కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం…
గతంలో ధరణిలో అనేక మోసాలు
భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పరిగి, ప్రజాతంత్ర ఏప్రిల్ 17 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి నియోజకవర్గం పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన సదస్స జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ… రైతులకు తమ భూముల వివాదాలను పరిష్కరిస్తూ జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూ భారతి తీసుకొచ్చామని చెప్పారు.
గతంలో ఉన్న ధరణి సమస్యల పరిష్కారంలో విఫలమైందని గ్రహించిన ప్రజా ప్రభుత్వం భూ భారతి-2025 చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరమవుతాయని మంత్రి తెలిపారు. రైతులు తమ సొంత అవసరాలు ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల నిమిత్తం వారసత్వంగా వొచ్చిన భూములను అమ్ముకోవడానికి గత ధరణి-2020 తో ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని ఇలాంటి లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం ప్రజలకు సరళంగా ఉండే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు.
ధరణి చట్టం కారణంగా నెలల తరబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేదని ఆయన అన్నారు. గతంలో 18 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ స్థలాలతో పాటు వారికి నచ్చే విధంగా మార్చేసి పార్ట్-బి పేరుతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, ధరణి ఇబ్బందులను గుర్తించి తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాటకు కట్టుబడి రైతులకు, అధికారులకు సులభంగా అర్థమయ్యేలా సామాన్య, గ్రామీణ ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా భూ భారతి రూపొందించామని మంత్రి తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకుండా గ్రామాల్లోకి ప్రజల దగ్గరకు అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. కాగా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు శిథిలావస్థలో ఉన్న పరిగి తహసీల్దార్ కార్యాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… భారతరత్న, డాక్టర్ అంబేడ్కర్ పుట్టిన రోజు నాడే భూ భారతి అమలులోకి రావడం గొప్ప విషయమని అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు భూమితో రైతు అనుబంధాన్ని దూరం చేయడానికి ధరణి అనే మాయను తీసుకువచ్చారని, వేలాది ఎకరాల దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల భూములను లాక్కున్నారని అన్నారు. గ్రామాలలో కుటుంబాల మధ్య , అన్నాదమ్ముళ్ల మద్య చిచ్చు పెట్టించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇప్పుడు రైతుల మేలు కోసం భూ భారతిని తెచ్చారని తెలిపారు.
భూ భారతి అమలుతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. భూముల అమ్మకాలు, కొనుగోలు సులభంగా జరుగుతాయన్నారు. ధరణితో రైతుల గుండెల్లో రైళ్ళు పరిగెడితే భూ భారతితో రైతులు గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోవచ్చని అన్నారు. హైదరాబాద్ దగ్గర ఉండడంతో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా భూముల ధరలు కోట్లలో ఉన్నాయి. అమాయకులైన రైతులు మోసపోకుండా భూ భారతి అండగా ఉంటుందని అన్నారు. భూ భారతితో మీ భూములకు 100 శాతం భద్రత ఉంటుందని అన్నారు. సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు భూ భారతితో పరిష్కారమవుతాయని, మీ భూముల సమస్యల పరిష్కారానికి ఎవ్వరి దగ్గర పైరవీలకు పోవాల్సిన అవసరం లేదన్నారు. భూ భారతి పోర్టల్ లో అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయని ,సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా సరళంగా డిజైన్ చేశారని తెలిపారు.
రైతుల సంక్షేమంతో పాటుగా దేశ రక్షణ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపారని ఇదే పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో లో నావీ రాడర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వ పాలకులు కేంద్రం నుంచి నష్టపరిహారం డబ్బులు తీసుకుని తర్వాత మాట మార్చితే ముఖ్యమంత్రి ముందుకొచ్చి దేశ రక్షణ మన ప్రాధాన్యత అని భూమిని ఇచ్చి రాడర్ స్టేషన్ కు శంకుస్థాపన చేయించారని అన్నారు. శాసనమండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు టి రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ , అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీఓ వాసు చంద్ర, తహసిల్దార్లు భరత్ గౌడ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.