ఏనుగెక్కిన సంపద

(డా.కె.ఎన్‌. గణేశయ్య రాసిన ‘‘కరి సిరి యాన’’ అనే కన్నడ నవలను రంగనాథ రామచంద్రరావు ‘ఏనుగెక్కిన సంపద’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. గణేశయ్య చెప్పిన నవల నేపథ్యం, నవల నుంచి  చిన్న భాగం- శోభ పాఠకుల కోసం)

నవల నేపథ్యం: ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఐశ్వర్యవంతవంతమైన సామ్రాజ్యాలలో ఒకటైన ‘విజయనగరం’ రెండవ రాజధానిగా పిలవబడే ‘పెనుకొండ’ గురించి విషయాన్ని సేకరించాలని అక్కడికి వెళ్లాను. కోట ప్రవేశద్వారం ముందు నిలుచుని ఆ భవ్యమైన తలుపులను చూస్తుండగా నా గుండెచప్పుడు పెరిగింది. వందలాది సంవత్సరాల క్రితం కృష్ణ దేవరాయలు తన గుర్రం మీద తిరిగిన ఆ తలుపుగుండా నా కారు వెళ్తుండగా, ఆ కోట లోపలి మట్టిలో దాగి కూర్చుని ఉండగలిగే లక్షలాది రహస్యాలను తవ్వి తీయడం ఎలా అనే దిగులు నన్ను వేధించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరిని అడిగిన పెనుకొండ  గురించి ఎలాంటి వివరాలు దొరకలేదు. కనీసం ఒక టూరిస్ట్‌ గైడ్‌ పుస్తకమైన ఉందేమోనని అన్ని పుస్తకాల షాపులలోనూ వెతికాను, ప్రయోజనం కలగలేదు.
చివరికి ఒకరోజు పచారీ కొట్టులో కూర్చొని నేను, వీణ, పుణ్య పల్లీ పట్టీలు తింటున్నాం.

మా మాటలు విన్న ఆ కొట్టు యజమాని కోట లోపలి వీధిలో ఉన్న హనుమంతరావుగారిని కలవమని సూచించారు. బ్రిటిష్‌ కాలంలో మాదిరిగా ఉన్న ఆ ఇంటి మీద ‘‘పండిత నెరియనూరి హనుమంతరావు’’ అనే బోర్డ్‌. హనుమంతరావుగారికి నా ఆసక్తిని తెలియజేస్తుండగా అయన నోటినుంచి పెనుకొండ గురించి అవలీలగా చరిత్ర ప్రవహించసాగింది. అంతేకాదు మూడు సంవత్సరాల నుంచి నేను విజయనగరం గురించి చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వేలాది వివరాలు, కాలమానాలు, చారిత్రక సంఘటనలు, వ్యక్తుల, స్థలాల పేర్లు ఆయన నాలుక చివరనే ఉన్నాయి. విజయనగరం గురించి ఆయనకున్న పాండిత్యానికి నివ్వెరపోయి ఈయనను ఈ నవలలో ఒక పాత్రగా ప్రతిబింబించాలని అనుకుంటుండగా ఆయన తమ ఇంటి పూర్వచరిత్రను చెప్పటం మొదలుపెట్టారు. ఐ.జే. పిట్‌ గారి నుంచి ఆ ఇంటిని కొనుక్కోవడం, పిట్‌ గారి భార్యకు పెనుకొండ మీదున్న మోహం, వాళ్ళిద్దరూ లండన్‌కు వెళ్లే రోజే పెనుగొండ గుట్టమీద ఇప్పటికి అర్థంకాని నిగూఢమైన తీరులో పిట్‌ దంపతులు శవాలుగా పడివుండటం, వారి సమాధులు ఇంకా అక్కడే ఉండటం, పెనుకొండలో నిధి ఉండవచ్చని అనేకమంది కోట లోపల గొడవలు పడటం, గగన్‌ మహల్‌ రహస్యదారి అన్నిటినీ వింటుండగా, నవలకు ఒక గట్టి పునాది అక్కడే నిర్మాణమైంది.

