సుభాష్ శర్మకు ఉరిశిక్ష
మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు
మిర్యాలగూడ, ప్రజాతంత్ర, మార్చి 10 : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏ-2 ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించడం తోపాటు మిగిలిన వారికి జీవిత ఖైదు శిక్షను నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రోజారమణి ప్రకటించారు. అదేవిధంగా ఈ కేసులో ఏ -3 గా ఉన్న అస్గర్ అలీ, ఏ-4 గా ఉన్న అబ్దుల్ బారి, ఏ-5 గా ఉన్న కరీం, ఏ-6 గా ఉన్న శ్రావణ్, ఏ -7గా న్నా శివ, ఏ-8 గా ఉన్న నదీమ్ లకు జీవిత ఖైదు విధించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14 లో జరిగిన ప్రణయ్ పరువు హత్య అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. 2018 జనవరిలో మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ లు ఇద్దరూ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి అంగీకరించని అమృత తండ్రి మారుతీరావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు.
2018 సెప్టెంబర్ 14న నిండు గర్భిణీతో ఉన్న అమృతను తీసుకొని ప్రణయ్ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చెకప్ చేయించుకొని తీసుకువస్తుండగా హాస్పిటల్ వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయ్ ని అతి కిరాతకంగా కత్తితో నరికి చంపారు. ఇదే విషయమై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో మిర్యాలగూడ డిఎస్పి శ్రీనివాస్తో కలిసి విచారణ ప్రారంభించారు. 2018 సెప్టెంబర్ 18న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. 2019 జూన్ 12న 1600 పేజీల చార్జి సీటును దాఖలు చేశారు.
సుభాష్ శర్మకు మినహాయించి మిగిలిన ఏడుగురు వ్యక్తులకు 2019 ఏప్రిల్ 28న కోర్టు బెయిల్ మంజూరు చేయగా, కేసు విచారణలో ఉండగా అమృత తండ్రి ఏ- 1 నిందితుడు మారుతీరావు 2020లో హైదరాబాద్లోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. 110 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఐదు సంవత్సరాల 5 నెలల 28 రోజుల పాటు కొనసాగిన వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష వేయగా, మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదీలు విధిస్తూ నల్గొండ రెండో అదనపు సెషన్ కోర్టు తీర్పును వెలువరించింది. నిందితులకు 302, 129, 1989 ఐపీసీ సెక్షన్ ప్రకారం 1959 ఇండియన్ ఆర్మీ యాక్ట్ ప్రకారం న్యాయస్థానం శిక్షలను ఖరారు చేశారు. అదేవిధంగా శిక్ష పడిన వారందరికీ హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కాగా తమకు శిక్షను తగ్గించాలని నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నట్లు సమాచారం.