విప్లవ ఉపాధ్యాయుడు లెనిన్ జయంతి రోజన పార్టీ ఆవిర్భావం
కార్యకారణ సంబంధం లేకుండా ఏ ఉద్యమాల పుట్టుకలు, ముగింపులు వాటికి అవే గాలిలో నుంచి పుట్టుకుని రావు. ఆయా వ్యవస్థల అంతర్గత వైరుధ్యాల ప్రభావం మూలంగానే ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి. సమాజాన్ని ప్రతిభావంతమైన రీతిలో విశ్లేషించి, ప్రగతిశీల స్వభావాన్ని పుణికి పుచ్చుకున్న సమరశీల లైన వీరయోధులు మాత్రమే, తమను తాము ప్రభావితం చేసుకుని ఆ ఉద్యమాలతో మమేకమై, దానికి నాయకత్వం వహిస్తారు. ఆయా దేశాల స్థల, కాల పరిస్థితులకు అనుగుణమైన వ్యూహం, ఎత్తుగడలను రూపొందించుకుని సృజనాత్మకంగా అమలు చేసిన వారే ఆ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేరుస్తారు. ఆ సృజనాత్మకత, దీరోదాత్తత లోపించిన వారు, తమ అన్యవర్గ భావజాలాన్ని వదులుకోలేని వారు, కార్మికవర్గ సమర శీలతను పునికి పుచ్చుకోలేని వారు ఉద్యమాన్ని ఓటమి అంచుల్లో అదిమి పెట్టడానికి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత రాజకీయ వేదిక మీద ప్రఖ్యాత విప్లవ యోధుడిగా పేరుగాంచిన కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఈనాడు దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువైన మావోయిస్టు పార్టీ గరిమనాభి అయిన సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీగా విప్లవ ఉపాధ్యాయుడు లెనిన్ జయంతి ఏప్రిల్ 22న ఆవిర్భవించింది. దాని నిర్మాత ఉపాధ్యాయుడైన కొండపల్లి సీతారామయ్య.
ఆర్థిక అవసరాల కేంద్రీకృత భావాలే రాజకీయాలు!” “రాజకీయాల కొనసాగింపే యుద్ధం! యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయాలు!” “రాజకీయాలు అంటే రక్తపాతం లేని యుద్దమని!’ కార్ల్ మార్క్స్ చెప్పిన వాదన కొండపల్లికి శిరోధార్యం. గుప్పెడు మందిని కలిపి ఉద్యమాన్ని మొదలేసిన కొండపల్లి సీతారామయ్య క్రియాశీలత, అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై ఎంతో ఎత్తుకు ఎదిగిన రీతిలో ఆ పార్టీ దేశ రాజకీయాల్లో 13-14 రాష్ట్రాలకు విస్తరించి పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఎనలేని త్యాగాలకు వీరోచిత ప్రతిఘటనకు పూనుకునేలా తన బలగాలను తీర్చిదిద్దింది.”మనిషిని ఇంకొక మనిషి, జాతిని ఇంకొక జాతి దోచుకోవడానికి వీలులేని సామాజిక వ్యవస్థను నిర్మించి తీరుతానని అందుకు దోపిడీ వర్గాలను బలప్రయోగంతో కూల్చివేయవలసిన అవసరం ఉన్నదని” ఆయన భావించాడు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోల ఆలోచనలను అనుసరించి అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశమైన ఇండియాలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి, గొప్ప సామాజిక వ్యవస్థ సృష్టి కోసం దీర్ఘకాలిక సాయుధ పోరాటం ధ్వారా పాలకులను కూలదోయవలసి ఉన్నదని ఆయన నమ్మాడు. ఆయన నిర్మించిన విప్లవ పార్టీకి పీపుల్స్ వార్ ఉద్యమానికి విద్యార్థులే పట్టుగొమ్మలయ్యారు. కొండపల్లి సీతారామయ్య, కే.జీ సత్యమూర్తి, ముప్పాల్ల లక్ష్మణ్ రావు, మల్లోజుల కోటేశ్వరరావు, ఐవి సాంబశివరావు లాంటి ఉపాధ్యాయులు దాని నిర్మాతలు, నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్, ముక్కు సుబ్బారెడ్డి, నంబాల కేశవరావు, చెరుకూరి రాజకుమార్, పులి అంజయ్య,కటకం సుదర్శన్ లాంటి యువ విద్యార్థులు ఆ పార్టీని ఉక్కు క్రమశిక్షణ గలిగిన పార్టీగా మలచ గలిగారు.సూరపనేని జనార్దన్,కొండపల్లి సీతారామయ్య ఒక్కగానొక్క కొడుకు కొండపల్లి చంద్రశేఖర్ లాంటి విద్యార్థుల ప్రాణ త్యాగాలు ఆ పార్టీని ఉక్కు కవచమై పటిష్ట పరిచాయి.అసమాన త్యాగధనులుగా పేరొందిన అనేకమంది యోధులు ఆ పార్టీకి మూల స్థంబాలయ్యారు.
