హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాసదీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.
దేశవ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతాయన్నారు. గరళాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమాశంకరుని కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలకు ఉండాలని, సుఖ శాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేసీఆర్ ఆ మహాశివున్ని ప్రార్థించారు.