అడ్డుకుంటామంటున్న విహెచ్పి, రద్దుచేయండంటున్న ప్రజాసంఘాలు
విశ్వసుందరి అందాల పోటీకి హైదరాబాద్ అలంకరించుకుంది. మరో నాలుగురోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఇప్పటికే ప్రపంచ సుందరాంగులు ఒక్కొక్కరిగా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ అధికారులు వారికి శంషాబాద్ ఏయిర్పోర్టులో ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు కెనడా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి పలుదేశాలకు చెందిన సుందరీమణులు ప్రభుత్వ ఆతిధ్యాన్ని స్వీకరిస్తున్నారు. కాగా భారత్ తరఫున 2023 మిస్ ఇండియా వరల్డ్ పోటీలోఉన్న నందినీగుప్తా కూడా రానుంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత మిస్ వరల్డ్గా ఉన్న పోలెండ్కు చెందిన కరోలినా బీలవ్స్కా గ్రాండ్ ఫినాలెలో తన వారసురాలికి కిరీటం అలంకరించాల్సి ఉంది. గతంలో 1996, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరీమణుల పోటీలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణలో మొదటిసారిగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాలనుండి యువతులు పాల్గొననున్నారు.
ఈ నెల పది నుండి 31వ తేదీ వరకు దేశంలోని పది విభిన్న ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టిన ఈ పోటీలు రాష్ట్ర రాజధానిలోని గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. అనంతరం హైటెక్, శిల్పారామం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, నాగార్జునసాగర్, వికారాబాద్ను అందుకు అనువైన ప్రాంతాలుగా ఎంపిక చేసుకున్నారు. ఆయా ప్రదేశాలకున్న విశిష్టతను ప్రపంచ నలుమూలల చాటటంతోపాటు ఆ ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ది చెందుతాయన్నది ప్రభుత్వ సంకల్పం. చారత్రిక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన తెలంగాణకు ప్రపంచ పర్యాటక పటంలో చోటు కల్పించాలన్నదే ధ్యేయమంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
యునెస్కోలో చోటుచేసుకున్న రామప్పతోపాటు వెయ్యి స్థంబాలగుడి, వరంగల్ ఫోర్టును అలాగే నల్లగొండలో నాగార్జున ప్రాజెక్టును, వస్తప్రపంచలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంక్రమించుకున్న పోచంపల్లి చేనేత చీరలను, మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి వృక్షం లాంటి వింతలను వందకు పైగా దేశాలకు చెందిన సుమారు లక్షన్నర నుండి రెండు లక్షల మంది సందర్శకులకు పరిచయం చేయడం ద్వారా వాటికి సరైన ఆదరణను తీసుకురావాలన్న లక్ష్యంగానే ప్రభుత్వం 2025 మిస్ వరల్డ్న్ తెలంగాణలో నిర్వహిస్తున్నది.
అయితే ఈ పోటీలను కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పోటీలను నిర్వహించడమంటే భారతీయ సంస్కృతిని అవమానించడమేనంటున్నారు. కట్టు, బొట్టు, నిండైన చీరతో కనిపించే భారతీయ మహిళలకు భిన్నంగా, అతి చిన్న గుడ్డలతో తమ అందాలను ఆరబోసే భామలను వేదికలపై ఎక్కించడం ద్వారా విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దే ప్రయత్నం ఇది అంటున్నారు. అందాల పోటీలంటే స్త్రీలను నడిరోడ్డున వేలం వేయడమేనంటున్నారు సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ. పవిత్రమైన స్త్రీజాతిని అవమానపరుస్తూ కోట్లాది రూపాయలను వ్యయం చేస్తున్నారంటారాయన. మహిళలు తమ స్వయం శక్తితో జీవించే విధంగా వారిని ప్రోత్సహించాలె గాని ఇలా బజారున పడేయటమేంటంటున్న ఆయన దీన్ని వెంటనే బ్యాన్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఆందాల పోటీలు నిర్వహిస్తున్నారన్న వార్త రావడంతోనే తాము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విశ్వహిందూపరిషత్ ముందుగానే ప్రకటించింది.
కాగా అక్కడక్కడ ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు కూడా తమ అయిష్టతను వ్యక్తపరిచారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పహల్గాం దాడి తర్వాత దేశంలో టెన్షన్ వాతావరణం ఉన్నవేళ అందాలపోటీలు నిర్వహించడం సరైందికాదని ఆ పార్టీ ముఖ్యనాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు సంబంధంలేని కల్చర్ను తీసుకురావడంపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయంటున్న ప్రభుత్వం ఎలా ఏర్పడుతాయో చెప్పాలంటున్నారు. రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టుబడులు వొస్తాయని గత ప్రభుత్వం 55 కోట్లతో ఈ కార్ రేస్ను చేపడితే దానిపై గొంతుచించుకున్న కాంగ్రెస్ ఆర్థికంగా ఎలాంటి లాభంలేని అందాల పోటీకి కోట్లాది రూపాయలను వ్యయం చేయడం ఎంతవరకు న్యాయమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ప్రశ్నిస్తున్నారు.