- న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
- రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్23: న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా రూ. 88 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు సుధీర్ బాబు వెల్లడించారు. ఇంకా, 30 మందికి జీవిత ఖైదు విధించడం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ చలామణి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా, లోక్ అదాలత్ ద్వారా 11 వేలకుపైగా కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
మోహన్ బాబు ఘటనపై స్పందిస్తూ.. మోహన్ బాబు కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. మోహన్ బాబు వాళ్లు టైం అడిగారు. ఆ టైం తరువాత అవసరమైన చర్యలు చేపడతామన్నారు అవసరమైతే మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని, బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. బౌన్సర్లకు ప్రత్యేక గైడ్లైన్స్ను రూపొందిస్తామని, బౌన్సర్లు తోపులాటలు చేసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీని ఉపయోగించి క్రైమ్ రేటు తగ్గించామని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు.
2024లో మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కమిషనరేట్ పరిధి నేర వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ‘ఈ ఏడాది నమోదైన 33,084 కేసుల్లో 25,143 కేసులు పరిష్కరించాం. 3 షిఫ్టుల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాం. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధిక కేసులను పరిష్కరించిన కమిషనరేట్గా రాచకొండ నిలిచింది. మా పరిధిలో నమోదైన కేసుల్లో 30 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. అందులోనూ అగ్రస్థానంలో నిలిచాం. సంచలనం సృష్టించిన మోటకొండూరు పీఎస్ పరిధిలో 14 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. వివిధ కేసుల్లో 160 మందికి శిక్ష ఖరారైంది.
లోక్ అదాలత్లో 11,440 కేసులతో పాటు 70,791 పెట్టీ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ ఏడాది డయల్ 100 ద్వారా 2,41,742 ఫిర్యాదులు వొచ్చాయి. అన్ని విభాగాల్లో కలిపితే క్రై రేటు 4? మాత్రమే పెరిగింది. గతేడాదితో పోలిస్తే హత్యకేసుల్లో ఎలాంటి మార్పు లేదు. చోరీ కేసులు 6, డొమెస్టిక్ వయిలెన్స్ కేసులు 23 తగ్గాయి. రూ.88.25 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశాం. మొత్తం 521 మంది డ్రగ్ నేరస్థులను అరెస్ట్ చేశాం. ఆ నిందితులపై 165 రౌడీషీట్లు ఓపెన్ చేశాం. ఎన్నికల సందర్భంగా రూ.16 కోట్ల నగదు, మద్యం సీజ్ చేశాం. సైబర్ బాధితులకు రూ.22 కోట్లు రిఫండ్ అయ్యేలా చర్యలు చేపట్టాం అన్నారు. కమిషనరేట్ పరిధిలో హద్దు దాటే బౌన్సర్లపై తీవ్ర చర్యలు ఉంటాయి. భయానక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసి దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.