‘‘చదువు లేదు ఏ ఇఛ్ఛా ఉండకూడదు/ ఎడ్లమూతికి బుట్టలాగా/గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నఖాబ్లు’’ 1997లో షాజహానా ‘పర్దా హటాకే దేఖో’ కవిత వ్రాసి పరదాల చాటు ముస్లిం స్త్రీల జీవితంలోని హింసను గురించి మాట్లాడటం మొదలు పెట్టిననాటి నుండే నాకు ఆమె పరిచయం. 1993 నాటికి స్త్రీలపై వివక్షకు, హింసకు మూలమైన పితృస్వామ్యాన్ని చర్చకు పెట్టిన స్త్రీవాద సాహిత్య ఉద్యమ అవగాహనను షాజహానా కవిత్వం విస్తృతం చేసింది. స్త్రీలందరూ సమానంగా పితృస్వామిక సామాజిక కౌటుంబిక సంస్కృతీ పీడితులే అయినా ముస్లిం స్త్రీల సమస్య కొంత భిన్నమూ ప్రత్యేకమూ అని ఆమె కవిత్వం చెప్తూ వచ్చింది.
షాజహానా తొలి కవితాసంపుటి ‘నఖాబ్’ 2005లో వచ్చింది. 1997-2004 వరకు వ్రాసిన 21 కవితల సంకలనం ఇది. రెండవ కవితాసంపుటి ‘దర్దీ’ 37 కవితలతో 2012లో వచ్చింది. ‘నఖాబ్’ అంటే ముఖాన్ని మరుగుపరుచుకొంటూ ముస్లిం స్త్రీలు ధరించే ముసుగు. దర్దీ అంటే నొప్పి బాధ. కుటుంబం, మతమనే అధికార వ్యవస్థలు పరస్పర సంబంధంలో శరీరంపై మనసుపై నెరపుతున్న బాధాకరమైన అధికారానికి బలమైన ప్రతీకగా ‘నఖాబ్’ను స్వీకరించింది షాజహానా. స్వీయ అస్తిత్వానికి, గౌరవకరమైన జీవితానికి పరాయీకరిస్తున్న నఖాబ్పై ధిక్కార ప్రకటన ఆమె కవిత్వం. ఇది ఒక రకంగా ముస్లిం స్త్రీగా ముస్లిం మతసమాజం లోపలి వ్యక్తిగా స్త్రీ పురుష వివక్షకు వ్యతిరేకంగా ఆమె ప్రారంభించిన యుద్ధం.
‘‘పుట్టిన్నాటినుంచీ వెన్నెలరుచి ఎరుగక, వాన రుచీ ఎరుగక/ వసంతం రుచీ ఎరుగక పెరిగి/ ఆంక్షల్లో హద్దుల్లోనే ఆడబానిసగా పెద్దయి’’ అరబ్బుషేకుకు వ్యాపారవస్తువుగా చేయబడే బిడ్డలకోసం (పర్దా హటాకె దేఖో!) ఏ కాలానికి తీరని అతని ఇసుకపొరల/ దేహదాహంలో ప్రవహించీ ప్రవహించీ’’ ఇంకిపోయే తల్లులకోసం (తస్వీర్) తండ్లాట, స్త్రీలను మౌన మాంసాలుగా/ ఉత్పత్తి యంత్రాలుగా బతకమన్న సంప్రదాయం (ఖబర్దార్)పై తిరుగుబాటు ఆమె కవిత్వం.
ముస్లిం కావటం వలన దేశంలోనూ ప్రపంచంలోనూ ‘ఇతరులు’గా ఎదుర్కొంటున్న అనుమానపు చూపులు, అవమానాలు, విద్వేషాలు, వ్యతిరేకతలు కలిగిస్తున్న వేదన ఆమెకు అదనపు సమస్య. ఆ నొప్పినుండి కూడా ఆమె ధిక్కార కవిత్వమే అయింది.
