ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న చిన్న పత్రికలు ప్రధానంగా ప్రభుత్వ పోస్టల్ సర్వీసు మీదనే ఆధార పడతాయి గనుక అక్కడి నిబంధనలను బిగించడం మొదలు పెట్టారు. పత్రిక ప్యాక్ చేయకుండా పోస్ట్ చేయాలన్నారు. కనీసం పేజీలు విడిపోకుండా పిన్ కూడా కొట్టవద్దన్నారు. పత్రికను మలిచి ప్యాక్ చేసి, ప్యాకింగ్ పేపర్ మీద చిరునామా రాసే, పోస్టల్ స్టాంపులు అతికించే పద్ధతి నిషేధించి, పత్రిక మీదనే అడ్రస్ రాయాలని, స్టాంపు అతికించాలని అన్నారు. మిగిలిన పేజీలకన్నా అట్ట దళసరిగా ఉంటుంది గనుక అది రవాణాలో చిరిగిపోతే పత్రిక ఎవరికి ఉద్దేశించినదో తెలియకుండా పోస్టాఫీసు చెట్టాబుట్టలోకి వెళుతుందన్నమాట. ఇక పోస్టల్ సిబ్బంది తగ్గిపోవడం వల్ల వారి మీద పని భారం పెరిగిపోయి, పత్రికల రవాణా మరింత కష్టమైపోయింది.
ఈ వారం తెలంగాణార్థం తెలంగాణకు మాత్రమే కాక దేశానికంతా వర్తించే ఒక కీలకమైన పరిణామం మీద రాయదలిచాను. నిజానికి దేశంలో భాగంగా ఇది తెలంగాణకు కూడా వర్తిస్తుంది. మొత్తంగా ఈ దేశ ప్రజల సమాచార హక్కు మీద, ప్రజా చైతన్యం మీద, భిన్నాభిప్రాయాల వ్యాప్తి మీద దారుణమైన దాడి ఇది. అందువల్ల కచ్చితంగా రాష్ట్ర పరిణామాల పరిధిలోకి రాకపోయినప్పటికీ ఈసారి దీని మీద రాయక తప్పడం లేదు. దేశంలో నమోదై ఉన్న లక్ష పత్రికలలో తెలంగాణలో రెండున్నర వేల పత్రికలున్నాయి. వీటిలో క్రమబద్ధంగా నడుస్తున్నవి దేశవ్యాప్తంగా డెబ్బై ఎనబై వేలు కావచ్చు. తెలంగాణలో రెండు వేలు కావచ్చు. వాటిలో తొంబై శాతం పత్రికలకు వర్తించే దుర్మార్గమైన చర్య ఇది. అంటే తెలంగాణ పత్రికా పాఠకులమీద చావు దెబ్బ ఇది
అది ఇండియా పోస్ట్ అనబడే కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ తీసుకున్న ఒక దీర్ఘకాలిక ప్రభావాలు వేసే నిర్ణయం. దేశంలో చిన్న పత్రికలనూ, చిన్న పత్రికల ద్వారా నిజంగా వ్యక్తమయ్యే ప్రజాభిప్రాయాన్నీ గొంతు నులిమే నిర్ణయం. బ్రిటిష్ వలస పాలన కాలం నుంచీ దేశంలో కొనసాగుతున్న ఒక ప్రజానుకూల ప్రభుత్వ విధానాన్ని కూకటివేళ్ళతో పెకలించి, దాని స్థానంలో కార్పొరేట్ అనుకూల, ప్రజా చైతన్య వ్యతిరేక విధానాన్ని స్థాపించడం ఈ చర్య ఉద్దేశం. ఆ చర్య పేరు పైకి చూడడానికి పోస్టల్ రేట్ల మార్పిడి నిర్ణయం. అది భారత పోస్టల్ వ్యవస్థ పని తీరును మెరుగు పరిచే ఉద్దేశంతో, నష్టాల బారి నుంచి కాపాడే లక్ష్యంతో ఇస్తున్నదనే పంచదార పూతలతో వస్తున్న మహా భయంకర విషగుళిక.
