అమెరికా,రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో,సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది. భారత్ ను ఇబ్బందులు పెడుతున్న ఉగ్రవాదుల మదమణిచే చర్యకు భారత్ పూనుకుంటుందా? అందమైన కాశ్మీరం ఆనందంలో మునిగి తేలుతుండగా,ప్రకృతి పారవశ్యంలో పర్యాటకులు ఆనంద డోలికల్లో విహరిస్తుండగా మానవత్వం మచ్చుకైనా కానరాని ముష్కరుల తూటాలకు పలువురు మృత్యువు ఒడికి చేరారు. అమాయకుల రుధిరంతో పచ్చని పహల్గాం ఎరుపెక్కింది.అమర్ నాథ్ యాత్రకు శ్రీకారం పలుకుతున్న
కాశ్మీర్లోని పహల్గామ్ పేరొందిన పర్యాటక కేంద్రం. ఇదొక హిల్ స్టేషన్. పహల్గాం బైసరన్ లోయ స్విట్జర్లాండ్ కు ప్రతిరూపంగా పేర్కొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో మదిని పులకరింప చేసే అందమైన పర్యాటక ప్రాంతం ముష్కరుల నరమేథంతో మూగబోయింది. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల ఆక్రందనలు మిన్నంటాయి.
క్షతగాత్రుల దేహాలు రక్తంతో తడిసిపోయాయి. బైసరన్ లోయలో అందమైన ప్రకృతి అలజడికి లోనై విలపించింది. సైనికుల దుస్తుల మాటున పొంచి ఉన్న మృత్యువును గమనించలేని పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓలలాడుతుండగా ఓర్వలేని ఉగ్రమూక పంజా విసిరి, 28 మంది పర్యాటకులను కర్కశంగా బలితీసుకుంది. దొంగే దొంగ అన్నట్టుగా…ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, భారత్ పై గత 77 సంవత్సరాలుగా అనునిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ ప్రేరిత ఉగ్రవాదం పై ప్రపంచం దృష్టి సారించక పోవడమే ఈ నర మేథానికి కారణం.నాగరికత వెల్లివిరిసిన నేటి ప్రపంచంలో మనుషుల రక్తం త్రాగే ఉగ్రవాద మూకలు వికృతంగా,క్రూరంగా ప్రవర్తించడం మానవత్వానికే మాయని మచ్చ. ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని అసహ్యించుకుంటున్నా “నవ్విపోదురు గాని నాకేటి సిగ్గు” అనే రీతిలో ప్రజలు అసహ్యించుకుంటున్నా, బరితెగించి, అమాయక ప్రజలను కాల్చి చంపుతున్న ఉగ్రవాదులు నేటి ఆధునిక సమాజంలో జీవించడానికి అనర్హులు. ఉగ్రవాద మూకలతో అంటకాగుతూ పాము పడగ నీడలో నిద్రపోవాలనే ఆలోచన రావడమే పాక్ మూర్ఖత్వం. ఉగ్రవాదులకు అండగా నిలబడుతూ పాక్ సాధించేదేమీ ఉండదు. ప్రస్తుతం పాక్ అస్థిత్వానికే ముప్పు ఏర్పడింది. పాక్ పతనమౌతూ, భారత్ ను నాశనం చేయడానికి ప్రయత్నించడం” తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టిన…” చందంగా ఉంది. అపారమైన ఖనిజ వనరులతో అలరాడుతున్న బలూచిస్తాన్ ను చైనా కు అప్పగించే విధంగా ఆర్ధిక కారిడార్ నిర్మాణానికి చైనాకు పాక్ అనుమతినిచ్చి, భారత్ సమగ్రతను ప్రశ్నార్ధకం చేయబూనడం క్షమార్హం కాదు.
ఆర్ధిక పతనంతో పాక్ ప్రజలకు భిక్షాటనను ఒక వృత్తిగా ప్రవేశ పెట్టిన పాకిస్తాన్ స్వయంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. పాక్ లో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభమే దీనికి ఒక కారణం కావచ్చు.వ్యక్తులను,వ్యవస్థలను నిర్వీర్యం చేసి,ఆర్ధిక మూలాలను ధ్వంసం చేయడమే కాకుండా అమాయక ప్రజల ప్రాణాలను అలవోకగా బలితీసుకుంటూ,నిరంతరం అశాంతిని ప్రజ్వలింపచేస్తున్న పాక్ పాలకుల దుర్నీతిని ప్రపంచమంతా ఏవగించుకుంటున్నది. మానవత్వం నశించిన కరడు గట్టిన పైశాచిక వాదులను సమూహాలుగా ఏర్పాటు చేసి, ఇతర దేశాల్లోమారణహోమం సృష్టించడమే ధ్యేయంగా ఏర్పాటయిన విధ్యంసకారక సంస్థలే ఉగ్రవాద సంస్థలు.ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో అశాంతిని సృష్టించే సామ్రాజ్యవాద శక్తులు ఒకవైపు,అకారణ కలహాలతో నిరంతరం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూ ఏదో సాధించాలన్న తపనతో మానవత్వాన్ని మంటగలిపి,ఆ మంటల్లో చలికాసుకునే పైశాచికత్వం మరోవైపు ప్రపంచంలో ప్రబలిపోతుండడం విచారకరం.మానవత్వపు ఛాయలు విచ్ఛిన్నకారుల మనస్సుల్లో మచ్చుకైనా కానరావు. కరడు గట్టిన రాక్షసత్వమే నైజంగా బ్రతికే ఉగ్రవాదులను విప్లవకారులుగా,సంస్కర్తలుగా కీర్తించే దేశాలకు,ఉగ్రమూకలకు వత్తాసు పలుకుతూ,వారు సాగించే ఘోరహింసాకాండకు ఆర్ధికంగా, నైతికంగా సహకరించే దేశాల అనైతిక పోకడలను వర్ణింపతరం కాదు.
సామ్రాజ్యవాదంతోనో, స్వేచ్ఛ పేరుతోనో అమాయకుల కుత్తుకలను ఖండించే దుశ్చర్యలకు పాల్పడే తీవ్రమైన కర్కశవాదాన్నే ఉగ్రవాదమని నిర్వచించవచ్చు.చాలామంది ఉగ్రవాదులకు తమ కార్యకాలాపాలకు సంబంధించి సహేతుకమైన కారణం కనిపించదు.కొంతమంది ప్రోద్భలంతోనో,వారిచేత ప్రేరేపించబడిన తీవ్రమైన మానసిక భావజాలంతోనో ఉగ్రవాదులుగా మారిన వారు కొందరైతే…ఉగ్రవాద శిబిరాలను నడుపుతూ ఇతర దేశాల నుండి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ధన,కనక,వస్తువాహనాలపై మోజుపడి స్వార్ధ పూరితమైన లక్ష్యాలతో ఉగ్రవాదులను పెంచి పోషించే వారు మరికొందరు ప్రపంచాన్ని అశాంతికి గురిచేస్తున్నారు. ఉగ్రవాదం కూడా కొంతమందికి ఉపాధినిచ్చే ముడిసరుకుగా మారడం అత్యంతహేయం. ఆంగ్లేయుల విభజన వాదంతో ముస్లిం ప్రజల్లో నెలకొన్న అపోహల వలన, నాటి పాలకుల ఉదాసీన వైఖరి వలన భారతదేశ విభజన జరిగిన మాట వాస్తవం.చైనా,ఇండియా, ఆప్ఘనిస్తాన్,ఇరాన్,అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్న పాకిస్తాన్ 1947లో భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మహమ్మదాలీ జిన్నా నాయకత్వం లోనే భారత దేశం మత ప్రాతిపదికన విడిపోయింది. పాక్ ఒక స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా ఏర్పడింది.
