బీజేపీ మూడో జాబితా విడుదల

అంబర్‌పేట్‌లో కృష్ణయాదవ్‌కు అవకాశం
బాబూమోహన్‌కి ఆందోల్‌ ‌నుంచి టికెట్‌ ‌కేటాయింపు
తీవ్ర నిరాశలో బండా కార్తీకరెడ్డి, విక్రమ్‌ ‌గౌడ్‌
‌టికెట్‌ ఆశించి భంగపడ్డ ఇరువురు నేతలు
31 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని బీజేపీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌2 : ‌తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 35మందితో థర్డ్ ‌లిస్ట్ ‌రిలీజ్‌ ‌చేసింది బీజేపీ అధిష్టానం. తెలంగాణలోని మొత్తం119 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటివరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. 31స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్‌ ‌పెట్టింది. థర్డ్ ‌లిస్ట్‌లోనూ 14 మంది బీసీలకి టికెట్లు కేటాయించారు. రెడ్డిలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, బ్రాహ్మణ, వెలమలకు ఒక్కోటి చొప్పున టికెట్‌ ఇచ్చారు. మూడు లిస్ట్‌లలో కలిపి ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపారు. జనసేన అడుగుతున్న సీట్లలో అభ్యర్థులను ప్రకటించలేదు బీజేపీ. పవన్‌ ‌విదేశీయాత్ర నుంచి వచ్చాకే మిగతా సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ ‌లిస్ట్‌లో అంబర్‌పేట్‌లో కిషన్‌ ‌రెడ్డి స్థానంలో కృష్ణయాదవ్‌కు టికెటిచ్చారు.

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన బాబూమోహన్‌కి ఆందోల్‌ ‌నుంచి టికెట్‌ ‌కేటాయించారు. గోషామహల్‌ ‌కానీ, జూబ్లిహిల్స్ ‌కానీ టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి ముఖేష్‌ ‌గౌడ్‌ ‌కుమారుడు విక్రమ్‌గౌడ్‌కు టికెట్‌ ‌దక్కలేదు. అయితే నాంపల్లి కేటాయిస్తామని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. అయితే అందుకు విక్రమ్‌ ‌నిరాకరించడంతో మొత్తానికే సీటు కేటాయించలేదు. అలాగే హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ కుమార్తెకు కూడా మొండిచెయ్యి చూపారు బీజేపీ అధిష్టానం. ముషిరాబాద్‌ ‌టికెట్‌ను పూస రాజుకు కేటాయించింది బీజేపీ. ఇక కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను పెండింగ్‌ ‌లో పెట్టింది బీజేపీ నాయకత్వం. నాంపల్లి, కంటోన్మెంట్‌, ‌మల్కాజ్‌గిరి సీట్లు కూడా పెండింగ్‌ ఉన్నాయి. మూడో జాబితాలో ఇద్దరు కార్పొరేటర్లకు చోటు కల్పించింది అధిష్టానం. రాజేందర్‌ ‌నగర్‌, ఎల్‌బి నగర్‌ ‌స్థానాలను కేటాయించింది.

సనత్‌ ‌నగర్‌ ‌నుంచి మర్రి శశిధర్‌ ‌రెడ్డి, సికింద్రాబాద్‌ ‌స్థానం నుంచి సీట్‌ ఆశించిన మాజీ మేయర్‌ ‌బండ కార్తికరెడ్డికి నిరాశే ఎదురైంది. అయితే పవన్‌ ‌కళ్యాణ్‌ ‌విదేశీ పర్యటన తర్వాతనే మిగతా సీట్ల విషయంలో క్లారిటీ వొచ్చే అవకాశముందని తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థుల థర్డ్ ‌లిస్ట్ ఇలా వొచ్చిందో.. లేదో..! అసంతృప్తి నేతలు బయటకొస్తున్నారు. మూడో జాబితాపై పలువురు బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. మాజీ మేయర్‌ ‌బండా కార్తీకరెడ్డి, విక్రమ్‌ ‌గౌడ్‌ ‌తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు మహిళా మోర్చాలో ఒక్కరకి కూడా టికెట్‌ ‌దక్కని పరిస్థితి. సికింద్రాబాద్‌ ‌పార్లమెంటు పరిధిలో టికెట్‌ ఆశించిన పలువురు మహిళా నేతలకు నిరాశే ఎదురైంది. జూబ్లీహిల్స్ ‌నుంచి డాక్టర్‌ ‌విరేపనేని పద్మ, సనత్‌నగర్‌ ‌నుంచి ఆకుల విజయ, ముషీరాబాద్‌ ‌నుంచి బండారు విజయలక్ష్మీ, అంబర్‌పేట నుంచి మహిళ మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. మొత్తానికి చూస్తే మహిళా మోర్చాలో ఒక్కరికి కూడా టికెట్‌ ఇవ్వలేదని నేతలు ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *