˜కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం
˜నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి?
˜మావోయిస్టులు తుపాకీ వీడి లొంగిపోవాల్సిందే…
˜కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
పెద్దపల్లి, ప్రజాతంత్ర, మే 5: నక్సల్స్ పై నిషేధం విధించిన కాంగ్రెస్ పార్టీయే నేడు నక్సల్స్ తో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలనడం బాధాకరమన్నారు. తుపాకీ పట్టి చంపేటోళ్లతో చర్చలేందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా నక్సల్స్ చేసిన హింసతో ఎంతో మంది చనిపోయారని, నెత్తురోడిన ఎన్నో ఘటనలను చూసిన ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటో చెప్పాలన్నారు. నక్సల్స్ తుపాకీ వీడి లొంగిపోవాల్సిందేనని, జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని ఉద్ఘాటించారు. ఈ విషయంలో హరగోపాల్, వరవరరావుసహా పౌరహక్కుల సంఘం నేతలే నక్సల్స్ కు నచ్చజెప్పాలని సూచించారు.
సోమవారం కాగజ్ నగర్ నుంచి కరీంనగర్ వెళుతూ మార్గమధ్యలో రామగుండంలోని ఎన్టీపీసీ వద్ద కాసేపు ఆగారు. స్థానిక బీజేపీ నేతలను కలిశారు. అనంతరం అక్కడికి వొచ్చిన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే… కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసంది. ఒక్క నేషనల్ హైవేస్ నిర్మాణం కోసమే 1 లక్షా 25 వేల 485 కోట్ల ఖర్చు చేశాం. ఇవిగాక రైల్వేల అభివృద్ధికి రూ.32 వేల కోట్లు ఖర్చు చేశాం. వడ్ల కొనుగోలుకు లక్షన్నర కోట్ల దాకా ఖర్చు చేశాం. మేం ఇంత చేసినా కేంద్రం నయాపైసా ఇవ్వలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. కేంద్రం ఖర్చు చేసిన నిధులపై లెక్కా పత్రంతో సహా వివరిస్తాం. చర్చకు రావాలని కోరినా వాళ్లు రావడం లేదు.
6 గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కులగణన పేరుతో ప్రభుత్వం డ్రామాలాడుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయనే లేదు. చేసిందల్లా సర్వే మాత్రమే. సర్వే అంటే తూతూ మంత్రంగా వెళ్లి డేటా తీసుకోవడం. రాష్ట్రంలో 50 శాతం ఇండ్లకు కూడా వెళ్లలేదు. జనాభా లెక్కలకు సర్వేకు పొంతనే లేదు. కుల సర్వేతో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. 52 శాతం జనాభా ఉంటే 46 శాతానికి కుదించింది. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించి దారుణంగా మోసం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం జనగణన మాదిరిగా ఇంటింటికీ వెళ్లి కులగణన చేస్తుంది. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దబోతోంది.
ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి చర్చలు జరపాలంటూ కొత్త నాటకం మొదలు పెట్టారు. అసలు నక్సల్స్ ను నిషేధించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నక్సల్స్ మెప్పు పొందడానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీలు పడి పొగుడుతున్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతున్న వాళ్లతో చర్చలేంది? వాళ్లతో మాటల్లేవ్…మాట్లాడుకోవడాల్లేవ్.. ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావును అడుగుతున్నా. ఎన్నో హత్యలను, చావులను చూశారు. ఎంతో మంది అమాయకులు, పోలీసులను కాల్చి చంపడాన్ని, నెత్తురోడిన ఘటనలు చూశారు. మరి ఇన్ని దశాబ్దలుగా మీరు సాధించిందేమిటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. నాడు టీడీపీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే నాటి సీఎం చంద్రబాబుపై నక్సల్స్ అలిపిరి వద్ద బాంబులు పేల్చి చంపాలని చూసింది నిజం కాదా? అజాత శత్రువు శ్రీపాదరావును చంపింది నిజం కాదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్ ను చంపింది నక్సల్స్ కాదా? జాతీయ జెండా ఎగరేసినందుకు సామా జగన్మోహన్ రెడ్డిని కాల్చి చంపిన నక్సల్స్ నల్ల జెండాలు ఎగరేసి దేశద్రోహం చేయలేదా? మహాముత్తారం లో ఎస్ఐ భార్య శ్రీమంతం చేసుకునే సమయంలో బాంబులు పెట్టి నక్సల్స్ ఆ ఎస్ఐని చంపేశారు. అప్పుడే కానిస్టేబుల్ ను చంపేశారు. దూరదర్శన్ జర్నలిస్టును చంపేశారు. బీజేపీ నాయకులు సామ జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, రామన్నగోపన్నలను చంపేశారు. గిరిజనులను, అమాయక ప్రజలను ఇన్ ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతుంటే సమర్దిస్తారా? అని ప్రశ్నించారు. నక్సల్స్ లో చర్చలు జరిపే ప్రసక్తే లేదు. తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. ఈ విషయంలో నక్సల్స్ ను హరగోపాల్, వరవరరావుసహా పౌరహక్కుల సంఘం నాయకులే నచ్చజెప్పాలని బండి సంజయ్ అన్నారు.