వలస పాలన కాలం నుంచీ దేశంలో ఒక నిర్ణీత వ్యవధిలో ప్రచురించే పత్రికలన్నిటినీ ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకుని మాత్రమే ప్రచురించాలనే నియమం ఏర్పరచి, అలా నమోదు చేయడానికి రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా అనే వ్యవస్థను నెలకొల్పారు. అలా రిజిస్టర్ అయిన పత్రికలను రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అంటారు. ఒకప్పుడు దేశంలో తగినంత న్యూస్ ప్రింట్ ఉత్పత్తి ఉండేది కాదు గనుక విదేశాల నుంచి న్యూస్ ప్రింట్ దిగుమతి చేసుకోవలసి వచ్చేది. ప్రభుత్వం తన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా దిగుమతి చేసుకుని, రాయితీలతో రిజిస్టర్డ్ న్యూస్ పేపర్లకు అమ్మేది. అలాగే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్లు ప్రజలకు సులభంగా చేరడానికి ప్రభుత్వ తపాలా శాఖ ద్వారా తక్కువ ధరలకు రవాణా చేసే ఏర్పాటు ఉండేది.
ఈ రెండు పనులూ ప్రజల సమాచార హక్కు (అప్పటికింకా సమాచార హక్కు చట్టం రాలేదు గాని ప్రభుత్వాలకు ప్రజల సమాచార హక్కు మీద గౌరవం ఉండేదనుకుంటాను, ఆ చట్టం వచ్చాక ఆ గౌరవం పోయింది!) ను గౌరవిస్తూ ప్రజలకు సమాచారం, విశ్లేషణ సులభంగా అందాలని, అంటే పత్రికలకు ప్రభుత్వం సహాయం చేయాలని విలువలు ఉండేవి. అప్పటికి పత్రిక కాకుండా ఇతర మాధ్యమాలేవీ లేవు.
న్యూస్ ప్రింట్ రాయితీల వల్ల పత్రికల ఉత్పత్తి వ్యయం తగ్గేది, అందువల్ల ప్రజలకు అవి చౌకగా ఇవ్వడానికి వీలయ్యేది. కానీ 1980ల చివరినాటికల్లా దేశంలో న్యూస్ ప్రింట్ ఉత్పత్తి పెరిగి, దిగుమతుల సరళీకరణ జరిగి ప్రభుత్వ న్యూస్ ప్రింట్ కేటాయింపు విధానం రద్దయిపోయింది. పోస్టల్ చార్జీల రాయితీ మాత్రం యథావిధిగా ఈ నెల వరకూ కొనసాగింది. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ల పోస్టింగ్ తో 1970ల మొదటి నుంచీ పరిచయం ఉన్నవాడిగా నాకు పత్రిక ఒక కాపీ దేశంలో ఎక్కడికి పంపించడానికైనా రెండు పైసల పోస్టేజి స్టాంపు అతికించిన గుర్తు ఉంది. అది క్రమంగా 1980ల నాటికి ఐదు పైశాలకు, 1990ల నాటికి పది పైశాలకు చేరింది. అప్పటిక్వరకూ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అని సంయుక్తంగా ఉన్న సంస్థను 1980ల మధ్యలో రెండుగా విడదీశారు. పోస్ట్ వేరుగా, టెలిగ్రాఫ్ ను బి ఎస్ ఎన్ ఎల్ గా చీల్చి, ఒక దశాబ్దం తిరిగేసరికల్లా చంపడానికి ముందుగా పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టు బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాల బాట పట్టించి చివరికి టెలికాం రంగాన్ని మొత్తంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేశారు. ఇప్పుడు బి ఎస్ ఎన్ ఎల్ కుక్కలు చింపిన విస్తరి అయిపోయింది. టెలికాం రంగం అంబానీ రాజ్యం అయిపోయింది.
ఇక మిగీలిన ఇండియా పోస్ట్ ను చంపడం ఎట్లా అని 1990ల నుంచీ జెండాలేవైనా పాలకు లందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. 2014 తర్వాత ఆ హత్యా కార్యక్రమం మరింత పకడ్బందీగా జరుగుతున్నది. పదవీ విరమణ చేసిన సిబ్బంది స్థానంలో కొత్త నియామకాలు లేక సిబ్బంది సగానికి సగం తగ్గిపోయింది. గ్రామీణ్ డాక్ సేవక్, ఎక్ట్రా డిపార్ట్మెంటల్ స్టాఫ్ పేరుతో వెట్టి చాకిరీకి, సంఘటిత కార్మికుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం పాత వలసవాడ చట్టాన్ని తొలగించిన దాని స్థానంలో ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టం 2023 అనే కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం అనేక సేవల మీద ఇండియా పోస్ట్ గుత్తాధికారాన్ని తొలగించి, ఆ రంగంలోకి ప్రైవేట్ కొరియర్ సర్వీసులు రావడానికి దారి తీసింది. పోస్టల్ సేవలకు రేట్లు ఎట్లా విధించాలనే అంశం గతంలో కాబినెట్ నిర్ణయాధికారం కాగా, ఇప్పుడది శాఖా పరమైన నిర్ణయాధికారం అయిపోయింది.
ఈ కొత్త చట్టం సహాయంతో జరిగిన అనేక మార్పులలో ముఖ్యమైనది రిజిస్టార్డ్ న్యూస్ పేపర్ అనే తరగతి నిర్వచనాన్ని మార్చడం. (ఈ లోగా ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికాల్ చట్టామ్ 2023 అనే కొత్త చట్టం ద్వారా రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అంటే వారం కన్నా తక్కువ వ్యవధిలో అచ్చేది మాత్రమే అని నిర్వచనం మార్చారు. ఇప్పుడిక కొత్త నిర్వచనం ప్రకారం పోస్టల్ రాయితీలు రిజిస్టార్డ్ న్యూస్ పేపర్ కు మాత్రమే వర్తిస్తాయి గాని, మిగిలినవన్నీ పీరియాడికల్ పోస్ట్ అనబడే కొత్త తరగతి కిందికి వస్తాయి.
ఇప్పటివరకూ రిజిస్టార్డ్ న్యూస్ పేపర్ కింద ఒక ప్రతికి 50 గ్రాముల వరకూ 25 పైసలు, 50-100 గ్రాములు యాబై పైసలు, 100 గ్రాముల పైన ప్రతి 100 గ్రాములకూ అదనంగా 20 పైసలు అని రేట్లు ఉండేవి. ఇప్పుడు కొత్తగా 100 గ్రాముల వరకూ పత్రిక ధర రూ. 20 కన్నా తక్కువ ఉంటే ఒక రూపాయి, రూ. 20 కన్నా ఎక్కువ ఉంటే రూ. 4, 100 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే రూ. 9 అని ఒక లెక్క చెపుతున్నారు. నిజానికి ఇండియా పోస్ట్ వెబ్ సైట్ మీద డిసెంబర్ 29న అప్డేట్ చేసిన ప్రకారం ఈ రేట్లేమీ లేవు. ఎక్కడికక్కడ అధికారుల ఇష్టారాజ్యం అయిపోయింది. ఇండియా పోస్ట్ నుంచి అధికారికంగా వెబ్ సైట్ మీద గాని, పత్రికలలో గాని, వ్యక్తిగతంగా ఒక్కొక్క పత్రికకు గాని ఎటువంటి సమాచారమూ లేదు. హఠాత్తుగా డిసెంబర్ 18 నుంచి బుక్ పోస్ట్ సేవలు రద్దు చేశామన్నారు. డిసెంబర్ చివరి వారంలో పత్రికలన్నిటికీ జనవరి సంచిక పోస్ట్ చేసే సమయం ఉంటుంది. అప్పుడు, పోస్టాఫీసుకు పత్రికల ప్యాకెట్లు తీసుకు వెళ్ళినాక జరిగిన మార్పుల గురించి చెప్పి రూపాయి పోస్టల్ స్టాంపు అతికించి ఉన్న పత్రికపై అప్పటికప్పుడు మరొక ఎనిమిది రూపాయల స్టాంపులు అతికించమన్నారు. రాచరిక రాజ్యాలలో కూడా ఇంత అపసవ్యమైన, రహస్యమైన, ఆకస్మిక, నిరంకుశ నిర్ణయాలు ఉండి ఉండవు. ఇంతగా పోస్టల్ ఛార్జీలు పెంచడం చిన్న పత్రికల తలల మీద మూలిగే నక్కమీడ తాటికాయ పడ్డాట్టే. ఇప్పటికే న్యూస్ ప్రింట్, ప్రింటింగ్ ఖర్చులతో, సిబ్బంది జీతాలతో, తగ్గిపోయిన వ్యాపార ప్రకటనలతో కునారిల్లుతున్న పత్రికల జీవితం ఈ పోస్టల్ రేట్ల భారీ పెంపుదలతో అంతమై పోతుంది.