మొదటగా పీపుల్స్ వార్ గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ ధ్వారా, విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత విద్యను అభ్యసించిన ఉన్నత విద్యావంతుల నేతృత్వంలో ప్రచార దళాలను పంపి విశాలమైన ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళగలిగింది. కూలీల కూలీరేట్ల పెంపకం, జీతగాళ్ళ(పాలేర్ల) జీతాల పెంపుకోసం పోరాటాలను నిర్వహించింది.అంటరాని వాళ్లుగా భారత సమాజంలో వెలివేయబడిన మాల మాదిగ పల్లెలు,వెలివాడలు కేంద్రం చేసుకుని గ్రామీణ ప్రజానీకాన్ని,కుల,మతాలుగా విడిపోవడం గాకుండా ఐక్యంగా కలిసి గ్రామాల్లో భూస్వాముల దౌర్జన్యాన్ని ఎదిరించి దున్నెవానికే భూమి ప్రాతిపదికగా దిక్కుమొక్కు లేని జనం ఒక్కటై పోరాడాలని చైతన్యపరిచింది.
దొరగడీల దౌర్జన్యాలను నిలువరించడానికి,దొరలను గల్లా బట్టి బజారుకు ఈడ్చుకొచ్చి ప్రజలపై జరిపిన దౌర్జన్యాల మీద ప్రజాకోర్టులో విచారణ జరిపింది.దౌర్జన్యాలను నిలువరించ గలిగింది.ప్రాథమికంగా ప్రభుత్వ బంజరు భూముల్లో, క్రమేపి బలాన్ని పుంజుకుని భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలను పాతి నిరుపేదలకు పంచగలిగింది. పట్టణాల్లోని విద్యాలయాలను మాత్రమే కాదు, గ్రామీణ యువకులను రైతు-కూలీలను, మహిళలను, పారిశ్రామిక కార్మికులను, ఆదివాసీలను కూడగట్టి రాడికల్ విద్యార్థి, యువజన, రైతుకూలి, మహిళా సంఘాలను నిర్మించి సారా వ్యతిరేక పోరాటాలు నిర్వహించింది సారా డిపోలను ఎత్తి వేయించింది. వరకట్న దురాచారాన్ని, మహిళలపై దౌర్జన్యాలు అరికట్టడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. సింగరేణి కార్మికులను, ఆదివాసీలను ఐక్యం చేసి ఉద్యమాలను ఉర్రూతలూగించింది. గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ లో భాగంగా గ్రామీణ ప్రజల బాధలను, వారి దీన గాధలను ఆకలింపు చేసుకున్న విద్యార్థుల్లోని చురుకైన,సృజనాత్మక ఆలోచనలు కలిగిన వారిని ప్రోత్సహించి,వారిలో త్యాగశీలతను నింపి, వారిని ఆర్గనైజర్లుగా నియమించి ఆ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పునాదులను వేసుకోగలిగింది.
