యువతకు కలలు చూపి… ఇప్పుడు వంటవాళ్లు, ప్లంబర్లుగా మారమంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద సుమారు రూ. 2,400 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఇప్పటికే 15 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించబడినట్లు తెలిపారు. యువ ఉద్యోగార్థులు మరియు పరిశ్రమల మధ్య వారధిగా ఈ పథకం పనిచేస్తోందని, ఉద్యోగులు మరియు యజమానులు ఇద్దరికీ ఒకేసారి మద్దతు అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు మరియు యువత కలిసి పనిచేసినప్పుడు ఉపాధి కల్పన వేగవంతమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. యువతకు అవకాశాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉపాధి సృష్టిని జాతీయ లక్ష్యంగా మార్చే “నూతన భారతదేశం” ఆవిష్కరణకు ఈ పథకం ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

భారత్‌కు ఉన్న జనాభా ప్రయోజనాన్ని ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన దేశంగా మారే భారతదేశ ప్రయాణం యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలతో ముడిపడి ఉందని ప్రధాని అన్నారు. “మేక్ ఇన్ ఇండియా”, “వోకల్ ఫర్ లోకల్”, “మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్” వంటి కార్యక్రమాలు, అలాగే స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించాయని తెలిపారు. డ్రోన్లు, డిజిటల్ సేవలు, గిగ్ ఎకానమీ, ప్లాట్‌ఫామ్ ఆధారిత వ్యాపారాలు, కంటెంట్ సృష్టి, సాంకేతికత ఆధారిత సంస్థలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు లక్షలకు పైగా నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయని, దశాబ్దం క్రితం ఈ సంఖ్య కేవలం 500 వరకు మాత్రమే ఉండేదని ఆయన గుర్తు చేశారు.

మరో వైపు  భారతదేశ యువత భవిష్యత్తుపై ఇటీవల కొందరు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ ) రంగంలో భారత్ ప్రపంచ పోటీలో వెనుకబడిందని, తయారీ రంగంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నామని అంగీకరిస్తూనే, యువత వంట, ప్లంబింగ్, కేర్‌గివింగ్ వంటి సేవారంగ ఉద్యోగాల వైపు దృష్టి మళ్లించాలని సూచించడం ఆందోళన కలిగించే విషయం.

నిజానికి వంట చేయడం, ప్లంబింగ్, కేర్‌గివింగ్ వంటి వృత్తులు గౌరవప్రదమైనవే. ఏ సమాజం అభివృద్ధి చెందాలన్నా ఈ సేవలు అత్యంత అవసరం. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఆ వృత్తుల గౌరవం గురించి కాదు. దేశ యువతకు దశాబ్దాలుగా చూపించిన అభివృద్ధి కలలు, నైపుణ్య విప్లవం, డిజిటల్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి భారీ కార్యక్రమాల ఫలితంగా ఏర్పడాల్సిన అవకాశాలు ఎక్కడ అన్నదే ప్రధాన ప్రశ్న.

ఒకప్పుడు భారత యువతకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత, అధునాతన తయారీ రంగాలు భవిష్యత్తు అని ఆశలు కల్పించారు . లక్షలాది కుటుంబాలు తమ పిల్లలను ఉన్నత విద్య వైపు నడిపించాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఈ ఆశల చుట్టూనే విస్తరించాయి. కానీ నేడు అదే యువతలో నిరుద్యోగం పెరుగుతోంది. డిగ్రీలు చేతిలో ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదు. అనేక రంగాల్లో ఉద్యోగ భద్రత క్షీణిస్తోంది.

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన జనాభా కలిగిన దేశంగా చెప్పుకుంటుంది. ఈ “డెమోగ్రాఫిక్ డివిడెండ్”ను అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే జనాభా ప్రయోజనం ఉద్యోగాలుగా మారకపోతే అది “డెమోగ్రాఫిక్ డిజాస్టర్”గా మారే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు ఆ హెచ్చరికలను గుర్తు చేస్తున్నాయి.

ప్రత్యేకించి తయారీ రంగంలో భారత్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం ప్రారంభమై దాదాపు పదేళ్లు దాటుతున్నప్పటికీ, తయారీ రంగం జీడీపీలో వాటా పెద్దగా పెరగలేదు. చైనా మాదిరిగా భారీ స్థాయిలో పారిశ్రామిక ఉద్యోగాలు సృష్టించడంలో విఫలమైంది. మరోవైపు ఏఐ , ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి రంగాల్లో ప్రపంచ పోటీ వేగంగా మారుతోంది. అమెరికా, చైనా, యూరప్ దేశాలు భారీ పెట్టుబడులతో ముందుకు వెళ్తుంటే భారత్ ఇంకా విధానాల స్థాయిలోనే చర్చలు జరుపుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో యువతకు “మీరు ఉన్నత సాంకేతిక రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూడకుండా సేవారంగ ఉద్యోగాల వైపు వెళ్లండి” అని చెప్పడం సమస్యకు పరిష్కారం కాదు. అది వైఫల్యాన్ని అంగీకరించినట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వాల బాధ్యత యువత ఆశయాలను తగ్గించడం కాదు; వారి సామర్థ్యాలకు తగిన అవకాశాలను సృష్టించడం. ప్రపంచ స్థాయి పరిశోధన, పారిశ్రామిక పెట్టుబడులు, నాణ్యమైన విద్య, సాంకేతిక మౌలిక వసతులు అందించడం ద్వారానే అది సాధ్యమవుతుంది.

అయితే మరో కోణం కూడా ఉంది. సేవారంగంలో నైపుణ్యాల ఆధారంగా ఉన్న ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. వృద్ధ జనాభా పెరుగుతున్న దేశాల్లో కేర్‌గివర్ల అవసరం అధికమవుతోంది. నాణ్యమైన వంటవాళ్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, టెక్నీషియన్లు మంచి ఆదాయం పొందుతున్నారు. సమస్య ఆ ఉద్యోగాల్లో లేదు; వాటిని యువతకు “ప్రత్యామ్నాయంగా” చూపిస్తున్న విధానంలో ఉంది. ప్రభుత్వం నిజంగా ఈ రంగాలను ప్రోత్సహించాలనుకుంటే వాటికి అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ, సామాజిక గౌరవం, సరైన వేతన వ్యవస్థ, ఉపాధి భద్రత కల్పించాలి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం యువతకు నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏఐ  రంగంలో భారత్ ఎందుకు వెనుకబడింది? తయారీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఎందుకు సృష్టించలేకపోయింది? విద్యా వ్యవస్థ మరియు పరిశ్రమల మధ్య అంతరం ఎందుకు పెరిగింది? నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ఏమయ్యాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా కేవలం యువత తమ ఆశయాలను తగ్గించుకోవాలని చెప్పడం సరైన మార్గం కాదు.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని ప్రతి వేదికపై చెప్పే నాయకులు, విధాన నిర్ణేతలు ఇప్పుడు అదే యువతకు అవకాశాల కొరతను విధిగా అంగీకరించమని చెప్పకూడదు. భారత యువతకు అవసరమైంది కలల పరిమాణాన్ని తగ్గించడం కాదు; ఆ కలలను నిజం చేసే విధానాలు, పెట్టుబడులు, అవకాశాలు. యువతను ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా, పరిశోధకులుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే దిశగా దేశం ప్రయాణించాలి. లేకపోతే ప్రపంచంలో అతిపెద్ద యువజన శక్తి కలిగిన దేశం అనే గర్వకారణం, భవిష్యత్తులోనే అతిపెద్ద ఆర్థిక మరియు సామాజిక సవాలుగా మారే ప్రమాదం ఉంది.

-ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *