మహిళలు లక్ష్యంగా అనైతిక రాజకీయాలు!

“త్రిషా కృష్ణన్, జార్జియా మెలోనిల పట్ల ఆన్లైన్ లో జరిగిన వ్యవహారశైలిని కలిపేది ఒకటే —పురుషులను అణగదొక్కడానికి మహిళల పేర్లను ఉపయోగించడం అనే అంతర్లీన యంత్రాంగం. రెండు సందర్భాల్లోనూ, అసలైన రాజకీయ లక్ష్యం ఒక పురుష నాయకుడే, కానీ చౌకబారు వ్యాఖ్యానాల వల్ల మూల్యం చెల్లించింది మాత్రం మహిళే! ఇది రాజకీయ పోరాటంలో ఒక స్పష్టమైన, నిరంతర ద్వంద్వ ప్రమాణాన్ని బయటపెడుతుంది. పురుష నాయకులను అధికారం, వాక్చాతుర్యం, ఆర్థిక విధానం, పరిపాలనా సామర్థ్యం ఆధారంగా అంచనా వేస్తారు. కానీ ప్రత్యర్థులు వారిని నిరుత్సాహపరచాలని లేదా అపఖ్యాతి పాలు చేయాలని అనుకున్నప్పుడు, దానికి బదులుగా వారు లింగపరమైన నైతికత మరియు వ్యక్తిగత సంబంధాలను ఆశ్రయిస్తారు..”

నేటి రాజకీయాల్లో, ప్రత్యర్థులు వాస్తవ విషయాలతో గెలవలేనప్పుడు, వారు ఒక పాత, నీచమైన వ్యూహాన్ని ఆశ్రయిస్తున్నారు. తమ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న మహిళలను ఆయుధాలుగా వాడుకోవడమే ఆ వ్యూహం. ఈ ధోరణి పితృస్వామ్యంతో సమానమైన పురాతన ప్రాథమిక సూత్రంపై ఆధారపడి వుంటుంది. ప్రజా జీవితంలో మహిళ ఒక స్వయంప్రతిపత్తి గల వ్యక్తి కాదు, పురుషుడికి వ్యతిరేకంగా ఉపయోగించగల ఒక బలహీనమైన అంశం మాత్రమే! మహిళా ప్రముఖులను పరోక్ష లక్ష్యాలుగా మార్చడం ద్వారా, రాజకీయ కార్యకర్తలు చౌకబారు వ్యాఖ్యలతో మహిళల స్వేచ్ఛను, గౌరవాన్ని, వారు కష్టపడి సంపాదించుకున్న వృత్తిపరమైన వ్యక్తిత్వాన్ని హరించివేయడం ద్వారా తామునుకున్న లక్ష్యాలను చేరుకోవాలని లేదా ప్రయోజనాలను పొందాలని చూస్తారు. ఇది బహిరంగంగా వ్యక్తమయ్యే లింగ వివక్ష నుండి ఒక సూక్ష్మమైన స్త్రీద్వేషంలోకి నిశ్శబ్దంగా జారిపోయే ప్రక్రియ మాత్రమే! ఈ స్త్రీద్వేషంలో, ఒక మహిళ తన పురుష సహచరులకు వ్యతిరేకంగా రాజకీయ ఆయుధంగా ఉపయోగపడేంత కాలం మాత్రమే ఆమె ఉనికిని సహిస్తారు!

సినీ నటుడు విజయ్ అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించి, సొంత పార్టీని ప్రారంభించిన తర్వాత తమిళనాడు రాజకీయ రంగంలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలను పరిశీలిద్దాం. అతని రాజకీయ వేదిక లేదా దృక్పథంతో నిమగ్నమవడానికి బదులుగా, విమర్శకులు వెంటనే ముఖ్యంగా నటి త్రిషా కృష్ణన్ ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత నిందలు, వ్యక్తిత్వ హననం వైపు మళ్లారు. చర్చలు, సోషల్ మీడియా , బహిరంగ సభలన్నింటిలోనూ, ప్రత్యర్థి వ్యాఖ్యాతలు విజయ్ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆమె పేరును పదేపదే ప్రస్తావించారు. ఈ విషపూరిత సమీకరణంలో, రెండు దశాబ్దాల నటనారంగ అనుభవం ఉన్న త్రిషా కృష్ణన్, స్వయంకృషితో ఎదిగిన ఒక విజయవంతమైన వృత్తి నిపుణురాలి నుండి కేవలం ఒక ప్రచార ఆయుధంగా మార్చబడ్డారు. ఆమె ఉనికిని, ఒక పురుష ప్రత్యర్థి విశ్వసనీయతారాహిత్యాన్ని లేదా నైతిక నిష్టను దెబ్బతీసే సాధనంగా వక్రీకరించారు.

