మాదక ద్రవ్యాలను తరిమేద్దాం !

గంజాయి, నల్లమందు, కొకైన్‌, మార్ఫిన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌సుగర్‌, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ-మెథాంఫెటామైన్‌) వంటి వాటిని  మాదకద్రవ్యాలు అంటారు. ఇవి శరీరంలోనికి పీల్చడం లేదా నోటిద్వారా లేదా ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటారు. వీటిని సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన  ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు. ఎక్కువ శాతం సంపన్నవర్గాల యువత వీటిని అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఇవి అత్యంత ఖరీదైనవి. అంతర్జాతీయ గణాంకాలు సాధారణంగా నాలుగు రకాల అక్రమ మాదక ద్రవ్యాల సమూహాలపై దృష్టి పెడతాయి: ఓపియాయిడ్లు, కొకైన్‌, యాంఫేటమిన్లు మరియు గంజాయి.

వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌ 2023 ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 29.6 కోట్ల మంది డ్రగ్స్‌ను తీసుకున్నారు. వీటి వాడకం గతదశాబ్ద కాలంలో 23 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌ వార్షిక నివేదిక 2023 ప్రకారం  ప్రపంచంలోని ఓపియేట్‌ వినియోగదారులలో దాదాపు 40 శాతం మంది దక్షిణాసియాలోనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద అక్రమ నల్లమందు ఉత్పత్తి చేసే దేశం. ప్రపంచ ఉత్పత్తిలో 90 శాతానికి పైగా వాటా కలిగి ఉంది. ఇది దక్షిణాసియాలో అక్రమంగా ఉత్పత్తి చేయబడిన ఓపియేట్ల లభ్యత మరియు వినియోగాన్ని పెంచింది. భారతదేశంలో ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్న అక్రమ రవాణా సంఘటనలు, అక్రమ నల్లమందు సాగుతో ఓపియేట్‌లకు కీలక మార్కెట్‌గా ఉద్భవించింది.

10 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో దాదాపు 3.1 కోట్ల మంది వ్యక్తులు (2.8%) గంజాయిని వినియోగిస్తున్నారు. పీల్చేరూపంలో 0.58 శాతంతో    పోలిస్తే కౌమారదశవారు 1.7 శాతం మంది డ్రగ్సును ఉపయోగిస్తున్నారు. 2019 నుండి 2021 మధ్య అత్యధిక సంఖ్యలో డ్రగ్స్‌ సంబంధిత ఎఫ్‌ఐఆర్‌లు ఉత్తరప్రదేశ్‌లో (31,482) నమోదయ్యాయి. ఆ తర్వాత  మహారాష్ట్ర (28,959), పంజాబ్‌ రాష్ట్రాలు (28417) ఉన్నాయి. 2022లో దేశంలో డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కారణంగా 116 మంది మహిళలతో సహా 681 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచలప్రదేశ్లో ఐదుగురు మహిళలతో సహా 15 మంది డ్రగ్‌ ఓవర్‌డోస్‌ మరణాలు నమోదయ్యాయి. హర్యానాలో ఒక మహిళతో సహా తొమ్మిది మంది మరణించారు. నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డిపిఎస్‌) యాక్ట్‌ 1985 కింద గత ఏడాది దేశంలోనే కేరళ (26,619), మహారాష్ట్ర (13,830) తర్వాత పంజాబ్‌ అత్యధికంగా 12,442 కేసులు నమోదయ్యాయి.

