– జూన్ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
– ఇందిరమ్మ ఇళ్లకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక
– ముందస్తు సాగుకు రైతులను సిద్ధం చేయాలి
– నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు
– ఎరువులు, విత్తనాల కొరత ఉండొద్దు..
– అధికారులకు మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు
ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వర్షాకాల ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ శాఖ ముందస్తు సాగు వంటి పలు అంశాలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవసరమైన సహకారం తీసుకోవాలని ఆయన అధికార్లకు సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు కూడా పూర్తి చేశామని అన్నారు. రూ.5 లక్షల వ్యయంతో పేదలకు ఇండ్లు కట్టించే పథకం దేశంలో ఎక్కడా లేదని, ఒకేసారి 3500 ఇండ్లు మంజూరు చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. రూ. 22500 కోట్లతో 4.5లక్షల ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని అన్నారు. భూ భారతి చట్టంతో ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఉదయం జాతీయ పతాకావిష్కరణతో పాటు సాయంత్రం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తాగునీటి సరఫరా ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అన్నారు. హాస్పిటళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, అవసరమైన మందుల స్టాక్ పంపుతున్నామని, ప్రతి నెలా ఆరోగ్య శ్రీ, మందులకు చెల్లింపులు పూర్తి చేస్తున్నామని అన్నారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలపై తీసుకుంటున్న చర్యలు వెంటనే పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ర్యాండమ్ గా చెక్ చేయాలని, అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు చేరాలని మంత్రి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్స్ మంజూరు చేయడంతో పాటు నిర్మాణ పనుల పురోగతిని కూడా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రుతుపవనాలు ముందుగా వొచ్చిన నేపథ్యంలో వానాకాలం పంట సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందు బాటులో వుంచాలన్నారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ బాగు చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని అన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం పనులు రూ. 200 కోట్లతో ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.