ఈ నేపథ్యంలో వారు వోటర్లకు పంపిన సందేశం తిరోగమన శైలికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. ఒక వ్యక్తికి మహిళలతో అతనికున్న సంబంధాలను పరిశీలించి వాటి ఆధారంగా నాయకత్వానికి అర్హుడా కాదా అనేది నిర్ణయించడం ద్వారా సంచలనం సృష్టించాలనుకున్నారు. అదే సమయంలో, సదరు మహిళ సాధించిన విజయాలను కూడా పక్కనపెట్టి, ఆమెను ఇష్టానుసారం వాడుకోవడానికి కేవలం రాజకీయ పావులా పరిగణించారు. ఈ దౌర్భాగ్యపు ధోరణి ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాలేదు… అంతర్జాతీయ దౌత్యం వరకు విస్తరించడం వర్తమాన విచిత్రం! ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని,భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చుట్టూ ఉన్న ఆన్లైన్ చర్చను చూడండి. రెండు సార్వభౌమ దేశాల మధ్య ఒక వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధంగా, దౌత్యపరమై న పొత్తుగా ఖచ్చితంగా పరిగణించాల్సిన విషయాన్ని, సోషల్ మీడియాలో అందిపుచ్చుకుని, ప్రతిపక్ష బృందాలు ‘మెలోడీ’ మీమ్ ను విపరీతంగా వైరల్ చేసి, డిజిటల్ మీడియా వాతావరణాన్ని మార్చేశారు.

కొందరు దీనిని నిరపాయమైన ఇంటర్నెట్ సరదా సంభాషణగా లేదా ప్రజల తేలికపాటి ఆసక్తిగా కొట్టిపారేసినప్పటికీ, మీరు నిశితంగా పరిశీలిస్తే ఈ ధోరణి ఒక భిన్నమైన కథను చెబుతుంది. ప్రతిపక్ష నాయకులు, ఆన్లైన్ రాజకీయ నెట్వర్క్లు, రాజనీతిని వక్రీకరించడానికి దౌత్యపరమైన ఛాయాచిత్రాలను , ద్వైపాక్షిక సంభాషణలను పదేపదే ఉపయోగించుకున్నారు. ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రిగా, మెలోని సంక్లిష్టమైన ఈయూ రాజకీయాలను, ప్రపంచ భౌగోళిక రాజకీయాలను చాకచక్యంగా నడిపించాల్సి ఉన్నప్పటికీ, విమర్శకులు ఆమె సామర్థ్య రికార్డును లేదా విదేశీ సంబంధాలపై ఆమె వైఖరిని ఏమాత్రం ప్రస్తావించకుండా, తరచుగా ఆమె దౌత్యాన్ని ఇంటర్నెట్ మూస ధోరణులుగా, పసలేని వ్యాఖ్యానాలుగా మార్చేశారు.

త్రిషా కృష్ణన్, జార్జియా మెలోనిల పట్ల ఆన్లైన్ లో జరిగిన వ్యవహారశైలిని కలిపేది ఒకటే —పురుషులను అణగదొక్కడానికి మహిళల పేర్లను ఉపయోగించడం అనే అంతర్లీన యంత్రాంగం. రెండు సందర్భాల్లోనూ, అసలైన రాజకీయ లక్ష్యం ఒక పురుష నాయకుడే, కానీ చౌకబారు వ్యాఖ్యానాల వల్ల మూల్యం చెల్లించింది మాత్రం మహిళే! ఇది రాజకీయ పోరాటంలో ఒక స్పష్టమైన, నిరంతర ద్వంద్వ ప్రమాణాన్ని బయటపెడుతుంది. పురుష నాయకులను అధికారం, వాక్చాతుర్యం, ఆర్థిక విధానం, పరిపాలనా సామర్థ్యం ఆధారంగా అంచనా వేస్తారు. కానీ ప్రత్యర్థులు వారిని నిరుత్సాహపరచాలని లేదా అపఖ్యాతి పాలు చేయాలని అనుకున్నప్పుడు, దానికి బదులుగా వారు లింగపరమైన నైతికత మరియు వ్యక్తిగత సంబంధాలను ఆశ్రయిస్తారు.