ప్రభుత్వాలకు బలమైన ప్రాంతాలైన పట్టణాలు కాకుండా, స్థావరంగా పల్లెలను పట్టుకుని పట్టణాలను చుట్టుముట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే దాని వ్యూహాన్ని అనుగుణంగా దాని నిర్మాణాత్మక కార్యక్రమాన్ని కొనసాగించింది. 1969లో శ్రీకాకుల పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, విశాఖ ఉక్కు ఉద్యమం, సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లోని సమర శీలతను తట్టి లేపినవి. అప్పటి వరకు సీపీఐ ఎంఎల్ సీఓసీగా ప్రజా ఉద్యమాన్ని అనేక బాలారిష్టాల మధ్య కొనసాగించిన కొండపల్లి సీతారామయ్య 1980 ఏప్రిల్ 22న ఆ పార్టీకి పీపుల్స్ వార్ గా రహస్య జీవితం, రహస్య ప్రాంతంలోనే నామకరణం చేశాడు. కాలక్రమేణా అదే నేడు దేశంలోని పీయూ, ఎంసీసీ తదితర అనేక విప్లవ గ్రూపులను కలుపుకుని ముప్పాల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి నేతృత్వంలో 2004 లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టుగా రూపు దిద్దుకున్నది. పుక్కిటి పురాణమే కావచ్చు! “శ్రీకృష్ణుడు కంసునికి ప్రాణ గండమై పుట్టినట్లు, పీపుల్స్ వార్ పార్టీ దొరతనానికి ప్రాణగండమై పుట్టిందని దాని ప్రత్యర్థులు కూడా పీపుల్స్ వార్ పార్టీని తిట్టిపొస్తుంటారు. తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవం అస్త్రసన్యాసం చేసిన నాటి నుంచి 70 వ దశకం నాటికి ఎదురులేని రీతిలో గ్రామాల్లో గడీల పాలన కొనసాగించిన దొరలు, భూస్వాములకు పీపుల్స్ వార్ చర్యలను నిలువరించే శక్తి లేకపోయింది. వారు వ్యయ ప్రయాసలకు ఓర్చి గ్రామీణ ప్రజల్లో తమ చెప్పుచేతల్లో ఉన్న ఒక సెక్షన్ కు చెందిన నమ్మినబంట్లకు సాంప్రదాయ ఆయుధాలను అందించి స్వంత సాయుధ బలగాలను నక్సలైట్ల మీద ప్రయోగించి విఫలమైపోయారు. భూస్వాముల సాయుధ బలగాలు తోక ముడిచిన పలితంగా, గ్రామీణ భూస్వాములు పోలీసు బలగాల మీద ఆదారపడి భౌతిక దాడులు, అరెస్టులు,లాకప్పులు,థర్డ్ డిగ్రీ చిత్రహింసలు, కేసులు, జైళ్లు ఎంకౌంటర్లకు పాల్పడుతున్నరని ప్రభుత్వ దమన కాండను నిలువరించడానికి నక్సలైట్లు కొత్త పోరాట రూపాన్ని వెదకక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో భూస్వాముల వ్యతిరేక ప్రజాయుద్దాన్ని ప్రభుత్వం తన బాధ్యతగా ఎదుర్కోవడం ప్రారంభించింది.
నక్సలైట్ సమస్యను సామాజిక కోణంలో చూసి రాజకీయ పరిష్కారాన్ని చూపకుండా వివిధ ప్రభుత్వాలు సమస్య పరిష్కార బాధ్యతను పోలీస్ కు అప్పగించింది. పోలీస్ బలగాలను ప్రయోగించి ప్రభుత్వం కొనసాగిస్తున్న అణిచివేత వ్యూహాన్ని తిప్పికొట్టడానికి పీపుల్స్ వార్,తమను అణిచివేయడానికి దూకుడుగా ముందుకు వచ్చిన భూస్వాముల్లోని, పోలీస్ అధికారుల్లోని కొందరి మీద తాను నిర్మించిన సాయుధ గెరిల్లా దళాలను ప్రయోగించి మెరుపు దాడులు జరిపి హత్యలు చేయడం ప్రారంభించింది. ఆ ఘటనల పరంపర ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య ప్రత్యక్ష యుద్ధంగా రూపు దాల్చింది. నిత్యనిర్భంధాన్ని ఎదురుకుంటూనే ఆ పార్టీ పురోగమించింది. పరిపాలనలో అత్యంత శక్తి వంతులుగా పేరు గాంచిన వెంగలరావు, ఎన్ టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దాడిని తిప్పికొట్టి ముందుకు సాగింది. చరిత్రలో పీడిత ప్రజల ఉద్యమాలు నిత్య నిర్భందంలోనే పుట్టి పెరిగి పురోగమిస్తుంటవి. ఆ క్రమంలోనే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ప్రాథమిక యూనిట్లను నిర్మించి లోతట్టు అటవీ ప్రాంతాలను స్థావరంగా చేసుకుని ప్రభుత్వ సైన్యాల యుద్ధ చర్యలకు గురవుతున్నది. ప్రభుత్వ అణిచివేత నుండి తనను తాను రక్షించుకోవడానికి రెండు దశాబ్దాల క్రితమే మైదాన ప్రాంతాలను వదిలేసి అటవీ ప్రాంతాలకు తన బలగాలను ఉపసంహరించుకున్నది. దండకారణ్యంలో ఆదివాసీల అభివృద్ధి కోసం నేడు అది నమూనా ప్రాథమిక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరిచి పరిపాలన నిర్వహిస్తున్నది.భారత ప్రభుత్వం దండకారణ్యంలోని ఖనిజ సంపదను దేశ కార్పొరేట్లకు,విదేశీ బహుళ జాతి కంపెనీలకు ధోచిపెట్టడానికే ఆదివాసీలను చంపివేసి ఖాళీ చేయించే కుట్రకు పాల్పడి మారణ కాండను అమలు చేస్తున్నదని ఆ పార్టీ ప్రభుత్వంపై ఆరోపిస్తున్నది తప్పు పడుతున్నది.చంపి వేసి అయినా సరే అడవి నుండి గెరిల్లాలను తొలగించాలని భారత ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు అర్ధమౌతున్నది.అందులో భాగంగానే ముహూర్తం పెట్టి మావోయిస్టు పార్టీ పరిపాలిస్తున్న జనతన సర్కార్ కేంద్ర స్థావరం మీద భారత ప్రభుత్వ సైన్యాలు చుట్టుముట్టి మట్టుబెట్టే కార్యక్రమానికి పూనుకున్నవి.
