- నాకు చాలా గర్వంగా ఉంది
- ‘త్వరలోనే తెలంగాణ రైతులకు శుభావార్త చెబుతా…’
- భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి
- భూములు కోల్పోయిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…
- పని చేసినోళ్లందరికీ కృతజ్ఞతలు
- మూడేండ్లలోనే 165 సామర్ధ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నాం
- నాణ్యమైన ఉచిత కరంటుతో పాటు నీటి తీరువాను రద్దు చేశాం
- భూ నిర్వాసితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తాం
- గజ్వేల్కు మరో ప్రత్యామ్నాయ పట్టణం
- మంత్రి హరీష్రావు, కలెక్టర్ బాగా కష్టపడ్డారు
- కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవ ప్రెస్ మీట్లో సిఎం కేసీఆర్
- విజయవంతం చేసినందుకు హరీష్రావు శుభాకాంక్షలు
కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కేసీఆర్. పక్కన మంత్రి హరీష్రావు
ఇవాళ నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు అపూరపమైన ప్రాజెక్టు. ఆరేండ్ల కిందట అనాథ తెలంగాణ ఉన్న తెలంగాణ నేడు పసిడి పంటల తెలంగాణ అయింది. దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రమొక్కటే 53లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గర్వంగా ఉండటానికి ఇంతకంటే ఏం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని మర్కూక్ మండలంలోని పాములపర్తిలో నిర్మించిన 15టిఎంసిల సామర్ధ్యం గల శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్ను చినజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి అని, కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూ నిర్వాసితులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ప్రాజెక్టు కోసం పని చేసిన ఇతర రాష్ట్రాల కూలీలకు కూడా. అలాగే,అధికారులు, సిబ్బంది ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిర్వాసితుల త్యాగాల వల్ల లక్షలాది ఎకరాల భూములు సాగులోకి వచ్చాయన్నారు.
భూ నిర్వాసితులందరికీ మంచి నష్ట పరిహారం ఇచ్చాం. భూ నిర్వాసితుల త్యాగాలు గుర్తు చేసుకోకుండా ఉండలేమని సీఎం స్పష్టం చేశారు. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు అపూరపమైన ప్రాజెక్టు అని సి కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదో లిఫ్టు కింద కొండపోచమ్మ సాగర్లోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి త్యాగం వల్లేbలక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. మంచి నష్ట పరిహారం ఇచ్చాం. అన్ని విధాలా వారికి ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన తానేదార్పల్లి, బైలాంపూర్, మామిడాల తదితర గ్రామాలకు చెందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. గజ్వేల్ సమీపంలో గజ్వేల్ పట్టణానికి ప్రతిరూపంగా న్యూ గజ్వేల్ పట్టణాన్ని రూపొందించనున్నామన్నారు. 600ఎకరాలలో గజ్వేల్కు ప్రత్యామ్నాయంగా మరో పట్టణం రూపుదిద్దుకుంటుందన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజలకు సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అని చెబుతూ… 165 టిఎంసిల కెపాసిటీతో కొత్త రిజర్వాయర్లు నిర్మించామనీ, ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఏ రాష్ట్రం కూడా నిర్మించలేదన్నారు. మూడు నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామనీ తద్వారా… లక్ష కోట్ల రూపాయాల పంటను తెలంగాణ రైతాంగం సంవత్సరానికి పండించబోతుందన్నారు. దేశంలో 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే.. 53 లక్షలు తెలంగాణ దేశానికి ఇచ్చిందన్నారు.
తెలంగాణ రైతాంగానికి ఇది గర్వకారణం. ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది అని కేసీఆర్ పేర్కొన్నారు. కొండపోచమ్మ సాగర్ నయాగర జలపాతంలా కనిపిస్తోందన్నారు. నాగార్జున సాగర్ కాలువ కంటే కొండ పోచమ్మ సాగర్ కాలువ పెద్దదన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద కాల్వ ఎక్కడా లేదు. నాగార్జున సాగర్ కాలువ 11 వేల క్యూసెక్కులు ఉంటే.. ఇది 11,500 క్యూసెక్కుల ప్రవాహంతో ఉంది. మల్లన్నసాగర్ నుంచి మర్కూక్ పంపు హౌజ్ వరకు 28 కిలోమీటర్ల దూరం ఉంది. 23 కిలోమీటర్ల వరకు ఒక టిఎంసి మాత్రమే వస్తుంది. ఆ ఒక టిఎంసి ఉండే దగ్గర ఈత కొడితే.. కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. వచ్చి కొండపోచమ్మ సాగర్లో తేలే అవకాశం ఉంది. దీనిపై ప్రజలను, పిల్లలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడక్కడ ఘాట్లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించానని సిఎం తెలిపారు. జిల్లా అధికారులు సూచించిన ప్రాంతాల్లోనే పిల్లలు, పెద్దలు స్నానం చేయాలని కూడా సూచించారు. ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామో ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ అపురూపమైన ప్రాజెక్టు అని సీఎం వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే దుమ్ముగూడెం దగ్గర సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టు కోసం సమ్మక్క సాగర్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. హుస్నాబాద్ దగ్గర గౌరవెళ్లి, గండిపెల్లి ప్రాజెక్టు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ పేరుతెచ్చుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం కష్టాల పాటలు పాడుకున్న తెలంగాణ ఇప్పుడు పసిడి పంటల రాష్ట్రంగా మారిందని కేసీఆర్ వెల్లడించారు.