సదరు మహిళ సంప్రదాయబద్ధంగా ఆకర్షణీయంగా ఉన్నప్పుడు ఈ నైతిక హనన గతిశీలత మరింత తీవ్రమవుతుంది. త్రిష కృష్ణన్, మెలోని యాదృచ్ఛిక ఉదాహరణలు కాదు. ఆకర్షణీయమైన మహిళలుగా వారికున్న గుర్తింపు, వారిని కథనానికి ఎరగా ఉపయోగపడేలా చేసింది. ఒక మహిళ రూపం ప్రజల దృష్టిని ఆకర్షిస్తే, అది ఈ రకమైన నీచ రాజకీయాలకు రెట్టింపు అనుకూలంగా మారుతుంది. ఆమె అందం క్లిక్ లను , శీర్షికలను సృష్టిస్తుంది, అవి ఆ నిందను మరింత ముందుకు తీసుకువెళ్తాయి. అదే సమయంలో విమర్శకులు సారాంశం కంటే ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని సులభతరం చేస్తుంది. ఇక్కడ క్రూరత్వం రెట్టింపు అవుతుంది. సినిమా లేదా అంతర్జాతీయ దౌత్యం వంటి బాహ్య స్వరూపానికి ప్రాధాన్యతనిచ్చే ప్రజా జీవితంలో ఆమె విజయాన్ని సూచించే లక్షణమే, ఆమెకు వ్యతిరేకంగా మార్చబడుతుంది. అది అల్పత్వం, అహంకారం లేదా నైతికత వైఫల్యానికి సాక్ష్యంగా ప్రదర్శితమవుతుంది. సమానమైన ప్రజా జీవితాల్లో ఉన్న, సంప్రదాయబద్ధంగా అంత ఆకర్షణీయంగా లేని మహిళలు ఈ కథనాలలోకి లాగబడే అవకాశం తక్కువ! ఇది ఆ యంత్రాంగం అసలు స్వరూపాన్ని బయటపెడుతుంది. ఒక మహిళ గుర్తింపు పొందినందుకు విధించే ఒక శిక్ష. స్త్రీ తన సొంత ప్రతిభతో ఎంత ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తే, ఆమె ఏదో ఒక పురుష లక్ష్యానికి వ్యతిరేకంగా ఆయుధంగా అంత ఉపయోగకరంగా మారుతుంది.

ఈ అలవాటు ప్రజా జీవితానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది బహువిధాలుగా పనిచేస్తుంది. మొదటిది, ఇది వాస్తవమైన సైద్ధాంతిక చర్చ స్థానంలో సంచలనాత్మక వ్యక్తిగత నిందలను ప్రవేశపెట్టి రాజకీయ సంభాషణను దిగజార్చుతుంది. రెండవది, ఒక ప్రమాదకరమైన నిరుత్సాహ ప్రభావాన్ని సృష్టిస్తుంది. మహిళలు అధిక ప్రాముఖ్యత ఉన్న ప్రజా వృత్తులలోకి ప్రవేశించకుండా, వాటిలో పాల్గొనకుండా లేదా వాటిలో కొనసాగకుండా వుండేందుకు హెచ్చరిస్తుంది. పురుషుల మధ్య పోటీలలో మహిళలు బలిపశువులుగా మారినప్పుడు, ప్రతి ప్రతిభావంతురాలైన మహిళ తాను కష్టపడి సంపాదించుకున్న వృత్తిపరమైన హోదాను వేరొకరి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చని తెలుసుకుంటుంది. మహిళలను రాజకీయ బలిపశువులుగా మార్చడాన్ని సమాజం సహిస్తే, అది మహిళా ప్రముఖుల గౌరవం, స్వేచ్ఛ అనేవి పితృస్వామ్య ప్రాధాన్యతల ఇష్టానుసారం మాత్రమే లభించే షరతులతో కూడినవని భావించే సంస్కృతిని బలపరుస్తుంది. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు మరియు డిజిటల్ వేదికలు ఈ ధోరణిని దాని అసలు రూపంలో బయటపెట్టాలి. ఇది మహిళలను వస్తువులుగా మార్చి ప్రత్యర్థులను పడగొట్టడానికి చేసే ఒక పిరికి ప్రయత్నం తప్ప మరోటి కాదు. నాయకులు తమ పోరాటాలను వ్యక్తిగత ప్రతినిధుల ద్వారా కాకుండా, విధానాల ద్వారా చేయాలని ప్రజా చర్చ నొక్కి చెప్పేంత వరకు, మహిళలు పురుషుల రాజకీయ ఆశయాలకు మూల్యం చెల్లిస్తూనే ఉంటారు. ఇతరుల పోరాటాలలో అనుకోని నష్టానికి గురవుతూనే ఉంటారు.
-తులసి జయకుమార్
(భవన్స్ ఎస్పీజేఐఎంఆర్ లో అర్థశాస్త్ర ప్రొఫెసర్ మరియు కుటుంబ వ్యాపార & వ్యవస్థాపక కేంద్రం కార్యనిర్వాహక సంచాలకులు.) ‘ మింట్ ‘ సౌజన్యం తో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *