పాలనతో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌మధ్య తేడా లేదు..

కొన్ని పద్ధతులు మార్చుకుంటేనే ప్రభుత్వానికి మనుగడ
టీయూడబ్ల్యూజే రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు

హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఏడాది కాంగ్రెస్‌ ‌పాలన-పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలన’ మధ్య తేడా లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘ప్రజల ఆకాంక్షలు ఏడాది ప్రభుత్వ పాలనస అనే అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే.విరహత్‌ అలీ మోటివేటర్‌గా వ్యవహరించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఓయూ జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ ‌పద్మ షా, తెలుగు రాష్ట్రాల ఎన్నికల నిఘా వేదిక అధ్యక్షుడు డాక్టర్‌ ‌వివి.రావు, ప్రముఖ గేయ రచయిత, ప్రజా గాయకులు మాస్టార్జీ, ఫ్రీ లాన్స్ ‌జర్నలిస్ట్, ‌సామాజిక విశ్లేషకురాలు సజయ, సొసైటీ ఫర్‌ ‌రూరల్‌ ‌డెవలప్మెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ‌రెడ్డి, సామాజిక విశ్లేషకుడు డాక్టర్‌ ‌పి.వినయ్‌ ‌కుమార్‌, ‌లోక్‌ ‌సత్తా నాయకుడు, సీనియర్‌ ‌పాత్రికేయుడు తుమ్మలపల్లి శ్రీనివాస్‌, ‌కోవా అధ్యక్షుడు మజార్‌ ‌హుస్సేన్‌, ‌హైకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది ముస్తాన్‌ ‌మాలిక్‌ ‌తదితరులు పాల్గొని ప్రభుత్వ ఏడాది పాలనపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్ళు అధికారం చేపట్టిన గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పనితీరుకు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పాలనకు పెద్ద తేడా అనిపించడం లేదని రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పాల్గొన్న మెజార్టీ వక్తలు అభిప్రాయపడ్డారు. రేవంత్‌ ‌ప్రభుత్వం ఇప్పటికైనా కొన్ని పద్ధతులు మార్చుకుంటేనే మనుగడ సాగిస్తుందని వారు సూచించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page