ప్రపంచమంతా ఇప్పుడు కృత్రిమమేధతో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇది అనేక ఎలక్ట్రానిక్ పరికరాల సమూహంతో పనిచేస్తుంది. ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు వంటి పరికరాలను పని చేయడానికి సెమీకండక్టర్లతో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (ఐసి) లేదా మైక్రోచిప్స్ అవసరం. ఈ చిన్న భాగాలు మన రోజువారీ జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. ఒక్క స్మార్ట్ఫోన్లో వందకు పైగా సెమీకండక్టర్ చిప్లు ఉంటాయి. స్మార్ట్ఫోన్లలో సెల్యులార్ నెట్వర్క్కు కనెక్ట్ చేయడానికి, టచ్స్క్రీన్, డేటాను నిల్వ కోసం, కంప్యూటర్లలో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి బీ రిఫ్రిజిరేటర్లు, డిష్వాషర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్లు వంటి ఉపకరణాలలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సెమీకండక్టర్ల చిప్స్ అవసరం. ఇంకా కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఎఐ)లో కంప్యూటింగ్ శక్తికి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఏఐ మోడల్స్కు శిక్షణ ఇవ్వడానికి, ఏఐ, జిపియులకు ప్రత్యేక రకం చిప్ అవసరం. కృత్రిమ మేధ అనువర్తనాలు, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్లో ఉపయోగించే చిప్లకు డిమాండు ఉంది. వాహన తయారీదారులకు అధిక కంప్యూటింగ్ శక్తితో చిప్లు ఎక్కువగా అవసరం. ముఖ్యంగా పరిశ్రమ ఎలక్ట్రిక్ నుండి స్వయంప్రతిపత్తి వాహనాలకు మారుతున్నప్పుడు స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే వాటి కంటే భిన్నమైన చిప్స్ అవసరం అవుతాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ, 6జీలు భవిష్యత్తులో చిప్ డిమాండ్ను పెంచుతాయి.
చిప్స్ కొరత: కోవిడ్ -19 మహమ్మారితో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ లెర్నింగ్ వలన ఎలక్ట్రానిక్స్ పరికరాలకు డిమాండ్ను వేగవంతం చేసింది. సరఫరా గొలుసులను విపరీతంగా పెంచింది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు అంతరాయం కలిగించే చిప్ కొరత ఏర్పడిరది. ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 2019తో పోలిస్తే 2020లో 6.8 శాతం పెరిగింది. ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్స్ ప్రకారం ఇది 2022 లో 573.44 బిలియన్ డాలర్ల నుండి 2029 నాటికి 1,380.79 బిలియన్ డాలర్లకు 12.2% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని అంచనా వేసింది. ప్రపంచంలో ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య , ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుధ్ధాలు, అనేక దేశాలలో సంభవిస్తున్న సంక్షోభాలు ప్రపంచ చిప్ సరఫరా గొలుసును ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇక యుయస్ లో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక చైనా చిప్స్ అమ్మకాలపై నియంత్రణలను ప్రేరేపించవచ్చు. ఈ విషయాన్ని యుఎస్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ నివేదికలో ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ మార్కెట్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎస్ఐఏ) తెలిపింది.
ఈ కారణంగా మరో చిప్ కొరత ఏర్పడుతుందని కొన్ని అంచనాలు ఉన్నాయి. డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని చిప్ తయారీదారులు కూడా అంత త్వరగా పూడ్చలేరు. ఇంక ఇక్కడ మరో సమస్య ఉంది. కొత్త సెమీకండక్టర్ ఫ్యాబ్ లను తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల కొరత మరో పక్క ఉంది. ఎస్ఐఏ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం 2030 నాటికి ఈ పరిశ్రమలు 1,15,000 కంటే ఎక్కువ ఉద్యోగాల కల్పనకు కారణమవుతాయని అంచనావేయబడిరది.
మన దేశంలో పరిస్థితి: దేశంలో జనాభా, ప్రజల ఆదాయం, సాంకేతిక పరిజ్ఞానాల పెరుగుదల కారణంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్లు, టేబ్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ పెరగడంతో సెమీకండక్టర్ వినియోగం పెరుగుతోంది. నిరంతరం విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు, అధునాతన గాడ్జెట్ల పట్ల పెరుగుతున్న అభిరుచి, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ను ప్రాధమిక చోదక శక్తిగా నిలబెట్టాయి. ఇది దేశంలో సెమీకండక్టర్ మార్కెట్ పెరుగుదల గతిని ప్రభావితం చేసే కీలక రంగంగా మారింది. ప్రస్తుతం భారత్ ప్రధానంగా తైవాన్, చైనా, కొరియా, వియత్నాం దేశాల నుంచి సెమీకండక్టర్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దేశంలో సెమీకండక్టర్ మార్కెట్ విలువ 2023 లో 3430 కోట్ల డాలర్లు. 2023 నుండి 2032 కాలంలో కాలంలో 20.1% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్)తో 10,020 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో మనదేశం సెమీకండక్టర్ పరిశ్రమలో గణనీయమైన పురోగతిని సాధించింది. సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్ల అత్యంత నైపుణ్యం కలిగియున్న ప్రముఖ దేశాలలో ఒకటిగా మారింది. ప్రపంచంలోని సెమీకండక్టర్ డిజైన్ ఉద్యోగులలో 20 శాతం మనవారే ఉన్నారు. లక్ష మందికి పైగా విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్లు ప్రపంచ సెమీకండక్టర్ కంపెనీలు, దేశీయ డిజైన్ సేవా సంస్థలలో పనిచేస్తున్నారు.
