రాజకీయాలకతీతంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు
అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకతీతంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలపై ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను సవిూక్షించుకుని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూలై 13న మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సవిూక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో, ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వపరంగా అన్ని శాఖల అధికారులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం లోపల కేబుల్ వైర్లు కొత్తవి వేసి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. బ్యారికేడిరగ్ జాలి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికీ తీసిపోరన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వాలన్నారు. ఒక్కో వారం ఒక్కో ఏరియాలో పండుగ జరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, అవసరమైతే రెండుసార్లు నీటిని ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ మొత్తంగా ఒకేసారి కాకుండా ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవం ఉంటుందని, భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. 3600 దేవాలయాలకు సంబంధించి సవిూక్ష రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగిందని తెలిపారు. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట, లాల్ దర్వాజా ఇలా ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయని, జోగిని వాళ్ళకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీ వస్తే ఇబ్బందులు ఉండవన్నారు. డెక్కన్ మానవ సేవ సమితి, ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. అందరూ తమ సహకారం అందించేందుకు ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి ప్రభాకర్ పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే తలసాని, జిల్లా కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పాల్గొన్నారు.