– ఆగస్ట్ 3న నిర్వహించనున్న ఎన్బీఈ
– వాయిదాకు సుప్రీం కోర్టు అనుమతి
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్- 2025 పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి పీకే మిశ్రా నేతృత్వంలోని బెంచ్.. పరీక్ష వాయిదాపై కేంద్రాన్ని, ఎన్బీఈని ప్రశ్నించింది. ’ఇంకా రెండు నెలలు పరీక్షను వాయిదా వేయటం ఎందుకు? జులై రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించవచ్చుగా’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ స్పందిస్తూ..’ లాజిస్టికల్ సవాళ్ల కారణంగా పరీక్ష వాయిదా పడింది. పరీక్ష కేంద్రాల సంకున్నామని కోర్టుకు విన్నవించారు. చిన్న పొరపాట్లు- పరీక్ష పక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పరీక్షను వాయిదా వేయడానికి ఎన్బీఈ నిర్ణయించిందని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి మిశ్రా మాట్లాడుతూ.. ’ పరీక్ష ఎప్పుడు జరిగినా నిష్పక్షపాతంగా, సమగ్ర భద్రతతో జరగాలని స్పష్టం చేశారు. గత వారం ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
అప్పటి నుంచి మీరు ఏం చేశారంటూ ఎన్బీఈని ప్రశ్నించింది. దీనిపై ఎన్బీఈ మాట్లాడుతూ, పరీక్ష విషయంలో తాము ఏమాత్రం రాజీ పడదలచుకోవడం లేదని స్పష్టం చేసింది. కాగా, నీట్ పీజీ పరీక్షను రెండు షిప్టుల్లో జరపడానికి అనుమతి కోరుతూ ఎన్బీఈ గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దానిపై విచారణ జరిపిన కోర్టు ఎన్బీఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. రెండు షిప్టుల్లో పరీక్షలు జరిగితే విద్యార్థులపై చెడుగా ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దేశ వ్యాప్తంగా ఒకే షిప్టులో పరీక్ష పెట్టాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే పరీక్ష ఒకే షిప్టులో జరపడానికి మరింత సమయం కావాలని బోర్డు కోరింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 3వ తేదీన పరీక్ష జరపడానికి అవకాశం కల్పించింది. ఒకే షిప్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది.
వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్)కు సంబంధించి ఇటీవల సుప్రీంలో విచారణ జరిగింది. పరీక్షను రెండు షిప్ట్లలో నిర్వహించడానికి నిరాకరించింది. దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలనే ఎంచుకోవాలని సూచించింది. రెండు ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకేవిధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగిఉండవని అభిప్రాయపడింది. పోటీ- తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కూ ర్యాంకు నిర్దరణలో అత్యంత కీలకమేనని తెలిపింది. నార్మలైజేషన్ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే అనుసరించాలని, ప్రతి ఏడాదీ నిర్వహించుకొనే పరీక్షకు అది సరికాదని ధర్మాసనం పేర్కొంది.