నిజానికి పత్రికలు అట్లా అంతమైపోవాలన్నదే పాలకుల కోర్కె. పోస్టల్ రేట్ల పెంపుతో కనీసం కొన్ని పత్రికలైనా మూటపడాలన్నది పాలకుల ఉద్దేశం. మోదీ, అమిత్ షా లు గత పదకొండు సంవత్సరాలలో దేశంలో ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలన్నిటినీ రవీశ్ కుమార్ అన్నట్టుగా గోదీ మీడియాగా మార్చేసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న చిన్న పత్రికలు ప్రధానంగా ప్రభుత్వ పోస్టల్ సర్వీసు మీదనే ఆధార పడతాయి గనుక అక్కడి నిబంధనలను బిగించడం మొదలు పెట్టారు. పత్రిక ప్యాక్ చేయకుండా పోస్ట్ చేయాలన్నారు. కనీసం పేజీలు విడిపోకుండా పిన్ కూడా కొట్టవద్దన్నారు. పత్రికను మలిచి ప్యాక్ చేసి, ప్యాకింగ్ పేపర్ మీద చిరునామా రాసే, పోస్టల్ స్టాంపులు అతికించే పద్ధతి నిషేధించి, పత్రిక మీదనే అడ్రస్ రాయాలని, స్టాంపు అతికిం చాలని అన్నారు. మిగిలిన పేజీలకన్నా అట్ట దళసరిగా ఉంటుంది గనుక అది రవాణాలో చిరిగిపోతే పత్రిక ఎవరికి ఉద్దేశించినదో తెలియకుండా పోస్టాఫీసు చెట్టాబుట్టలోకి వెళుతుందన్నమాట. ఇక పోస్టల్ సిబ్బంది తగ్గిపోవడం వల్ల వారి మీద పని భారం పెరిగిపోయి, పత్రికల రవాణా మరింత కష్టమైపో యింది. సంవత్సరానికో, ఇంకా ఎక్కువ కాలానికో చందాలు కట్టినా వారు తమకు పత్రిక అందడం లేదంటే పత్రికలవారు పంపడం లేదనుకునే స్థితి వచ్చింది.
ఇప్పటికే ఉన్న ఈ స్థితిని మరింత దిగజారుస్తూ పోస్టల్ రేట్లు పెంచుతూ కొత్తగా వచ్చిన ఆదేశాలు చిన్న పత్రికల మీద చావు దెబ్బ. ఈ దెబ్బకు చాలా పత్రికలు మూతపడక తప్పదు. మోదీ షా ప్రభుత్వానికి సరిగ్గా కావలసిందదే. పెద్ద పత్రికలన్నీ, చాణళ్లన్నీ తమ గుప్పెట్లోకి చేరిన తర్వాత, చిన్న పత్రికలలోనే భిన్నా భిప్రాయానికీ, ప్రజాభిప్రాయానికీ, ప్రజలకు అవసరమైన విశ్లేషణకూ అవకాశం దొరుకుతున్నది. అంటే సామాజిక చైతన్య వికాశంలో ప్రస్తుత చిన్న పత్రికల పాత్రే చెప్పుకోదగినంత ఉన్నది. కనుక వాటి గొంతు నులమాలని మోశా ల లక్ష్యం. ఆ పనే సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నది గనుక అక్కడ కూడా సంఘ్ పరివార్ దృష్టి పడుతున్నది. అక్కడ ఒకవైపు సంఘ్ పరివార్ అబద్ధాల పరిశ్రమ కూడా దేశ వ్యాప్తంగా అనేక కార్ఖానాలు ఏర్పాటు చేసి, ఉద్యోగులతో అబద్ధాలు, స్వోత్కర్షాలు, ఇతరుల మీద నిందలు, దాడి చేయమని రెచ్చగొట్టడాలు సాగిస్తున్నది. మరొకవైపు సోషల్ మీడియా ప్లాట్ ఫారాలలో వెలువడుతున్న విషయాల మీద నిఘా పెట్టడానికి, వాటిని ఆపివేయడానికి చట్టాలు తయారు చేస్తున్నది. మొత్తం మీద ప్రజలకు చైతన్యం అందడానికి వీలు లేదు. మరొక అభిప్రాయం ఉండే అవకాశం ఉందని తెలియడానికి వీలు లేదు. కాళ్ళకూ చెవులకూ గంటలు కట్టుకుని ఏలినవారి భజన చేసే సమాజం కావాలి. అదీ సంఘ్ పరివార్ ధ్యేయం. ఆ ధ్యేయంలో భాగమే మోశాల పోస్టల్ రేట్ల పెంపు నిర్ణయం.





