– బస్సు డ్రైవర్ తప్పిదం లేదు
– ప్రకటన విడుదల చేసిన ఆర్టీసి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 3: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని తెలిపింది. రోడ్డు మలుపులో అతివేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గానీ, బస్ డ్రైవర్ గానీ కారణం కాదని స్పష్టం చేసింది. బస్ పూర్తి ఫిట్నెస్తోనే ఉందని, డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేనట్లు తేలిందని చెప్పింది. మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు సంస్థ పేర్కొంది. టిప్పర్ లారీ ఢీకొని బస్పై ఒరిగిపోవడంతో అందులో ఉన్న కంకర అంతా బస్లో ఉన్న ప్రయాణికులపై పడిపోయింది. దాంతో ఎక్కువ మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బస్ డ్రైవర్ దస్తగిరి సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్, ఆపరేషన్స్ ఇన్చార్జి ఈడీ శ్రీధర్, రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత, ఇతర సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించింది. గాయపడిన 25 మందికి మెరుగైన చికిత్స అందించాలని అధికార బృందం, అక్కడి డాక్టర్లను కోరిందని చెప్పింది. చనిపోయిన 19 మందిలో 5 గురు మహిళలు, 14 మంది పురుషుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపింది. మృతిచెందిన వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ నుంచి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినట్లు తెలిపింది. గాయపడిన వారికి రూ.2 లక్షల ఎక్సేష్రియా ప్రభుత్వం ప్రకటించిందని. అలాగే వాహనం ఇన్సురెన్స్ పాలసీ ద్వారా బాధితులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆర్టీసీ ఆకాంక్షించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





