– డీసీపీ ఆనంద్బాబును ఎందుకు బదిలీ చేశారు
– రాహుల్పై విమర్శలు చేస్తే ఇలాగే వదిలేస్తారా
– సీఎం రేవంత్పై కిషన్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేయడం రాజ్యాంగ హక్కు అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. మెటాపై కేసు నమోదు చేసిన డీసీపీ ఆనంద్ బాబుని ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు. కిషన్రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం పని చేసిన ఆ అధికారిని సీఎం రేవంత్రెడ్డి శిక్షించారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్రెడ్డి ఆ డీసీపీని ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు. చట్టప్రకారం నడిచే అధికారులపై సీఎం వేటు వేస్తున్నారని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగం చేసిందని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై సోషల్ మీడియా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో ఉన్న టీవీకే ప్రభుత్వంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేశారని తెలిపారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేసులు నమోదు చేసిన అధికారులను శిక్షిస్తోందన్నారు. రేపు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా ఇలానే వదిలేస్తారా అని ప్రశ్నించారు. సింగరేణికి మూడు కోల్ బ్లాక్లు కేటాయించామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మణుగూరు బ్లాక్ను సింగరేణికి కేటాయించామని ప్రకటించారు. వేలంలో పాల్గొనేందుకు అనేకమంది ముందుకొచ్చారు కానీ సింగరేణి కష్టాలను దృష్టిలో ఉంచుకునే కేటాయించినట్లు వివరించారు. నైనీ, తాడిచర్ల బ్లాక్-2, మణుగూరు బ్లాక్లను సింగరేణికి కేటాయించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కొత్త బ్లాక్ల కేటాయింపుతో సింగరేణికి కొత్త ఆశలు వస్తాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని దోచుకున్నాయని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు