శ్రీతేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలి..

బాలుడి ఆరోగ్యం మెరుగుప‌డుతోంది.. మాజీ మంత్రి హ‌రీష్‌ రావు

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : సంధ్య థియేట‌ర్‌లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన శ్రీతేజ్ కోలుకుంటున్నాడ‌ని, వైద్యానికి స్పందిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. గురువారం కిమ్స్ శ్రీతేజ్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామ‌న్నారు. కిమ్స్ యాజమాన్యం భాస్క ర్ రావు నేతృత్వం లో శ్రీతేజ్ కు మంచి వైద్యాన్ని అందిస్తున్నార‌ని చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన రేవతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీతేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన అంద‌రినీ క‌లిచివేసింద‌ని తెలిపారు.

ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి వొచ్చింద‌న్నారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు అని ప్ర‌శ్నించారు. గురుకులాల పిల్లల మాతృమూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదని నిల‌దీశారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రెవంత్ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేద‌న్నారు. సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు ? అని హ‌రీష్ రావు నిల‌దీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page