విభజించు… పాలించు అనే ఆంగ్ల విధానానికి అనుగుణంగా ఆంగ్లేయుల చిచ్చు కారణంగా భారత్ లోని హిందూ ముస్లింలలో చీలిక ఏర్పడింది. పాక్ స్వతంత్ర దేశంగా అవతరించినా భారత్ పై నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. పాక్ పాలకుల దుశ్చర్యలతో విసిగి పోయిన ఆ దేశ ప్రజల్లో అసహనం పెరిగిపోయింది.పాక్ ప్రజల్లో గూడుకట్టుకున్న స్వతంత్ర కాంక్ష ఉవ్వెత్తున లెగిసింది. బలూచిస్తాన్, సింధ్ ప్రాంతాలు పాక్ నుండి స్వేచ్ఛను కోరుకుంటూ స్వతంత్ర దేశాలుగా విడిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఖబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ లో విలీనమయ్యే అవకాశముంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో విలీనమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ పరిస్థితి నుండి గట్టెక్కడం చేతగాక ప్రజల దృష్టిని,ప్రపంచం దృష్టిని మరల్చడానికి కాశ్మీర్ లో రక్తపాతం సృష్టించడానికి నిరంతరం విధ్వంస ప్రణాళికలు రచిస్తూ, అమాయప్రజల రుధిరాన్ని ఆస్వాదిస్తూ, కర్కశమూకల వికృత ఆగడాలకు అడ్డాగా మారి,లష్కరే తోయిబా వంటి అనుబంధ ఉగ్రవాద సంస్థలకు ఊతమిస్తున్న దాయాది దేశం తమ పాపకృత్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.రాయబారాలతో,ఒప్పందాలతో రాజీ పడని మనస్తత్వాలకు దండోపాయమే శరణ్యమన్న సూత్రం ఉరిమురిమి చూసే ఉగ్రదేశమైనపాకిస్థాన్ కు అన్వయించక తప్పదు.
భారత్ ను ఇబ్బందుల పాలు చేస్తున్న పాక్ కు కాలమే తగిన సమాధానం చెప్పాలి. రక్తపాతం ఏనాటికీ సమస్యలకు పరిష్కారం కాదన్న సత్యం త్వరలోనే పాక్ కు అవగతమవుతుంది. పహల్గాం లో జరిగిన నరమేథంతో పాక్ ఏరికోరి కష్టాలను కోరితెచ్చుకున్నట్టే, ఈ సంఘటను మోడీ సర్కార్ చూస్తూ ఊరుకుంటుందనుకోవడం భ్రమ మాత్రమే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమ భూభాగాలను భారత్ లో విలీనం చేయాలని కోరుకుంటున్న తరుణంలో పాక్ పై భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండా జమ్మూ కాశ్మీర్ పరిపూర్ణత్వం కాలేదని, త్వరలో పి. ఓ.కె భారత్ లో విలీనమౌతుందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కొద్దినెలల క్రిందట పేర్కొనడం ఈ సందర్భంగా గమనించాలి.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పిఓకె ప్రజలను పాకిస్తాన్ విదేశీయులుగా భావించి చిన్న చూపు చూస్తున్నదని, తమ దేశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనమైతే స్వంత ప్రజల్లా చూస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తే త్వరలోనే భారత్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనం కావడం ఖాయమని అవగతమవుతున్నది. అయితే భారత్ యుద్ధం చేసి పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకుంటుందా? పాక్ పాలకులే స్వయంగా తాము ఆక్రమించిన భూభాగాలను భారత్ కు అప్పగిస్తారా? ప్లెబిసైట్ ద్వారా ప్రజలే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారా అనే విషయం స్పష్టం కావలసి ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ యుద్ధానికి దిగవచ్చనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత భారత్ చేయబోయే అతి పెద్ద సాహసం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వశపరచుకోవడమే.అయితే ఇది ఎంత వరకు సాధ్యమో ఊహించలేం. పహల్గాం మారణకాండ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
-సుంకవల్లి సత్తిరాజు. (సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్) మొ:9704903463. తూ.గో.జిల్లా.