తైవాన్‌ క్లావోశుంగ్లో కొండపైనున్న బౌద్ధ దేవాలయానికి మెట్లెక్కుతుండగా ఎడమవైపున కనిపించిన ఒక విగ్రహం ముందు ‘అవలోకితేశ్వర’ అని రాసివుండటం చూసిన పుణ్య, ‘‘ఇక్కడ ఈశ్వరుడు ఉండటం ఎలా సాధ్యం?’’ అని దృష్టిని అటువైపు లాగింది. నాకు ఆ ప్రశ్నల కన్నా ఆశ్చర్యంగా కనిపించింది ఆ విగ్రహం చుట్టూ ఉన్న మెట్లు, అలాగే కొండ చిత్రం- ఒక విధంగా తిరుపతిని గుర్తుకు తెచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో- భారత్‌ తైవాన్ల మధ్య ఉండగలిగే చారిత్రిక లంకెలను వెతుకుతుండగా కంటపడిరది అక్కడ సన్‌-మూన్‌ సరోవరం ఒడ్డుననున్న ఒక రాయి మీద పూర్తిగా చెక్కిన భారతపటం. ఆ విషయం గురించి విచారించగా అ పటం హ్యూయెన్‌ త్సాంగ్‌ భారత్‌కు చేపట్టిన పర్యటన మార్గపు మ్యాప్‌ అని.

అతను వెనుతిరిగింది చైనాకే అయినా తైవాన్‌లోని సన్‌-మూన్‌ సరోవరం దగ్గర తన అంత్యక్రియలు జరపాలని కోరుకోవడం వల్ల అక్కడ అతని స్మారకం ఉంది. అతను నాగార్జున కొండ, తిరుపతి, కంచికి వెళ్లి వెనుతిరిగాడు. ఈ వియాలన్నీ పుణ్య అడిగిన ప్రశ్నల నేపథ్యంలో వెతికినప్పుడు దొరికిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటంటే తిరుపతి శ్రీనివాసుడి మూల విగ్రహం హిందూ దేవతది కాదు. బదులుగా బౌద్ధ ధర్మానికి చెందిన అవలోకితేశ్వరుని విగ్రహం అనే కాంట్రవర్సి, ఎక్కువ విషయాలు పోగు చేస్తుంటే ఈ కాంట్రవర్సి నాలో బలంగా వేళ్ళూనింది. మిగతా విషయాలను పాఠకుల కోసం నవలలో ఇచ్చాను. ఇవి కాకుండా, ఇక్కడ రాయలేని ఎన్నో అనుభవాలు, కేవలం ఘటనలుగా కాకుండా మనసును కదిలించే, జీవితాన్ని నేర్పే పాఠాలుగా మిగిలిపోతాయి. నాకు అవి నవల ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైన ఆస్తి.

నవలలో చిన్నభాగం…

అంటే.. విజయనగరం రాజులు రక్కసతంగడిలో ఓడిపోయిన వెంటనే బోయలు రాజనిధిని బావిలో వేశారనా? యుద్ధం తర్వాత సుల్తానులు సైన్యం నగరాన్ని కొళ్లగొడుతుంటే అప్పుడు బోయలకా అవకాశమెక్కడిది?’’  ‘‘లేదు వినోద్‌. రక్కసతంగడిలో ఓడిపోయిన వెంటనే సుల్తాను సైనికులు విజయనగరాన్ని కొళ్లగొట్టారని సామాన్యంగా అందరూ నమ్మారు. అయితే అది నిజం కాదు. చరిత్రలో మరుగైపోయిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సుల్తానులు విజయనగరానికి సుమారు మూడు రోజుల తర్వాత వచ్చారు.’’  ‘‘అందువల్ల వాళ్లు నగరాన్ని నాశనం చేసింది నిజం. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే వారికి విజయనగరం నిధి దొరికిందా అనే విషయం. స్యూయల్‌ చెప్పిన ప్రకారం వాళ్లు నగరంలో కాలు పెట్టడమే మూడురోజుల తర్వాత.

ఈ మధ్యలో, వారు రావటానికి ముందే, నగరం చుట్టుపక్కల ఉన్న గిరిజనులు, అందులోనూ బోయలు, లంబాడిలు, కురుబలు, రాజధాని మీద రెండు రోజుల పాటు నిరంతరం దాడిచేసి అన్నిటిని దోచుకున్నారు. అంతేకాకుండా ఓడిపోయిన నేపథ్యంలో రాజ వంశస్థులు కూడా స్పృహలోకి వచ్చి అపారమైన నిధిని మరోచోటికి తరలించారు. దాని గురించి తర్వాత చెప్తాను. అందువల్ల బిజాపూరు సుల్తానుకు ఎక్కువేమీ దొరకదు. అతనికి దొరికిన ఒక ప్రముఖమైన నిధి ఏమిటంటే కోడిగుడ్డు సైజులోని ఒక వజ్రం. దాన్ని అతను తన గుర్రం నుదుటికి కట్టాడు అనే వాదన ఉంది. ఈ వివరాలను చాలామంది చరిత్రకారులు తవ్వితీశారు’’.

-డా. కె.ఎన్‌. గణేశయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page