రాజస్థాన్ సరిహద్దు మూసివేత
వ్యతిరేక పోస్టులపై అప్రమత్తంగా ఉండాలి
కేంద్రం హెచ్చరికలు జారీ
న్యూదిల్లీ, మే 8 : ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పరిస్థితి ఇపుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. పాక్ ప్రతి దాడులకు పాల్పడుతుందనే సమాచారం మేరకు భారత్ అప్రమత్తమైంది. దాడులను దీటుగా తిప్పికొట్టేందుకు సైన్యం సన్నద్ధంగా ఉంది. ఇకపోతే పాకిస్థాన్తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రాజస్థాన్లో 1,037 కిలోటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్పుర్, బికనేర్, కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ కాస్తున్నాయి. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకొంది.
సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్పుర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పుర్, తార్న్ తరన్ ప్రాంతాల్లో 72 గంటలపాటు స్కూళ్లను మూసివేశారు. రాష్ట్ర పోలీస్శాఖ, ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి.. సిబ్బంది తక్షణమే విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో నేడు కూడా పాకిస్థాన్ దళాలు శతఘ్ని గుండ్లను కాలుస్తున్నాయి. దీంతో మన సైన్యం దీటుగా బదులిస్తోంది. పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే వీటిల్లో ఒక జవాన్ సహా 13 మంది చనిపోయారు. సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోంశాఖ పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి.
ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వొస్తోంది. ఈక్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ పలు సూచనలు చేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి, భారత్ భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆయా సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు, భద్రతా దళాలకు మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు పెంచాలని పిలుపునిచ్చింది.