ఉగ్రవాదానికి భారత్‌ ఎన్నటికీ తలొగ్గదు

  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా
  • బాధిత కుటుంబాలకు ఓదార్పు

శ్రీనగర్‌, ప్రజాతంత్ర,  ఏ‌ప్రిల్‌ 23: ‌ఉగ్రవాదానికి భారత్‌ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్‌గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు.
పహల్గామ్‌ ‌బాధిత కుటుంబాలతో  శ్రీనగర్‌లో కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా భేటీ అయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకముందు పహల్గామ్‌ ‌మృతుల భౌతికకాయాలకు అమిత్‌ ‌షా నివాళులర్పించారు. అమిత్‌ ‌షా.. పహల్గామ్‌ ‌సంఘటనాస్థలిలో పర్యటించారు. అమిత్‌ ‌షా వెంట జమ్మూకశ్మీర్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా ఉన్నారు. ఇక భద్రతా దళాలు ఆ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. పహల్గామ్‌ ఉ‌గ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా గుర్తించారు. వీరిలో 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు- సమాచారం. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌(‌టీ-ఆర్‌ఎఫ్‌) ‌ప్రకటించింది.

ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్‌ ‌చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏమీ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది మరణించారు. యూఏఈ, నేపాల్‌కు చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌ ‌ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్‌ ‌సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్‌ ‌కార్యాచరణపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page