ఫార్మా, ఐటీ రంగాల్లో గణనీయమైన పురోగతి
దిల్లీ పరిస్థితులు చూసి గుణపాఠం తెచ్చుకోవాలి
మూసీరివర్ ఫ్రంట్ అభివృద్ధికి కొందరు అడ్డు
జపాన్ తెలుగు సమాఖ్య సదస్సులో సిఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్19 : అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. శనివారం జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో జపాన్లోని తెలుగు వారు భాగం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని.. రాష్ట్రంలో త్వరలోనే డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. టోక్యోలో రివర్ ఫ్రంట్ను పరిశీలించామన్నారు. మూసీనది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. దిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు.
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని.. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకం. తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరం. తోడ్పాటుతో ప్రపంచంతోనే మనం పోటీపడొచ్చు. ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం తనకు తెలుసని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.