- కార్పొరేట్ రెస్పాన్స్బిలిటీ కింద చెరువుల అభివృద్ధితో సుందరకీరణ
- చెరువుల్లో పట్టా భూములు ఉంటే మరోచోట కేటాయింపు
- పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్..ఒప్పంద పత్రాలు అందజేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : హైదరాబాద్ సుంపదరీకరణ..అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎస్ఆర్ నిధులతో హైదరాబాద్లో చెరువుల అభివృద్ధి చేపట్టనున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే దుర్గం చెరువు టూరిస్ట్ స్పాట్గా మారిందని అన్నారు. మరో 50 చెరువుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు. నగరంలో చెరువుల బ్యూటిఫికేషన్, వాటి సంరక్షణ కోసం పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వొస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా మంగళవారం 50 చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవెలప్ చేస్తామని ముందుకు వొచ్చిన సంస్థలతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంది. ఒప్పంద పత్రాలను ఆ సంస్థలకు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంతరం ఖాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధి పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ అభివృద్ది పనులు సామాజిక బాధ్యతతో చేయడమే తప్ప.. ఇందులో ఏలాంటి రాజకీయాలు లేవని కేటీఆర్ తెలిపారు.
ఇలా జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులకు ఒప్పంద పత్రాలను కేటీఆర్ అందించారు. హైదరాబాద్ నగరానికి 440 పైచిలుకు సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్లో 1908లో మూసీ నదికి వరదలు వొచ్చిప్పుడు..నాటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి మాట్లాడారని, ఈ నగరం బాగుండాలంటే..భవిష్యత్లో వరదల ముప్పు రాకుండా సమన్వయం చేయాలని ఇంజినీరింగ్ ప్రణాళిక ఇవ్వాలని విశ్వేశ్వరయ్యను కోరారని, ఆ క్రమంలో వొచ్చిందే హిమాయాత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అని, 1920లో గండీపేట్ పూర్తయిందని, 94 శాతం నీళ్లు గ్రావిటీ ద్వారా మూసీలో కలుస్తున్నాయని తెలిపారు.
జూలై నాటికి హైదరాబాద్లో వందశాతం మురుగు నీరు శుద్ధి చేస్తామని, దేశంలోనే వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 155 చెరువులు ఉన్నాయని, దుర్గం చెరువు అభివృద్ధి చెందిన తర్వాత టూరిస్టులు అధికంగా వొస్తున్నారని, సినిమా షూటింగ్లు కూడా చాలా అయ్యాయని, ఇటీవల హైదరాబాద్ సందర్శించిన ప్రముఖులు విదేశాల్లో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారని, ఇది మన నగరం.. ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటే అంత బాగుంటుందన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడిగా భావించాలని, హైదరాబాద్లోని చాలా చెరువుల్లో ప్రైవేటు పట్టాలు ఉన్నాయని, చెరువుల్లో ఉన్న ప్రైవేటు భూముల యజమానులకు మరో చోట భూమి ఇస్తున్నామని, టీడీఆర్ కింద 200 శాతం విలువ కల్పిస్తున్నామని, 2000 సంవత్సరం నుంచి 5 దశల్లో చెరువుల శాటిలైట్ మ్యాప్స్ తీశామని, చెరువుల అభివృద్ధిలో రియాల్టర్లను భాగస్వాములను చేస్తున్నామని, పక్కా ప్లాన్ రూపొందించి అమలు చేయాలని కేటీఆర్ సూచించారు.
ఇక ఫీస్ స్పేస్ ఆక్యుపేషన్లో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్గా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఎంతో కృషి చేస్తే తప్ప ఇంత అభివృద్ధి జరగదని, ప్రపంచానికే టీకా క్యాపిటల్గా హైదరాబాద్ మారిందని, ఫార్మా సిటీ ప్రారంభమైతే ప్రపంచ ఫార్మా నగరంగా మారుతుందన్నారు. శాంతిభద్రతలు, పరిపాలన బాగుండటం వల్లే భారీగా పెట్టుబడులు వొచ్చాయన్నారు. 2030 కల్లా 250 బిలియన్ డాలర్ల స్థాయికి హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ చేరుతుందని, హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీని రాచకొండలో నిర్మిస్తామని, ఒలింపిక్స్ స్థాయి స్పోర్టస్ సిటీ కూడా నిర్మిస్తామని, హైదరాబాద్లో మరిన్ని ఐకానిక్ భవనాలు రావాల్సి ఉందన్నారు. రెండు, మూడేండ్లలో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. లక్డీకాపూల్ – బీహెచ్ఈఎల్, నాగోల్-ఎల్బీనగర్ రూట్లలో మెట్రోకు కేంద్రం సాయం కోరాంమని, ఆ రెండు రూట్లలో ఫీజబులిటీ లేదని కేంద్రం లేఖ రాయడం దుర్మార్గమని, మనం కట్టే పన్నుల్లో కూడా మనకు కేంద్రం మొండి చేయి చూపిస్తుందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. యూపీ లాంటి రాష్ట్రాలకు మెట్రోలు ఇస్తున్నారన్నారు. తాము ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, హైదరాబాద్లో మెట్రో లైన్ 250 కిలోవి•టర్లకు విస్తరిస్తామని, ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి గోరంత అని.. చేయాల్సింది చాలా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.