రాష్ట్ర ప్రాజెక్టులపై అనేకమార్లు కేంద్రానికి నివేదించాం
•గత పదేళ్లలో కాలయాపన చేసిన బిఆర్ఎస్
: రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి27: తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తమ నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ సంప్రదించలేదని రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదని.. ప్రధాని వొస్తే కేసీఆర్ కలవడం లేదని ఏదేదో చెప్పి కాలం గడిపారని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎంపీలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని చాలాసార్లు కలిసి అడిగామని గుర్తుచేశారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులు అడుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం హుస్నాబాద్ టౌన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వోటు హక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వినియోగిం చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఇప్పటి వరకు మెట్రో మలిదశ , మూసీ, ఓఆర్ఓఆర్, ట్రిపుల్ ఆర్ , హైదరాబాద్ తాగునీటి సమస్య ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించామని తెలిపారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు నెరవేర్చాల్సి ఉందని అన్నారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు తేకపోతే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వేరు కాదని గమనించాల్సి వొస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తి అని ముందు నుంచి చెబుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా తీసుకున్న కుల సర్వేపై మొదటి వారంలో శాసన సభలో చట్టం చేసి రాజకీయ విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేసే తీర్మానాన్ని చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి షెడ్యూల్లో మార్చుకున్నారో అదేవిధంగా దీనిని కూడా దాని మాదిరిగానే మార్చాల్సిందేనని.. రాజకీయ కారణం చూపిస్తే సరిపోదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గుజరాత్లో ప్రధాని మోదీ స్టేట్మెంట్ ఉంది దాని మాదిరిగానే రిజర్వేషన్లు ఇస్తున్నామని అన్నారు.
కొంతమంది నేతలు తప్పుడు ప్రచారాలు చేసి మత పరమైన పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ – ఇండియా అంటూ నేతలు రెచ్చగొడుతున్నాని ధ్వజమెత్తారు. తమకు తెలంగాణ ప్రయోజనాలు ప్రజల అభివృద్ధి ముఖ్యమని స్పష్టం చేశారు. తమిళనాడులోఎన్ని రాజకీయ విభేదాలు ఉన్న అభివృద్ధి ప్రయోజనాలు విషయంలో అందరూ ఒక్క మాట మీదనే ఉంటారని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కేంద్రంలో ఉన్న బీజేపీ కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలని కోరారు. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యతని.. లేదంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ మాటలు వింటే నవ్వు వొస్తోందని విమర్శించారు. దిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే ట్వీట్ చేస్తున్నారు.. పంటలు ఎండిపోతే ట్వీట్ చేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం తాగు, సాగు నీటికి చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.