ప్రభుత్వ సైన్యాల చక్రబందంలో, పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడిలా ప్రభుత్వ సైన్యాలను ప్రతిఘటిస్తు, ఆ పార్టీ అంతులేని నెత్తురు దారపోస్తున్నది. అక్కడ ఆదివాసి యువతీ యువకులను ప్రభుత్వ బలగాలు వెంటాడి చంపుతున్న తీరును చూసి చలించిన పౌర సమాజం దండకారణ్యంలో మావోయిస్టుల భూచిని చూపి ఆదివాసీల మీద జరుగుతున్న మారణకాండను నిలువరించాలని దేశ వ్యాపిత ప్రజాస్వామిక వాదులు శాంతి కమిటీని ఏర్పరిచి కాల్పుల విరమణ చేసి చర్చలు జరపాలని,రక్తపాతాన్ని నివారించాలని ఇరువర్గాలను కోరింది.మావోయిస్టులు కాల్పుల విరమణకు సిద్ధం కాగా,ప్రభుత్వ నిర్ణయం పెండింగ్ లో ఉన్నది.ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా, ఆధునికీకరించబడిన భారత సైన్యాల చేతిలో చుట్టుముట్టి మట్టుబెట్టే వ్యూహంలో చిక్కి గుక్క తిప్పుకోలేని పరిస్థితుల్లో మావోయిస్టు శ్రేణి నేడు కూరుకు పోయింది.ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో కులాలు, మతాలు,ప్రాంతాలు,జాతులు,దేవుళ్
పాతకాలపు వ్యూహం ఎత్తుగడల్లో మార్పులు,చేర్పులు,సవరణలను సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నది.వైవిద్యభరిత భారతంలో ఆ పార్టీ నేటి స్థల, కాల పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి ఉన్నది.దేశ నిర్ధిష్ట పరిస్థితులను నిర్వచించి,దాని స్వభావానికి అనుగుణమైన వ్యూహాన్ని,ఎత్తుగడలను రూపొందించి, విప్లవ ఉద్యమాన్ని పునాదుల్లో నుండి నిర్మించి,నిర్వహించి,దాని శ్రేణులను సమన్వయపరిచి, దాని ఉథ్దాన, పతనాలను అవలోకన చేసుకుని,ఉక్కు క్రమశిక్షణను నెల కొల్పడంలో తలపండి,తమ బలగాలను కాకలు తీరిన యోధులుగా, తీర్చి దిద్దడంలో ప్రఖ్యాతి గాంచిన తరం వయస్సు ఉడిగి, అనారోగ్యం, ప్రభుత్వ దాడి తదితర కారణాలు సమ్మిలితమై అంతరించి పోబోతున్నది. ఆ పార్టీ తీసుకోబోయే నిర్ణయం దాని సంస్థాగత వ్యవహారంగా భావించవలసిన అవసరం లేదు.అది కోట్లాది ప్రజల ఆశలు, ఆశయాలను వారి తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పుకున్న ఆ పార్టీ ప్రణాళికను పణం పెడుతుందా?ప్రగతి శీలతను అలాగే పట్టుకుని ఉంటుందా?లేదా?అని ఆ పార్టీ స్వభావాన్ని అర్ధం చేసుకోలేని విద్యావంతులైన ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. చరిత్ర నిర్మాతలైన అశేష ప్రజాశ్రేణి,చలన శీలమైన కాలం,దాని గమ్యాన్ని, గమనాన్ని నిర్ణయిస్తుంది.
ఎస్సార్ యాదవ్
సీనియర్ జర్నలిస్ట్, సామాజిక,
రాజకీయ విశ్లేషకులు