పాక్‌ పౌరుల జాబితా పంపండి

రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశం
అటారీ-వాఘా సరిహద్దుకు పాక్‌ పర్యాటకులు

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 25 : ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్‌ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ఆయన శుక్రవారం మాట్లాడారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో భారత్‌ సార్క్‌ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్‌ జాతీయులకు భారత్‌లో పర్యటించే అవకాశాలను కల్పించారు.

ఈ ప్రోగ్రామ్‌ కింద భారత్‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటా పోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాంటి వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థాన్‌ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. శుక్రవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన స్వయంగా ఫోన్‌ చేసి.. వారికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.   రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తించి.. వారిని వెంటనే పాకిస్థాన్‌ పంపాలని సూచించారు.

ఉగ్రదాడిపై ఆధారాలు సేకరించిన భారత్‌!
మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ ప్రమేయం ఉందని భారత్‌ తగిన ఆధారాలను సేకరించింది. అందుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన విదేశీ కార్యదర్శులకు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ అందజేశారు. మరోవైపు భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీయులు 48 గంటల లోపు దేశం విడిచివెళ్లాలంటూ ఆదేశించింది. దీంతో ఇప్పటికే భారత్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పాకిస్థానీయులు.. స్వదేశం వెళ్లేందుకు అటారీ సరిహద్దు వద్ద క్యూ కట్టారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాకిస్థానీయులను సైతం భారత్‌ను పంపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫొన్‌ చేసి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు.

జమ్మూ కాశ్మీర్‌లో అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌ అయింది. అందులోభాగంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలో భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీయులకు జారీ చేసిన వీసా గడువు ఏప్రిల్‌ 27వ తేదీతో ముగిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ లోపు వారంతా దేశం వీడి వెళ్లవలసి ఉంటుందని పేర్కొంది. దీంతో భారత్‌లో పర్యటిస్తున్న అనేక మంది పాకిస్థాన్‌ జాతీయులు పంజాబ్‌లోని అటారీ వాఘా సరిహద్దు ద్వారా తమ దేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. తమ బంధువులను కలుసుకునేందుకు తాము 45 రోజుల వీసా గడువుపై భారత్‌కు వచ్చామని వారు పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో అటారీ-వాఘా సరిహద్దును అధికారులు మూసివేసిన విషయం విదితమే. అలాగే న్యూదిల్లీలోని పాకిస్థాన్‌ రాయబారీ కార్యాలయంలోని దౌత్యవేత్తతోపాటు- మిగిలిన అధికారులు దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. అందుకోసం వారికి వారం రోజుల గడువు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page