయడంతో దేశ రాజధానిలో కూడా ఈ అంశం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. తాము అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరామని, పీయూష్ గోయల్కు మాట్లాడేందుకు 10 నిమిషాల సమయం ఇచ్చారని, సభలో ‘రెండు నిమిషాలు కూడా’ మాట్లాడనివ్వలేదని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ నియంతలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని, దేశ గర్వాన్ని కాపాడాలని బీజేపీ మాట్లాడుతుందని ఖర్గే అన్నారు.