మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని నిధులు కావాలి

కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 30: ఆరోగ్యలక్ష్మి, పోషణ్‌ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో తమ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అధిక నిధులు వెచ్చిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు కల్పిస్తున్నామన్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి ఢల్లీికి తిరుగు ప్రయాణమైన కేంద్రమంత్రి కొద్దిసేపు శంషాబాద్‌లో ఉన్న క్రమంలో మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌తో కలిసి సీతక్క ఆమెను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రాష్ట్రం నెలకు రూ.10,950, రూ.6450 చెల్లిస్తుండగా కేంద్రం తన వాటాగా నామమాత్రంగా రూ.2700, రూ.1,350 మాత్రమే చెల్లిస్తోందంటూ ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి సీతక్క వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలో 11 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, సొంత భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రతిరోజు 200 ఎంఎల్‌ విజయ మిల్క్‌ అందిస్తున్నామని, త్వరలో చిన్నారులకు సైతం ఈ పథకాన్ని వర్తింప చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, కేంద్రం తన వంతు సహకారం అందించాలని సీతక్క కోరారు. ఈ వినతులకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ చేపడుతున్న పథకాలు అభినందనీయమని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ మంత్రులు, అధికారులతో కలిసి తెలంగాణలో జాతీయ సదస్సు నిర్వహించి ఇక్కడి బెస్ట్‌ ప్రాక్టీస్‌ను వారికి పరిచయం చేస్తామని తెలిపారు. కేంద్ర కేబినెట్‌తో చర్చించి అధిక నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page