సవాళ్లు: అధునాతన ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ (ఫ్యాబ్స్) స్థాపన నిర్వహణకు సంబంధించిన అధిక ముందస్తు ఖర్చుల మూలధన వ్యయం కారణంగా సెమీకండక్టర్ పరిశ్రమ గణనీయమైన నియంత్రణను ఎదుర్కొంటుంది. భారీ ప్రారంభ పెట్టుబడుల అవసరం చిన్న సంస్థలకు బలమైన అవరోధాన్ని సృష్టిస్తుంది. అదనంగా ఎగుమతి నియంత్రణలు, వాణిజ్య సుంకాలు, పర్యావరణ నిబంధనలు వంటి నిబంధనలలో మార్పులు సెమీకండక్టర్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. కఠినమైన నియంత్రణ అవసరాలు భారత సెమీకండక్టర్ మార్కెట్కు అవరోధంగా ఉన్నాయి. ఎందుకంటే అవి కొత్త ఉత్పత్తులు సాంకేతికతల అభివృద్ధి ప్రవేశాన్ని నిరోధిస్తున్నాయి. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, ఇతర పర్యావరణ ప్రమాణాలకు సంబంధించిన కఠినమైన నిబంధనలు, మేధో సంపత్తి, పేటెంట్లపై న్యాయ పోరాటాలు మార్కెట్ పురోగతిని ప్రభావితం చేస్తాయి. వివాదాలు సంబంధిత కంపెనీలకు చట్టపరమైన ఆర్థిక ఇబ్బందులకు గురిచేయవచ్చు.
పరిష్కారాలు: పోటీతత్వంతో ఉండటానికి ఉత్పత్తి క్షీణతను నివారించడానికి కంపెనీలు పరిశోధన అభివృద్ధిలో నిరంతరం పెట్టుబడి పెట్టాలి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, శక్తి వినియోగానికి సంబంధించిన సమస్యలతో సహా కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ అవసరాలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. సెమీకండక్టర్ తయారీ, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్పష్టమైన సహాయక నిబంధనలు, విధానాలు అవసరం. అనుమతుల ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, ప్రోత్సాహకాలను అందించడం పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుంది.
చేపడుతున్న కార్యక్రమాలు: ఎలక్ట్రానిక్స్ తయారీ, రూపకల్పనకు గ్లోబల్ హబ్ గా భారతదేశం ఆవిర్భవించడానికి వీలుగా శక్తివంతమైన సెమీకండక్టర్, డిస్ ప్లే పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యంగా 2021లో రూ.76,000 కోట్ల ఆర్థిక వ్యయంతో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లోని ఒక ప్రత్యేకమైన స్వతంత్ర వ్యాపార విభాగాన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమయ్యింది.
దేశంలో సెమీకండక్టర్ పరిశోధన అభివృద్ధికి మద్దతు ఇవ్వాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రదర్శిస్తుంది. 2014 లో ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ దేశంలో తయారీని ప్రోత్సహించడం, దేశాన్ని ప్రపంచ తయారీ హబ్ గా స్థాపిం చడం లక్ష్యంగా పెట్టుకుంది. సెమీకండక్టర్ ఉత్పత్తిని ప్రోత్సహిం చడానికి ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకంతో సహా అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. మెమరీ చిప్లలో గ్లోబల్ లీడర్ అయిన ‘‘మైక్రోన్ టెక్నాలజీ’’ సంస్థ భారీ నిర్దిష్ట ప్రణాళికతో గుజరాత్లో కొత్త సెమీకండక్టర్ అసెంబ్లీ యూనిట్ని నెలకొల్పనుంది. ఇది దేశ సెమీకండక్టర్ స్థితిగతులను గణనీయంగా పునర్నిర్మిస్తుందని భావిస్తున్నారు.
-జనక మోహన రావు దుంగ
యం.యస్సీ (ఫిజిక్స్)
8247045230.