నష్టాలు – కష్టాలు: పేర్లు ఏవైనా ఇవన్నీ మెదడుపైన , కేంద్రనాడీ వ్యవస్థపైన ఉద్దీపన కలిగించి  తక్షణ ప్రభావం చూపించి కొద్ది సేపు మత్తులో తేలియాడిస్తాయి. ఈ మత్తులో వీరు ఏమి చేస్తారో వారికే తెలియదు. ఇవి సేవించి వాహనాలు నడిపితే వారితో పాటుగా ఎదుటివారికి కూడా ప్రమాదమే. మత్తులో అత్యాచారాలు చేసే అవకాశాలు ఎక్కువ. మొదట్లో సరదాగా తీసుకున్న వారు కొంతమందైతే, కుటుంబ సంబంధ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒంటరి తనం వలన ఇంకొంత మంది తీసుకుంటారు. కొద్ది మంది జన్యు పరమైన సమస్యలు వలన కూడా వీటికి అలవాటు పడతారు. కొన్ని రోజుల తరువాత ఇవి లేకపోతే జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మహత్యలు  చేసుకొంటారు. ఇంకో కోణంలో  విశ్లేషిస్తే ఇవి చాలా ఖరీదు. కొనడానికి తగినంత సొమ్ములు లేకపోవడం వలన ఇంట్లో దొంగతనానికి పాల్పడతారు లేదా ఇతర అరాచక పనులు చేసే  రౌడీలుగా, గూండాలుగా మారే అవకాశం ఉంది.

ఆరోగ్య సమస్యలు : ఊపిరతిత్తులు, కాలేయం, గుండె, మెదడు, పనితీరులో మార్పు వస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోతాడు. చేసేపని మీద ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది.సవాళ్లు: డార్క్‌ వెబ్‌ మరియు క్రిప్టో మార్కెట్లలో పనిచేస్తున్న సైబర్‌ ఎనేబుల్డ్‌ డ్రగ్‌ మార్కెట్‌లు గతంలో కంటే అక్రమ మందులను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాకుండా చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ ఫార్మసీల విస్తరణ ఔషధ నియంత్రణ ప్రయత్నాలకు గణనీయమైన సవాలుగా ఉంది.  అక్రమ మాదకద్రవ్యాల ఆర్థిక వ్యవస్థలు సంఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, పర్యావరణ వినాశనాన్ని వేగవంతం చేస్తున్నాయి. భారతదేశం మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా యొక్క తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. ఇది మిలియన్ల మంది ప్రజారోగ్యం, శ్రేయస్సు మరియు భద్రతను ప్రభావితం చేస్తుంది.

దీనికి కారణం భారతదేశం రెండు ప్రధాన మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలైన గోల్డెన్‌ క్రెసెంట్‌ (ఇరాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌-పాకిస్థాన్‌) మరియు గోల్డెన్‌ ట్రయాంగిల్‌ (థాయ్‌లాండ్‌-లావోస్‌-మయన్మార్‌) మధ్య ఉంది. 2047 నాటికి మాదకద్రవ్య రహిత దేశంగా భారత్‌ ఉండబోతుందని కేంద్రం లక్షించింది. జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద యువత, మహిళల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్యను అరికట్టడానికి నిరంతర సమన్వయ చర్యలు తీసుకుంటుంది.

మాదక ద్రవ్యాల బాధితులకు చికిత్స అందించడమే కాకుండా, నివారణ కొరకు అవగాహన పెంపొందించడం , వ్యసనం నుండి బయట పడేందుకు పునరావాస కేంద్రాలు, డి- అడిక్షన్‌ కేంద్రాలు నెలకొల్పింది. అలాగే యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ వ్యవస్థ నడుస్తుంది. అలాగే డి – అడిక్షన్‌ కోసం టోల్‌ ఫ్రీ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 14446 ద్వారా సహాయం కోరే వ్యక్తులకు కౌన్సిలింగ్‌ మరియు తక్షణ సహాయం అందించుతుంది. అంతే కాకుండా  మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నవారిని ఉక్కు పాదంతో అణచి వేస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకం. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఈ మాదకద్రవ్యాల తీసుకొనే అలవాటు నుండి తప్పించలేవు. బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ సహకరించాలి. (నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం.. మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం.)

 -డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్‌) టీచర్‌,
ఆమదాలవలస,
శ్రీకాకుళం జిల్లా,
ఆంధ్రప్రదేశ్‌,
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *