– ఎంపి మల్లు రవి
న్యూదిల్లీ,అక్టోబర్ 9: ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని స్టే ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పిందని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో చాలామంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. ఎన్నికలు పెట్టకపోవడంతో పంచాయతీకి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు చేశామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో బిల్లు పెట్టామని, అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం 10శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. 50 శాతం సీలింగ్ అప్పుడే దాటిందని అన్నారు. హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే అని వెల్లడించారు. రిజర్వేషన్లపై జడ్జిమెంట్ రావడం అంటే ప్రజాస్వామ్యం గురించి చాలా లోతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలని సూచించారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నామని మల్లు రవి స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించే వ్యవస్థ న్యాయవ్యవస్థ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాస్త్రీయంగా తెలంగాణలో కులగణన చేశారని తెలిపారు. బీసీ కులగణనలో ప్రతి కుటుంబ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితులు తెలుసుకున్నారని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు దానికి అడ్డుకట్ట వేసినట్లయిందని అసహనం వ్యక్తం చేశారు. న్యాయ నిపుణులతో చర్చించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ఆలోచన చేస్తామని రవి వివరించారు. రాష్ట్రంలో 42? రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