ముస్లిం కావటం వలన దేశంలోనూ ప్రపంచంలోనూ ‘ఇతరులు’గా ఎదుర్కొంటున్న అనుమానపు చూపులు, అవమానాలు, విద్వేషాలు, వ్యతిరేకతలు కలిగిస్తున్న వేదన ఆమెకు అదనపుసమస్య. ఆ నొప్పినుండి కూడా ఆమె ధిక్కార కవిత్వమే అయింది.
‘కులం, మతం లేని కలలు/ కుప్పలుగా ఆరుద్రల్లా/ జీవితమైదానంలో సున్నితంగా/ తొక్కుతూ ఎన్ని నిర్దాక్షిణ్యపు పాదాలో’ ఇన్సానియత్ కవితాపాదాలివి. మానవీయంగా ఉండటం అంటే ద్వేషించటం కాదు, ప్రేమించటం. మనుషులను మతం పేరుతో దూరం కొట్టటంకాదు. మతవాదులన్న ముద్రతో సతాయించటం కాదంటుందీ కవితలో షాజహానా. ముస్లిములందరినీ ముస్లిం తీవ్రవాదులతో ముడిపెట్టి మనుషులమధ్య అనుమానాలను, దూరాలను పెంచే రాజకీయాలపై షాజహానా నిరసన ‘అపరిచిత’ కవిత అయింది. ‘రాజ్యమొక్కటే కాదు మనుషులూ మనసులూ లౌకికం కావాలి కదా’ అన్న ఈ కవిత ముగింపు మానవ సంస్కారాలను లౌకిక ప్రజాస్వామిక విలువగా పరివర్తింపచేయని రాజ్యాల వైఫల్యంపై అభిశంసన. మతాధిపత్య దురహంకారం స్త్రీలపై అత్యాచారంగా వ్యక్తమైన బీభత్సదృశ్యం గుజరాత్లో ముస్లిములపై దాడులు. ఆ నేపథ్యంలో వచ్చిన కవిత ‘కాలీ దునియా’
ఈ విధమైన దేశీయ సామాజిక అసందర్భాల, అమానవీయ ఆధిపత్య ధోరణుల ప్రతినిధి కవితగా జమానత్ గురించి చెప్పుకొంటే సరిపోతుంది. ‘‘కాలం ఎలా గడిచిందో ఏమో/ నేనే బలవంతంగా తోశానేమో/ 35 సంవత్సరాలుగా నాకు/ అంటిన అత్తరు మరకలేం లేవు/ అంత నెత్తుటి మరకలే’’ అత్తరు సువాసనాప్రియులు ముస్లింలు. విరివిగా వాడతారు. అమ్మకం బతుకుతెరువు. అత్తరు మరకలతో దుస్తులు వాసనలతో దేహం పరిమళించే జాతి నెత్తుటిమరకల భీభత్స అనుభవంలోకి నెట్టబడటం గురించి షాజహానా ‘జమానత్’ (2009) కవిత. 35 సంవత్సరాల కాలం అంటే తాను పుట్టిపెరుగుతూ చూస్తున్న, నడుస్తున్న చరిత్ర. బాబ్రీమసీదు కూల్చివేత (1992), గుజరాత్ మారణకాండ (2002) నిరంతరం సందేహించబడే, నిరాకరణకు గురయ్యే దేశ పౌరసత్వహక్కు అత్తరు మరకలను అభావం చేసిన నెత్తుటిమరకల చరిత్రలో భాగమే. ఈ కవిత వచ్చి ఇప్పటికి పదహారు సంవత్సరాలు. ఈ కాలంలో ఏమి జరిగింది? బాబ్రీమసీదు కూల్చినచోట రామమందిర నిర్మాణం అంగరంగ వైభవంగా జరిగింది. గుజరాత్ దాడులలో 14మంది కుటుంబ సభ్యులను కోల్పోయి, గ్యాంగ్ రేప్కు గురైన బిల్కిస్ బానో చేసిన న్యాయపోరాటం ఫలితంగా జైలుశిక్ష అనుభవిస్తున్న నేరస్థులు విడుదలయి సన్మానించబడ్డారు.
అనేక ఉర్దూభాష పదాలను తెలుగు వాక్యంలోకి అలవోకగా అందంగా ఇమిడ్చి కవితలకు అత్తరు వాసనలను అద్దిన కవయిత్రి షాజహానా. జాతిజనుల బాధామయ అనుభవానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ బాధను తన బాధగా వినిపించిన షాజహానా కవితల ప్రాసంగికత ఈనాడు మరీ పెరిగింది.
‘పుట్టాక నా తాలూకు మాయను పాతిపెడితే ఆప్యాయంగా తనలో కలుపుకున్న ఈ మట్టిబిడ్డను నేను’ అని షాజహానా చేసిన ఆనాటి ఆత్మగౌరవ ప్రకటనను నిరాకరిస్తున్నట్లుగా పౌరసత్వ సవరణ చట్టం వచ్చింది. తల్లిమట్టి సాక్ష్యం చెల్లదు, కాగితాల రుజువు కావాలన్నది. ఇది అన్యాయం అంటూ వచ్చిన నిరసన ఉద్యమంలో తెరిచిన నోళ్లను మూసెయ్యటానికి, ఎత్తినగొంతును నొక్కెయ్యటానికి మతదాడులు, ఘర్షణలు నెపం అయ్యాయి. ఉపాచట్టం అమలయింది. షాజహానా ఆనాడు జమానత్ కవిత ముగింపులో జవాబులు కోరుతూ ‘‘ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? లౌకికరాజ్యం అంటే ఏమిటి? భారతీయులంటే ఎవరు?’’ వేసిన మూడుప్రశ్నలు జవాబు వెతుక్కోవలసినవిగానే ఉన్నాయి.
ముస్లిముల హక్కులను, ఆత్మగౌరవాన్ని గుర్తించని ప్రజాస్వామ్యం, ముస్లిముల మత సంస్కృతుల పట్ల అసహనంతో మత తీవ్రవాదులుగా ముద్రవేసే రాజ్యం, భారతీయ ప్రజాసమూహం నుండి ముస్లిములను వేరుచేసి దేశం విడిచే వెళ్ళవలసిన వాళ్లుగా కించపరిచే వర్తమాన మతఫాసిస్టు రాజకీయ సందర్భం ప్రజాస్వామ్యం, లౌకికరాజ్యం, భారతీయులు అనే భావనల సారాన్ని పీల్చేసి డొల్లగా మిగిల్చాయని కవిత వ్యంగ్యమానం చేస్తున్నది. షాజహానా కవిత్వంలో పదును పెయిన్ నుండి వచ్చిందే. కవితా సంపుటాల పేర్లు, చాలావరకు కవితల శీర్షికలు ఉర్దూ భాషాపదాలే. మాసూమ్, జహార్, పైగామ్ హవాలా, ఖిస్మత్ వాలీ, రస్మో వంటి అనేక ఉర్దూభాష పదాలను తెలుగు వాక్యంలోకి అలవోకగా అందంగా ఇమిడ్చి కవితలకు అత్తరు వాసనలను అద్దిన కవయిత్రి షాజహానా. జాతిజనుల బాధామయ అనుభవానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ బాధను తనబాధగా వినిపించిన షాజహానా కవితల ప్రాసంగికత ఈనాడు మరీ పెరిగింది. ఇలాంటి కవిత్వం మనకు బాధలో ఉన్నవాళ్ళ స్థానంలో నిలబడి ఆలోచించగల శిక్షణను ఇస్తుంది. భిన్నభాషా మత సంస్కృతుల పట్ల సహనాన్ని అభివృద్ధి చేసుకొని సౌభ్రాతృత్వ సహజీవనానికి సిద్ధపడే సంస్కారాల వికాసానికి దోహదపడుతుంది.
-కాత్యాయనీ విద్మహే