మంచి కథనాలు రాసిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై అద్భుతంగా కథనాలు రాసిన జర్నలిస్టులందరికీ తెలంగాణ ప్రజల తరపున నా కృతజ్ఞతలు అని సిఎం కేసీఆర్ అన్నారు. రైతులు బాగుంటేనే పల్లెలు సుసంపన్నంగా ఉంటాయనీ, సింగూరు ఎత్తిపోతల ద్వారా జహీరాబాద్కు నీరందిస్తామనీ, మంజీరా, హల్దీ వాగులను జీవనదులుగా మారుస్తామన్నారు. రాష్ట్ర 4వేల కోట్ల రూపాయలతో చెక్డ్యాంల నిర్మాణం చేపడుతామనీ, వీటన్నింటి ద్వారా జీవవైద్య తెలంగాణ ఆవిష్కృతమవుతుందనీ సిఎం కేసీఆర్ చెప్పారు.
ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణం…
తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు ప్రత్యక్ష తార్కాణం కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ఇంజినీర్లు ఎంత శక్తిమంతులో, నైపుణ్యవంతులో రుజువు చేసిందని కొనియాడారు. కాళేశ్వరానికి 4,800 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తున్నామని, పేరున్న కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయని పేర్కొన్నారు. దీంతో తెలంగాణకు 165 టీఎంసీల నూతన సామర్థ్యం వచ్చి చేరిందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే, ప్రాజెక్టు పూర్తైందని అన్నారు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రాజెక్ట్ కోసం పనిచేసిన..ఇతర రాష్ట్రాల కూలీలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి వచ్చానని, అందరి కష్టాల ఫలితమే తెలంగాణ అద్భుతంగా తయారు కావాలని, అందరూ ఆశించిన రీతిలో ఫలితం కళ్లముందు కనిపిస్తోందని కేసీఆర్ ప్రకటించారు.
మంత్రి హరీష్రావు, కలెక్టర్ పరపతి బాగా కష్టపడ్డారు…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరోసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, జిల్లా కలెక్టర్ పరపతి వెంకట్రామిరెడ్డిని మెచ్చుకున్నారు. వారి కష్టాన్ని గుర్తించారు. సిద్ధిపేట జిల్లాలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మొదటి నుంచి మంత్రి తన్నీరు హరీష్రావు, జిల్లా కలెక్టర్ పరపతి వెంకట్రామిరెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు, ఏజెన్సీ సంస్థలు బాగా కష్టపడ్డారని అన్నారు. స్థల సేకరణ మొదులుకుని ప్రాజెక్టు నిర్మాణం, ప్రారంభోత్సవం వరకు మంత్రి హరీష్రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చాలా కష్టపడ్డరంటూ మీడియా ప్రతినిధులు సమావేశంలో సిఎం కేసీఆర్ ప్రశంసించారు. ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు హరీష్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి, జిల్లా కలెక్టర్ పరపతి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు హరీష్రావు శుభాకాంక్షలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొండ పోచమ్మ సాగర్ జల పండుగను విజయవంతం చేసిన జిల్లా అధికారిక వర్గాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీ రావు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్తో కొండ పోచమ్మ సాగరులోకి నీటి విడుదల సందర్భంగా నాలుగు రోజులుగా అహర్నిశలు పనిచేసిన రెవెన్యూ, ట్రాన్స్ కో, పోలీస్, ఇరిగేషన్, ఇంజనీరింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డివిజన్, మండలాల పాత్రికేయులకు పేరు పేరునా మంత్రి హరీష్రావు కృతజ్ఞతలు తెలిపారు.